...
...
Next Story

రాష్ట్రంలో 650 కేంద్రాల ద్వారా తక్కువ ధరకే క్వాలిటీ రైస్.. ఫ్యామిలీకి 10 కిలోలు

ఆంధ్రప్రదేశ్‌లో తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని కూటమి ప్రభుత్వం అందిస్తోంది. ఇందుకోసం రైతు బజార్లు, అవుట్‌లెట్లలో విక్రయాలను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు.

Published on: Aug 2, 2026, 18:15:10 IST
Advertisement

విజయవాడ ఆటోనగర్‌లోని ఏపీఐఐసీ రైతు బజార్‌లో వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. వినియోగదారులకు భారీ ఊరటగా రూ.52కే కిలో నాణ్యమైన సన్న బియ్యం అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం.

ఏపీలో తక్కువ ధరకే క్వాలిటీ రైస్
ఏపీలో తక్కువ ధరకే క్వాలిటీ రైస్

150 రైతు బజార్లు, 500 రైస్‌మిల్ అవుట్‌లెట్లలో విక్రయాలు ప్రారంభం అయ్యాయి. ధరల స్థిరీకరణకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. బియ్యం ధరల పెరుగుదల నేపథ్యంలో వినియోగదారులకు ఉపశమనం కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.

బహిరంగ మార్కెట్‌లో కిలోకు సుమారు రూ.10 వరకు ధరలు పెరిగినట్లు గుర్తించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌తో కలిసి తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం సరఫరా నిర్ణయం తీసుకుంది సర్కార్. బీపీటీ స్టీమ్ రైస్‌ను రూ.64–65 నుంచి తగ్గించి రూ.52కే అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఒక్క కుటుంబానికి 10 కిలోల వరకు ఈ ధరకు బియ్యం కొనుగోలు అవకాశం ఉంటుంది. బీపీటీ పచ్చి బియ్యం రూ.58–60 నుంచి తగ్గించి రూ.50కే విక్రయిస్తున్నారు. సబ్సిడీ ధరల విక్రయాలు రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 2 నుంచే ప్రారంభం అయ్యాయి. రాష్ట్రంలోని రైతు బజార్లు, రైస్‌మిల్ అవుట్‌లెట్ల ద్వారా విస్తృతంగా సరఫరా జరుగుతుంది.

బహిరంగ మార్కెట్ ధరలపై నియంత్రణ సాధించడమే లక్ష్యమని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. దేశంలోనే తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అందించే ప్రత్యేక కార్యక్రమంపై జనాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కావాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కందిపప్పు, పామాయిల్ ధరల నియంత్రణపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. వినియోగదారుల ప్రయోజనాలే లక్ష్యంగా నిరంతర చర్యలు కొనసాగుతాయని మంత్రి నాదెండ్ల అన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe