SIR in Telangana : 99 శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి - జూలై 30న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల..!
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (SIR) ప్రక్రియ ముగింపు దశకు చేరింది. ఇప్పటివరకు 99 శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయింది. జూలై 30న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి వెల్లడించారు.
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ అత్యంత వేగంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో ఓటర్ల నమోదు, వెరిఫికేషన్ ప్రక్రియకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ దాదాపు చివరి దశకు చేరుకుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సి. సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 99 శాతం ఫారాల పంపిణీ పూర్తయినట్లు ఆయన ప్రకటించారు.

ఈ ప్రక్రియ పురోగతిపై సుదర్శన్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ చాలా పారదర్శకంగా సాగుతోందని…. క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్ అధికారులు (బీఎల్ఓలు) విస్తృతంగా పర్యటిస్తున్నారని చెప్పారు. ప్రజల ఇళ్ల వద్దకే ఎన్యూమరేషన్ ఫారాలు చేరాయని, ప్రజలు వీటిని నింపి వీలైనంత త్వరగా బీఎల్ఓలకు సమర్పించాలని ఆయన కోరారు.
జూలై 24 వరకు గడువు.. జూలై 30న ముసాయిదా
రాష్ట్రంలో ఓటర్లు తమ వివరాలను పూరించి, ఫారాలను సమర్పించడానికి ఈ నెల 24వ తేదీ వరకు గడువు ఉందని సీఈఓ వివరించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన ఫారాలలో 28 శాతం పూరించిన దరఖాస్తులు తిరిగి అధికారులకు అందాయని ఆయన పేర్కొన్నారు.
మిగిలిన 72 శాతం ఫారాలను సేకరించేందుకు రాబోయే 15 రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుందని… జూలై 24 నాటికి ఈ ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తిగా ముగుస్తుందని తెలిపారు. ఆ తర్వాత లోపాలు లేని ముసాయిదా ఓటర్ల జాబితాను జూలై 30న అధికారికంగా ప్రచురిస్తామని… ఆ తర్వాత అభ్యంతరాలు, క్లెయిమ్ల స్వీకరణకు నోటీసుల కాల వ్యవధి ప్రారంభమవుతుందని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలో భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ఓటర్ల జాబితాను సర్వాంగ సుందరంగా, పారదర్శకంగా మార్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ ప్రత్యేక ముమ్మర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కసరత్తు జూన్ 15న డిజిటల్ మ్యాపింగ్ ప్రక్రియతో అధికారికంగా ప్రారంభం కాగా… జూన్ 25 నుంచి బీఎల్ఓల ద్వారా ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాల సేకరణ (ఎన్యూమరేషన్ డ్రైవ్) ప్రారంభించారు.
గడువు పెంచాలని డిమాండ్…
మరోవైపు తెలంగాణలో ప్రస్తుతం సాగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ గడువును మరో నెల రోజుల పాటు పొడిగించాలని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) డిమాండ్ చేసింది. ఈ మేరకు బీఆర్ఎస్ నేత సోమా భరత్ కుమార్ శుక్రవారం దిల్లీలో కేంద్ర ముఖ్య ఎన్నికల కమిషనర్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

