శ్రీశైలంలో శివస్వాములపై లాఠీ ఛార్జ్.. భక్తుల ఆగ్రహం.. ఇదిగో వీడియో చూడండి

మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం మల్లన్న దర్శనానికి భారీగా భక్తులు వచ్చారు. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు శివస్వాములపై లాఠీ ఛార్జ్ చేశారు. ఇందుకో సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Published on: Feb 10, 2026, 09:45:09 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం శ్రీశైలం ఆలయంలో జనసమూహాన్ని అదుపు చేయడానికి పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. వేలాది మంది శివభక్తులు మల్లన్న దర్శనానకి వచ్చారు. ఉదయం నుంచి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఐదు గంటల నుంచే భక్తులు, శివస్వాములు క్యూలైన్లలో వేచి ఉన్నారు. గంటలు గడుస్తున్నా.. క్యూ లైన్‌లు ముందుకు జరగలేదు. దీంతో భక్తుల్లో అసహనం మెుదలైంది. కనీసం తాగేందుకు కూడా నీరు లేదని ఆగ్రహం వ్యక్తమైంది.

శ్రీశైలం ఆలయం
శ్రీశైలం ఆలయం

దర్శనం కోసం ఎదురుచూసే కొందరు భక్తులు ఉక్కపోత, నీరసంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేదని భక్తులు ఆరోపించారు. ఆలయ ఈవోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాసేపటికే పరిస్థితి చేయిదాటి పోయింది. శివస్వాములు క్యూలైన్ల నుంచి బయటకు వచ్చి నిరసన తెలియజేశారు. దీంతో మల్లన్న ఆలయంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

పోలీసులు అదుపుచేసేందుకు స్వల్ప లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే పోలీసులు లాఠీతో భక్తులను బెదిరిస్తూ, వారిని చెదరగొట్టే ప్రయత్నం చేసినట్టుగా వీడియోలో కనిపిస్తుంది. శివస్వాములపై పోలీసులు లాఠీలు లేపడం ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు.

ఇక చేసేదేమీ లేక చాలా మంది శివస్వాములు రాజగోపురం నుంచే స్వామివారిని దర్శనం చేసుకోకుండానే వెనక్కు తిరిగారు. ఆలయ అధికారుల ప్రకారం, వేలాది మంది భక్తులు, ముఖ్యంగా శివ దీక్ష తీసుకున్నవారు తెల్లవారుజాము నుండే ఆలయం చేరుకున్నారు. కొంతమంది భక్తులు ముఖ్యంగా శివ స్వాములు.. క్యూ లైన్లలో ఎక్కువసేపు వేచి ఉండటంతో ఆందోళనకు గురై ఆలయ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిలో కొందరు బారికేడ్లను దాటి ఆలయ ద్వారాల వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు.

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వీఐపీలకు ప్రాధాన్యత ఇస్తూ తమను గంటల తరబడి వేచి ఉండమని బలవంతం చేశారని శివ స్వాములు ఆరోపించారు. శ్రీశైలం ఆలయ కార్యనిర్వహణాధికారి . శ్రీనివాసరావు క్యూ లైన్ల వద్దకు చేరుకుని ఆందోళన చెందుతున్న భక్తులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు.

11 రోజుల బ్రహ్మోత్సవాలలో మొదటి ఐదు రోజుల్లో శివ దీక్ష భక్తులకు మాత్రమే స్పర్శ దర్శనం అనుమతిస్తామని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. ఇతర భక్తులకు కూడా దర్శనం కల్పించడానికి శివ దీక్ష భక్తులను రెండు గంటల పాటు నిలిపివేస్తారు. ఈ ప్రక్రియలో కొంతమంది భక్తులు అసహనానికి గురై గొడవ పడ్డారని అధికారులు తెలిపారు.

శివ స్వాముల కోసం ప్రత్యేకంగా ఐదు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్లు శ్రీనివాసరావు తెలిపారు. క్యూ కాంప్లెక్స్‌లలో వేచి ఉన్న భక్తులకు నిరంతరం స్నాక్స్, బిస్కెట్లు, తాగునీరు అందిస్తున్నామన్నారు. అత్యవసర నిష్క్రమణలు కూడా సిద్ధంగా ఉన్నాయన్నారు. శివదీక్ష భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ నిర్వహణకు సహకరించాలని, ఓపికగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More