తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలపై తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటన చేసింది. నవంబరు 17 నుంచి 25వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఇందుకోసం నవంబరు 16వ తేదీన అంకురార్పణ నిర్వహిస్తారు.

బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నవంబరు 11వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపడతారు. బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి…
వాహనసేవల వివరాలు :
- 17-11-2025 (సోమవారం) ధ్వజారోహణం( ధనుర్ లగ్నం) చిన్నశేషవాహనం
- 18-11-2025(మంగళ వారం) పెద్దశేషవాహనం హంసవాహనం
- 19-11-2025(బుధవారం) ముత్యపుపందిరి వాహనం సింహవాహనం
- 20 -11-2025(గురువారం) కల్పవృక్ష వాహనం హనుమంతవాహనం
- 21 -11-2025(శుక్ర వారం) పల్లకీ ఉత్సవం గజవాహనం
- 22-11-2025(శనివారం) సర్వభూపాలవాహనం సా. స్వర్ణరథం, గరుడవాహనం
- 23-11-2025(ఆదివారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
- 24-11-2025(సోమవారం) రథోత్సవం అశ్వ వాహనం
- 25-11-2025(మంగళవారం) పంచమీతీర్థం ధ్వజావరోహణం.
ఈనెల 20న దీపావళి అస్థానం:
తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా అక్టోబరు 20 తేదీన దీపావళి ఆస్థానాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించనుంది. ఈ మేరకు ప్రకటన విడుదలైంది. దీపావళి నాడు ఉదయం 7 నుండి ఉదయం 9 గంటల వరకు బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం జరుగుతుంది.
ఆస్థానంలో భాగంగా శ్రీమలయప్పస్వామి దేవేరులతో కలిసి ఘంటా మండపంలో ఏర్పాటుచేసిన సర్వభూపాల వాహనంలో గరుడాళ్వార్కు అభిముఖంగా వేంచేపు చేస్తారు. సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారిని కూడా స్వామివారి ఎడమ పక్కన మరొక పీఠంపై దక్షిణ ఆభిముఖంగా వేంచేపు చేస్తారు. ఆ తరువాత స్వామివారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదనలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. దీంతో దీపావళి ఆస్థానం పూర్తవుతుంది.
కాగా సాయంత్రం 5 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని, ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షించనున్నారు.
దీపావళి ఆస్థానం కారణంగా అక్టోబరు 20న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది. తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు.