తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఏపీ వెదర్ రిపోర్ట్….

ఇవాళ, రేపు కోస్తాంధ్ర జిల్లాలతో పాటు రాయలసీమలోని నంద్యాల, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఈ సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలంగాణలోనూ వర్షాలు….
హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన వివరాల ప్రకారం…. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల్లో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే సూచనలున్నాయి.
ఇక ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
వర్షాలు, ఈదురుగాలులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది. వర్షం కురిసే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని పేర్కొంది. పొలాల్లో పనిచేసే రైతులు, శ్రామికులు, పశువుల కాపరులు పిడుగులు పడే సూచనలు కనిపించగానే సురక్షితమైన భవనాల్లో లేదా ఆశ్రయ ప్రాంతాల్లో ఉండాలని వివరించింది.