తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) మరో గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీ, డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని ధర్మవరం - నాందేడ్ - ధర్మవరం మధ్య నడుస్తున్న ప్రత్యేక రైలు సేవలను క్రమబద్ధీకరించింది దీని స్థానంలో సరికొత్త వీక్లీ ఎక్స్ప్రెస్ రైలు సర్వీసును రైల్వే శాఖ అధికారికంగా ఆమోదించింది. ఈ కొత్త రైలు సర్వీస్ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రల్లోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణం మరింత సులభతరం కానుంది.
- రైల్వే శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం…. రైలు నంబర్ 17635/17636 నాందేడ్ - ధర్మవరం - నాందేడ్ వీక్లీ ఎక్స్ప్రెస్ రెగ్యులర్ సర్వీసులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
- రైలు నంబర్ 17636 (ధర్మవరం - నాందేడ్): ఈ సర్వీస్ మే 17, 2026 నుంచి అందుబాటులోకి వచ్చింది.
- రైలు నంబర్ 17635 (నాందేడ్ - ధర్మవరం): ఈ సర్వీస్ మే 22, 2026 నుంచి ప్రతి శుక్రవారం అందుబాటులోకి రానుంది.
- ఈ రైలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని నిజామాబాద్, వరంగల్, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి మీదుగా ప్రయాణిస్తుంది.
టైమింగ్స్ వివరాలు:

ఈ రైలు ప్రతి శుక్రవారం సాయంత్రం 16:45 గంటలకు నాందేడ్లో బయలుదేరుతుంది. నిజామాబాద్ కు 18:58 గంటలకు, వరంగల్ - 23:48 గంటలకు చేరుకుంటుంది. ధర్మవరానికి శనివారం రాత్రి 19:30 గంటలకు చేరుతుంది.
ధర్మవరం - నాందేడ్ ఎక్స్ప్రెస్ (రైలు నంబర్ 17636) ఈ రైలు ప్రతి ఆదివారం తెల్లవారుజామున 05:25 గంటలకు ధర్మవరంలో బయలుదేరుతుంది. కదిరికి 06:23 గంటలకు, తిరుపతికి 10:30 గంటలకు, విజయవాడకు సాయంత్రం 18:35 గంటలకు చేరుకుంటుంది. నాందేడ్ కు సోమవారం ఉదయం 08:05 గంటలకు చేరుకుంటుంది.
ఈ రెండు సర్వీసులు ముద్ఖేడ్, బాసర, ఆర్మూర్, కోరుట్ల, లింగంపేట జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట, మహబూబాబాద్, ఖమ్మం, తెనాలి, బాపట్ల, చీరాల, పాకాల, మదనపల్లె రోడ్ స్టేషన్లలో కూడా ఆగుతాయి.
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా ఈ రైలులో విభిన్న శ్రేణి కోచ్లను ఏర్పాటు చేశారు. ఇందులో మొత్తం 20 కోచ్లు ఉంటాయి. వీటిలో సెకండ్ ఏసీ (2A), థర్డ్ ఏసీ (3A), స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లుంటాయి.
ఈ కొత్త రైలు సర్వీస్ నిజామాబాద్, కరీంనగర్ వంటి ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలకు… అలాగే విజయవాడ, తిరుపతి వైపు వెళ్లే ఏపీ ప్రయాణికులకు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది.