...
...
Next Story

విద్యుత్ భారం తగ్గేలా సంస్కరణలు, ఎనర్జీ యూనివర్సిటీ ఏర్పాటు : సమీక్షలో చంద్రబాబు

CM Chandrababu : విద్యుత్ సంస్థల రుణాలు తీరేలా ప్రణాళిక ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఆవిష్కరణల కోసం ఇంక్యుబేషన్ ఫండ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రజలపై విద్యుత్ భారం తగ్గేలా సంస్కరణలు తీసుకురావాలన్నారు.

Published on: Mar 24, 2026, 21:25:39 IST
Advertisement

విద్యుత్ కొనుగోలు ఛార్జీలను తగ్గించే అంశంపై అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇప్పటికే ఈ దిశగా చేపడుతున్న చర్యలను మరింత ముమ్మరం చేయాలన్నారు. ప్రభుత్వం చేపట్టే విద్యుత్ కొనుగోలు ధరను యూనిట్‌కు రూ.4కు తగ్గించటంతో పాటు ప్రజలపై భారం వేయకుండా విద్యుత్ సంస్థల రుణాలు తీర్చేందుకు కార్యాచరణ చేపట్టాలని సూచించారు. సచివాలయంలో జరిగిన విద్యుత్ శాఖ సమీక్షలో సీఎం కీలక సూచనలు చేశారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

2028-29 నాటికి విద్యుత్ కొనుగోళ్ల ఖర్చును తగ్గించేందుకు చేపట్టిన ప్రణాళికలను విద్యుత్ శాఖ అధికారులు సీఎం చంద్రబాబు ముందుంచారు. విద్యుత్ రంగంలోని వివిధ విభాగాల ద్వారా సంస్కరణలు చేపడితే మొత్తంగా యూనిట్ కు రూ.1.32 చొప్పున విద్యుత్ కొనుగోలు భారాన్ని తగ్గించవచ్చని ముఖ్యమంత్రికి వివరించారు. 2028-29 నాటికి యూనిట్ కొనుగోలు ధరను రూ.4.10కు తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు వివరించారు.

రూ.4కు ఈ కొనుగోలు ధరను తగ్గించేలా చూడాలని సీఎం ఆదేశించారు. నూతన టెక్నాలజీని, ఇన్నోవేషన్లను వినియోగించుకుని విద్యుత్ పొదుపు చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. విద్యుత్ సంస్థల సమర్థ నిర్వహణతో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సుమారు రూ.339 కోట్ల మేర ఆదా చేశామని.. ఈ తరహా పొదుపు చర్యలను మరింతగా తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి చెప్పారు.

'ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలను తెచ్చాం. దీని ఫలితాలు ప్రజలకు అందుతున్నాయి. ప్రజలకు మేలు చేయడానికి రిస్క్ తీసుకుని మరీ విద్యుత్ సంస్కరణలు అమలు చేశాం. ఎనర్జీ ఆడిటింగ్ అనే విధానాన్ని ఉమ్మడి రాష్ట్రంలోనే దేశంలో తొలిసారిగా చేపట్టాం. ఇప్పుడు విద్యుత్ రంగంలో అనేక మార్పులు వస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు పడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఎనర్జీ రంగం గేమ్ ఛేంజర్ కానుంది. తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి, పర్యావరణ హిత విద్యుత్ ఉత్పత్తి వంటి అంశాలపై ప్రపంచ దేశాలు మొగ్గు చూపుతున్నాయి.' అని చంద్రబాబు అన్నారు.

'ఎనర్జీ రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండండి. ఇతర దేశాల్లో విద్యుత్ రంగంలో జరుగుతున్న పరిణామాల్ని అధ్యయనం చేయండి. టెక్నాలజీని అందిపుచ్చుకునేలా ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్ ను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. విద్యుత్ రంగంలోని టెక్నాలజీలను.. ఇన్నోవేషన్లను ప్రొత్సహించేలా ఎనర్జీ యూనివర్శిటీని ఏర్పాటు చేయాలి. విద్యుత్ రంగంలో ఆవిష్కరణలను ప్రొత్సహించాలి.' అని చంద్రబాబు చెప్పారు.

స్టార్టప్ కంపెనీలకు అవసరమైన మేరకు మార్జిన్ మనీ సమకూర్చేలా విద్యుత్ సంస్థలు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. దీని కోసం ప్రత్యేకంగా ఇంక్యుబేషన్ ఫండ్ ఏర్పాటు చేసి స్టార్టప్ కంపెనీలకు ఆర్థికంగా చేయూత అందించాలన్నారు. ఇతర రాష్ట్రాల సంస్థలకు కన్సల్టెన్సీ సేవలు అందించేలా ఏపీ విద్యుత్ సంస్థలు ఎదగాలన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe