...
...
Next Story

పాము కాటుకు 108 అంబులెన్స్‌లోనే విరుగుడు.. ఏపీ ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్!

ఆంధ్రప్రదేశ్‌లో పాముకాటు కేసులు ప్రాణనష్టాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 108 అంబులెన్స్‌లలో పాముకాటు విరుగుడు మందును ఉంచేందుకు పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. వైద్యుల పర్యవేక్షణలో ఈ మందును అందిస్తారు.

Published on: Aug 9, 2026, 06:46:34 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో పాము కాటు మరణాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన వినూత్న పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. బాధితులకు సకాలంలో వైద్యం అందించి ప్రాణాలు కాపాడేందుకు 108 అంబులెన్సుల్లోనే ‘యాంటీ స్నేక్ వెనమ్’ (ASV) టీకాలను అందుబాటులో ఉంచారు. మంగళగిరిలోని ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ వైద్యుల పర్యవేక్షణలో అంబులెన్స్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు ఈ ఇంజెక్షన్‌ను బాధితులకు అందిస్తారు.

108లో పాముకాటుకు విరుగుడు
108లో పాముకాటుకు విరుగుడు

పాము కాటుకు గురైన బాధితుడికి అత్యంత కీలకమైన గోల్డెన్ అవర్‌లోనే ప్రాణరక్షణ చికిత్స అందించడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. జూన్ 2025 నుండి ఇప్పటివరకు పాము కాటుకు సంబంధించి 108 నంబర్‌కు ఏకంగా 3,104 ఎమర్జెన్సీ కాల్స్ వచ్చాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇప్పటికే కడప, నంద్యాల, కర్నూలు జిల్లాలకు చెందిన ముగ్గురు బాధితులకు అంబులెన్స్‌లోనే ఏఎస్‌వీ అందించడం ద్వారా ప్రాణాలు కాపాడగలిగారు.

బాధితులు ఆసుపత్రికి చేరుకోవడానికి ముందే చికిత్స ప్రారంభమయ్యేలా 108 అంబులెన్సుల్లో ఏఎస్‌వీ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. పాము కాటు అత్యవసర పిలుపు రాగానే 108 అంబులెన్స్ సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని అంబులెన్స్‌లోకి ఎక్కిస్తారు. అంబులెన్స్‌లోని ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ బాధితుడి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తారు.

అదే సమయంలో అంబులెన్స్‌లో అమర్చిన ప్రత్యేక డామ్ కెమెరా ద్వారా మంగళగిరి ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్‌లోని వైద్యులు రోగి పరిస్థితిని లైవ్‌లో పరిశీలిస్తారు. రోగి పరిస్థితి ఆధారంగా ఏఎస్‌వీ ఇవ్వాలా వద్దా అనేది వైద్యులు సూచిస్తారు. వైద్యుల సూచన మేరకు ఈఎమ్‌టీలు మాత్రమే ఏఎస్‌వీ అందిస్తారు. అనంతరం తదుపరి చికిత్స కోసం బాధితుడిని సమీప ఆసుపత్రికి తరలిస్తారు.

గతంలో జూన్ 2025కి ముందు బాధితుల్లో కేవలం 34 శాతం మంది మాత్రమే అంబులెన్స్ నెట్‌వర్క్ ద్వారా ఆసుపత్రులకు చేరుకోగా, ఆ తర్వాత ఈ సంఖ్య ఏకంగా 95 శాతానికి పెరిగింది. ఇది బాధితులు గోల్డెన్ అవర్‌లో ఆసుపత్రులకు చేరుకోవడానికి ఎంతో సహాయపడింది.

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వారానికి ఒకటి లేదా రెండు పాము కాటు కేసులు వస్తున్నాయని, చాలామంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రాథమిక చికిత్స పొందిన తర్వాత ఇక్కడికి వస్తున్నారని మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ దుర్గా ప్రసాద్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో నెలకు 15 నుండి 20 కేసులు వస్తున్నాయని, అవసరమైన వారందరికీ ఏఎస్‌వీ అందిస్తున్నామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రవణ్ బాబు వివరించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe