E20 fuel : ఫ్యూయల్లో ఈ20 పర్సెంటేజ్ని ప్రభుత్వం పెంచుతుందా? క్లారిటీ ఇచ్చిన మంత్రి..
పెట్రోల్లో ఇథనాల్ మోతాదును 20 శాతం కంటే పెంచే ఆలోచన ప్రస్తుతం ప్రభుత్వానికి లేదని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి రాజ్యసభలో స్పష్టం చేశారు. E20 వాడకం వల్ల ఇంజన్లు పాడవుతున్నాయనే విమర్శలను ఆయన తోసిపుచ్చారు.
దేశంలో పెట్రోల్ వాహనదారులను తీవ్రంగా వేధిస్తున్న ఇథనాల్ మిశ్రమం వివాదంపై కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చింది. పెట్రోల్లో ఇథనాల్ శాతాన్ని ఇప్పుడున్న 20 పర్సెంట్ (ఈ20) కంటే పెంచే ఆలోచన ఏదీ ప్రస్తుతానికి లేదని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి స్పష్టం చేశారు. ఇథనాల్ కలపడం వల్ల వాహనాల మైలేజ్ తగ్గిపోతోందని, ఇంజిన్లు పాడవుతున్నాయంటూ వాహనదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం.

గత ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 90,000 పెట్రోల్ బంకుల్లో 20 శాతం ఇథనాల్ కలిపిన 'ఈ20 పెట్రోల్' అమ్మకాలను ప్రభుత్వం ప్రామాణికంగా మార్చింది. అయితే ప్రపంచంలోనే మూడో అతిపెద్ద కార్ల మార్కెట్ అయిన భారత్లో ఈ నిర్ణయంపై వాహనదారుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ20 ఇంధనం వాడటం వల్ల మైలేజ్ పడిపోవడమే కాకుండా, వాహనాల కీలక భాగాలు దెబ్బతింటున్నాయని చాలామంది ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఈ ఇథనాల్ మోతాదును మరింత పెంచుతారని ప్రచారం జరగడంతో ఈ విమర్శలు మరింత తీవ్రమయ్యాయి.
ఈ ఆందోళనలపై రాజ్యసభలో ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. భవిష్యత్తులో ఇథనాల్ శాతాన్ని పెంచాల్సి వస్తే.. వాహన తయారీదారులు, చమురు విక్రయ సంస్థలు, ఇథనాల్ సరఫరాదారులు సహా సంబంధిత భాగస్వాములందరితో విస్తృతంగా చర్చలు జరిపి, లోతైన సాంకేతిక, శాస్త్రీయ అధ్యయనాల తర్వాతే నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
ఈ10కి వెళ్లే ప్రసక్తే లేదు!
అదే సమయంలో, వాహనదారులకు మరొక విషయాన్ని కూడా మంత్రి స్పష్టం చేశారు. ఇథనాల్ మోతాదును తక్షణమే పెంచకపోయినప్పటికీ, పాత పద్ధతి అయిన ఈ10 (10% ఇథనాల్)కి లేదా కేవలం స్వచ్ఛమైన పెట్రోల్కు తిరిగి వెళ్లే ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదన్నారు. అధునాతన, పర్యావరణహిత ఇంధనంతోనే ముందుకు సాగాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు.
ఈ20 పెట్రోల్ వాడటం వల్ల వాహనాల్లో ఇంజిన్ వైఫల్యాలు, భాగాలు తుప్పు పట్టడం, ఫ్యూయల్ పంప్ సమస్యలు లేదా మైలేజ్ తగ్గడం వంటి ఫిర్యాదులేవీ ప్రభుత్వానికి అధికారికంగా రాలేదని మంత్రి వెల్లడించారు. ఈ10 కోసం డిజైన్ చేసిన పాత వాహనాల్లో ఈ20 వాడినప్పుడు మైలేజ్లో కేవలం 3 నుంచి 5 శాతం మాత్రమే స్వల్ప తేడా ఉంటుందని వివరించారు.
“ఒకవేళ ఇథనాల్ కలపడం వల్ల ఇంజిన్లు లేదా ఫ్యూయల్ సిస్టమ్లు దెబ్బతింటే.. భారీ సంఖ్యలో వారంటీ క్లెయిమ్లు, కంపెనీల సర్వీస్ క్యాంపెయిన్లు, పెద్ద ఎత్తున వినియోగదారుల ఫిర్యాదులు వచ్చి ఉండేవి. కానీ దేశంలో ఇప్పటివరకు అలాంటిది ఏదీ నమోదు కాలేదు,” అని సురేష్ గోపి స్పష్టం చేశారు.
23 కోట్లకు పైగా వాహనాలు రోడ్లపై సురక్షితం..
ఈ20 సర్టిఫికేషన్ రాకముందు తయారైన పాత వాహనాలతో సహా దేశంలో దాదాపు 20 కోట్లకు పైగా ద్విచక్ర వాహనాలు, 3 కోట్లకు పైగా పెట్రోల్ కార్లు ఈ ఇంధనంతోనే ఎలాంటి ప్రధాన సాంకేతిక లోపాలు లేకుండా సజావుగా నడుస్తున్నాయని మంత్రి తెలిపారు.
ఈ మార్పు ఒక్కరోజులో వచ్చింది కాదని, 2013-14లో కేవలం 1.53 శాతంగా ఉన్న ఇథనాల్ మిశ్రమాన్ని దశలవారీగా, ఆధారాలతో కూడిన అధ్యయనాల ఆధారంగానే 2025-26 నాటికి 20శాతానికి పెంచామని ఆయన స్పష్టం చేశారు. ప్రతి దశలోనూ నిపుణుల కమిటీలు, పరిశ్రమ వర్గాల సలహాలు తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్లామని ప్రభుత్వం పేర్కొంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


