SIR Process in Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్వహించిన సమగ్ర ఓటర్ల సవరణ (SIR) ప్రక్రియలో కీలక దశ పూర్తయింది. ఈ ప్రక్రియకు సంబంధించి డిజిటలైజేషన్ పనులన్నింటినీ అధికారులు క్షేత్రస్థాయిలో పూర్తి చేశారు. ఈ సవరణల ఆధారంగా రూపొందించే కొత్త ఓటర్ల జాబితా విడుదలపై ఎన్నికల సంఘం పలు వివరాలను వెల్లడించింది.
44 లక్షలకు పైగా 'అన్కలెక్టబుల్' ఓటర్లు….

ఏపీలోని మొత్తం ఓటర్ల సంఖ్యలో 44,71,523 మందిని 'అన్కలెక్టబుల్' ఓటర్లుగా అధికారులు గుర్తించారు. స్థానికంగా అందుబాటులో లేకపోవడం, చిరునామా మారడం లేదా మరణించడం వంటి వివిధ సాంకేతిక, క్షేత్రస్థాయి కారణాలతో వీరిని ఈ జాబితాలో చేర్చారు. రాష్ట్రంలోని మొత్తం ఓటర్ల సంఖ్యతో పోల్చి చూస్తే…. ఈ అన్కలెక్టబుల్ ఓటర్ల శాతం ఏకంగా 10.74 శాతంగా నమోదుగా ఉంది. వీటిలో అత్యధిక వాటా మరణించిన ఓటర్లదే. వీరి సంఖ్య 15,19,558 (3.65శాతం)గా గుర్తించారు.
అన్కలెక్టబుల్ ఓటర్ల సంఖ్య అత్యధికంగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉన్నట్లు లెక్కలు సూచిస్తున్నాయి. ఆ తర్వాత స్థానాల్లో తిరుపతి, కడప, విశాఖ గుంటూరు ఉన్నాయి. ఇవే కాకుండా మిగిలిన జిల్లాల్లోనూ కొన్ని ఓట్లు తొలగించాల్సిన జాబితాలో ఉన్నాయి.
సవరించిన వివరాల ఆధారంగా ఓటర్ల ముసాయిదా జాబితాను ఈ నెల 31వ తేదీన అధికారికంగా విడుదల చేయడానికి ఎన్నికల యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఈ ముసాయిదా జాబితా వెలువడిన తర్వాత…. అభ్యంతరాలు లేదా సవరణలు ఉంటే దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు తగిన సమయాన్ని కేటాయిస్తారు. ఆపై క్షేత్రస్థాయి పరిశీలనలు…. వచ్చిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిష్కరించిన తర్వాత, అక్టోబర్ 3వ తేదీన ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేయనుంది.
- ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ: 31.07.2026న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు.
- అభ్యంతరాలు, క్లెయిమ్ల దాఖలు : కొత్త ఓటర్ల నమోదు, మార్పులపై అభ్యంతరాలు, క్లెయిమ్లను సమర్పించడానికి 31.07.2026 నుండి 30.08.2026 వరకు సమయం ఉంటుంది.
- నోటీసుల దశ / క్లెయిమ్లు, అభ్యంతరాల పరిష్కారం: సమర్పించిన అభ్యంతరాల పరిశీలన, పరిష్కార ప్రక్రియను 31.07.2026 నుండి 28.09.2026 వరకు చేపడతారు.
- తుది ఓటర్ల జాబితా ప్రచురణ : అన్ని సవరణలు పూర్తి చేసిన అనంతరం తుది ఓటర్ల జాబితాను 03.10.2026న అధికారికంగా ప్రచురిస్తారు.