Tirumala Brahmotsavams 2026 : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన 'మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవ' నేడు అత్యంత వైభవంగా జరగనుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
ఇష్ట వాహనంపై మలయప్ప స్వామి దర్శనం

శుక్రవారం(ఇవాళ) రాత్రి 7 గంటల నుండి 9 గంటల మధ్య శ్రీ మలయప్పస్వామివారు తన అత్యంత ఇష్టమైన గరుడ వాహనంపై నాలుగు మాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనభాగ్యం కల్పిస్తారు. ప్రతి ఏటా వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందుగానే ఈ మాదిరి బ్రహ్మోత్సవాలను నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. ప్రధాన ఉత్సవాలకు ముందస్తు ఏర్పాట్లు, భద్రత, రద్దీ నియంత్రణ వంటి అంశాలను బేరీజు వేసుకునేందుకు ఈ వేడుక ఎంతగానో దోహదపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
సెప్టెంబర్ 15 నుండి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
ఈ ఏడాదికి సంబంధించిన శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 15 నుండి సెప్టెంబర్ 23 వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ తొమ్మిది రోజుల పాటు వివిధ వాహనాలపై స్వామివారు భక్తులకు అభయమివ్వనున్నారు. బ్రహ్మోత్సవాలకు దేశ విదేశాల నుండి లక్షలాదిగా తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ యంత్రాంగం ముందస్తు ప్రణాళికలు రచిస్తోంది.
మాదిరి బ్రహ్మోత్సవాలు, రాబోయే సాలకట్ల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆలయ నాలుగు మాడవీధుల్లోని గ్యాలరీలలో భక్తులకు కల్పిస్తున్న వసతులు, తాగునీరు, ఇతర ఇంజినీరింగ్ పనులను వివిధ విభాగాధిపతులతో కలిసి వారు స్వయంగా పరిశీలిస్తున్నారు. భక్తులకు ఏ చిన్న అసౌకర్యం కలగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు.