లంబసింగిలో కుంకుమ సాగుకు ముందుకొస్తున్న ప్రైవేట్ ఏజెన్సీలు.. ప్రస్తుతానికి 10 ఎకరాలు!
ఇటీవల సీఎం చంద్రబాబు లంబసింగిలో పీపీపీ విధానంలో కుంకుమసాగు గురించి ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీనిపై కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలు ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఏఎస్ఆర్ జిల్లాలోని లంబసింగిలో కుంకుమ పువ్వులను పండించడానికి ప్రైవేట్ ఏజెన్సీలు ముందుకు వస్తున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల అధికారులను పీపీపీ పద్ధతిలో సాగు చేయడానికి ప్రైవేట్ ఏజెన్సీలను ప్రోత్సహించాలని, గిరిజన వర్గాలను కూడా భాగస్వామ్యం చేయాలని వ్యాఖ్యానించారు. లంబసింగిలో ఈ కుంకుమపువ్వు సాగు కోసం ఒక ప్రైవేట్ ఏజెన్సీ 10 ఎకరాలు కోరిందని జిల్లా ఉద్యానవన అధికారి కర్ణ తెలిపారు.

భూమి, సాంకేతిక నైపుణ్యాన్ని అందిస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం సెరికల్చర్ విభాగానికి చెందిన 18 ఎకరాల భూమిని గుర్తించినట్టుగా సమాచారం. అందులో 10 ఎకరాలు ఏజెన్సీకి ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. ఏజెన్సీ ఇప్పటికే విదేశాల నుండి విత్తనాలు సేకరించిందని, త్వరలో మరో కీలక అడుగు పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ పంట అధిక వాణిజ్య విలువను కలిగి ఉంటుంది. ఎండిన పువ్వులను రిటైల్ మార్కెట్లో మంచి ధరకు అమ్ముకోవచ్చు.
చింతపల్లిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలోని శాస్త్రవేత్తలు 2023లో ప్రయోగాత్మక ప్రాతిపదికన ఈ పంటను పండించడంలో విజయం సాధించారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 2023లో వేర్వేరు వాతావరణ పరిస్థితులలో కొమ్మలను నాటారు. వాటిని పలు ప్రదేశాలలో పెంచారు. షెడ్యూల్ ప్రకారం.. ఆగస్టు, అక్టోబర్ మధ్య మొత్తం 6,500 కొమ్మలను నాటారు. అయితే పలు పద్ధతుల్లో వీటిని పెంచారు. ఇందులో కొన్ని సక్సెస్ అయ్యాయి. ఎలాంటి ప్రదేశాల్లో వీటి పెరుగుదల ఎక్కువగా ఉంటుందో ఇప్పటికే గుర్తించారు. అలానే పెంచనున్నారు.
సముద్ర మట్టానికి 1,500 నుండి 2,800 మీటర్ల ఎత్తులో సమశీతోష్ణ పొడి వాతావరణంలో కుంకుమ పువ్వు బాగా వృద్ధి చెందుతుందని అధికారులు చెప్పారు. కుంకుమ పువ్వుకు అవసరమైన ఉష్ణోగ్రత 23 డిగ్రీల నుండి 27 డిగ్రీల వరకు ఉంటుంది. అవి పుష్పించడానికి 17 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు అవసరం. ప్రపంచవ్యాప్తంగా కుంకుమ పువ్వు మొత్తం వార్షిక ఉత్పత్తి సంవత్సరానికి 300 టన్నులు. ఇరాన్ కుంకుమ పువ్వును అత్యధికంగా ఉత్పత్తి చేస్తుంది. తరువాత స్పెయిన్, భారతదేశం ఉన్నాయి.
ఇటీవల వ్యవసాయం, అనుబంధ రంగాల పనితీరును సమీక్షించిన సీఎం చంద్రబాబు.. స్థానిక గిరిజన వర్గాల భాగస్వామ్యంతో పీపీపీ విధానంలో కుంకుమ పువ్వు సాగు చేయాలని పేర్కొన్నారు. 'గిరిజనుల భాగస్వామ్యంతో పీపీపీ మోడల్ కింద లంబసింగిలో పెద్ద ఎత్తున కుంకుమ సాగును చేసేందుకు సిద్ధంగా ఉన్న కంపెనీలకు అనుమతి ఉంటుంది.' అని చంద్రబాబు తెలిపారు.

E-Paper












