తెలుగు రాష్ట్రాలకు వాతావరణ కేంద్రం కీలక అప్డేట్ ఇచ్చింది. పలు ప్రాంతాలకు వర్ష సూచన ఉందని అంచనా వేసింది. కొన్ని జిల్లాలకు మాత్రం ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ బులెటిన్ ప్రకారం.. ఏపీలో పలు ప్రాంతాల్లోని వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ఇవాళ పోలవరం, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో సాధారణ వాతావరణం నెలకొంటుంది. అక్కడక్కడ చెదురుమదురుగా తేలికపాటి జల్లులు మాత్రమే పడతాయని APSDMA స్పష్టం చేసింది.
తెలంగాణ వెదర్ రిపోర్ట్….
తెలంగాణ వ్యాప్తంగా 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.
ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే సూచనలున్నాయి. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. కొన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయి.
ఆగస్టు 21 ఉదయం 08:30 గంటల నుంచి ఆగస్టు 24 ఉదయం 08:30 గంటల వరకు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణం లేదా అక్కడక్కడ మాత్రమే తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ బులిటెన్లో తెలిపింది. ఈ రోజుల కోసం ఎలాంటి ప్రత్యేక హెచ్చరికలు (యెల్లో లేదా ఆరెంజ్ అలర్ట్లు) జారీ చేయలేదు.
మరోవైపు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం…. హైదరాబాద్ సిటీలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. నగరంలో సాయంత్రం లేదా రాత్రి వేళల్లో కొన్ని ప్రాంతాల్లో చాలా తేలికపాటి వర్షం లేదా చినుకులు పడే అవకాశం మాత్రమే ఉంది. నగర పరిసర ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్గా నమోదు కావచ్చు. గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ, వాయువ్య దిశల నుంచి గాలులు వీచే అవకాశం ఉంది.