తిరుమల భక్తులకు అలర్ట్ - త్వరలోనే అత్యాధునిక లగేజీ సిస్టమ్! ట్యాగ్ తో ట్రాకింగ్
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం టీటీడీ అత్యాధునిక BLE 5.1 సాంకేతికతతో కూడిన లగేజీ నిర్వహణ వ్యవస్థను తీసుకువస్తోంది. అలిపిరి నుంచి జిఎన్సీ వరకు లగేజీని ఎండ్-టు-ఎండ్ ట్రాక్ చేయవచ్చు.
తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే పవిత్ర భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మరో కీలక అడుగు ముందుకు వేసింది. తిరుమలలో అత్యంత సులభంగా, భద్రంగా లగేజీని పంపిణీ చేసేందుకు గానూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నూతన లగేజీ నిర్వహణ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వహణ విధానంపై టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి మంగళవారం తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో ఉన్న సుధర్మ సమావేశ మందిరంలో జీఎంఆర్ సంస్థ ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు సరికొత్త లగేజీ మేనేజ్మెంట్ విధానంపై అదనపు ఈవోకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమగ్ర వివరణ ఇచ్చారు.
ఎండ్-టు-ఎండ్ ట్రాకింగ్….
విప్లవాత్మక BLE 5.1 (Bluetooth Low Energy) సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఈ నూతన విధానాన్ని రూపకల్పన చేశారు. ఈ వ్యవస్థ ద్వారా భక్తులు అలిపిరి వద్ద లగేజీని అప్పగించిన క్షణం నుంచి, తిరుమలలో తిరిగి పొందేవరకు ప్రతీ దశనూ సాంకేతికత ద్వారా పర్యవేక్షించవచ్చని అధికారులు వెల్లడించారు.
- అలిపిరి వద్ద భక్తుల లగేజీని స్వీకరించి, డిజిటల్ ట్యాగ్ను అనుసంధానిస్తారు.
- వాహనాల ద్వారా తిరుమలలోని జీఎన్సీ (GNC) కౌంటర్ వరకు భద్రంగా తరలిస్తారు.
- జీఎన్సీ వద్ద నిల్వ చేసి భక్తులకు తిరిగి అందించే వరకు ప్రతీ ఘట్టాన్ని 'ఎండ్-టు-ఎండ్' డిజిటల్గా ట్రాక్ చేసే సదుపాయం ఉంటుంది.
- ఈ నూతన వ్యవస్థ సాధారణ రోజుల్లో రోజుకు సుమారు 12 వేల బ్యాగులను, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో గంటకు సుమారు 1,800 బ్యాగులను ఎలాంటి అడ్డంకులు లేకుండా సునాయాసంగా నిర్వహించేలా డిజైన్ చేస్తున్నారు.
ప్రతి లగేజీకి బిఎల్ఈ ట్యాగ్ను అనుసంధానించడం వల్ల అది ఏ ప్రాంతంలో, ఏ డిపార్ట్మెంట్లో ఉందో నిరంతరం గుర్తించవచ్చు. అంతేకాకుండా తిరుమలలో లగేజీ తిరిగి పొందే సమయంలో క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉండకుండా ముందస్తుగా రిక్వెస్ట్ చేసుకునే వెసులుబాటును జీఎంఆర్ ప్రతినిధులు పొందుపరిచారు.
భక్తులు జీఎన్సీ కేంద్రానికి సుమారు 100 మీటర్ల పరిధిలోకి రాగానే తమ మొబైల్ యాప్ లేదా అక్కడ ఏర్పాటు చేసే డిజిటల్ కియోస్క్ల ద్వారా లగేజీ కోసం అభ్యర్థించవచ్చు. అలా కాకుండా నేరుగా కౌంటర్ వద్దకు వచ్చి కూడా లగేజీ రిక్వెస్ట్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. అలిపిరి నుంచి తిరుమలకు లగేజీ రవాణాను డిజిటల్ మానిఫెస్ట్, జీపీఎస్ (GPS) ద్వారా పర్యవేక్షిస్తారు. లగేజీ నిల్వ సామర్థ్యం, భక్తుల రద్దీ, సేవల పరిస్థితిని ఒకే 'కమాండ్ అండ్ కంట్రోల్' వ్యవస్థ ద్వారా పర్యవేక్షిస్తారు.
వేగం, భద్రతకు ప్రాధాన్యత : అదనపు ఈవో
సమీక్ష అనంతరం టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ… "నూతన లగేజీ నిర్వహణ విధానం ద్వారా భక్తులకు మరింత వేగవంతమైన, సౌకర్యవంతమైన సేవలు అందించడమే కాకుండా లగేజీ భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలి" అని అధికారులను ఆదేశించారు. భక్తుల రద్దీకి తగినట్లుగా వ్యవస్థను నడిపేందుకు అవసరమైన మౌలిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానం మరియు సిబ్బంది సమన్వయంపై నిరంతరం దృష్టి పెట్టాలని సూచించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

