ఆంధ్రప్రదేశ్ : రూ.100కే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ - ఈ ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి
రాష్ట్రంలో వారసత్వ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరమైంది. కేవలం రూ. 100 నామమాత్రపు స్టాంపు డ్యూటీతోనే రిజిస్ట్రేషన్లు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ సేవలు డిసెంబర్ 9వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చాయి.
వారసత్వ భూముల విషయంలో ఉన్న ఇబ్బందులకు ఏపీ సర్కార్ చెక్ పెట్టేసింది. వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేయటమే కాకుండా అతి తక్కువ ఫీజునే నిర్ణయించింది. ఈ సేవలను రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 9వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకువచ్చింది.
రూ.100కే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ (image source Department of Revenue AP Govt)
రాష్ట్రవ్యాప్తంగా ఉనఅన అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఇందుకు అనుగుణంగా సాఫ్ట్వేర్లో మార్పులు చేశారు. ఈ సేవల ప్రారంభించటంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ - ముఖ్యమైన పాయింట్లు:
వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో ఉన్న ఇబ్బందులకు చెక్ పెట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రూ. 100కే రిజిస్ట్రేషన్ చేసేలా కొన్ని నెలల కిందంటే నిర్ణయం తీసుకుంది.
ఈ తరహా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ను లభతరం చేయటంతో పాటు రిజిస్ట్రేషన్లను ప్రోత్సహించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవలే ప్రభుత్వం జీవో జారీచేసింది.
భూయజమానులు మరణించిన అనంతరం వారసులకు సంక్రమించే వాటికి మాత్రమే ఈ ఫీజులు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
వీలునామా రాయకుండా యజమాని మరణిస్తే వారసులు ఆ ఆస్తులను భాగాలు చేసుకొని లిఖితపూర్వకంగా ఏకాభిప్రాయంతో వస్తే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రూ.100, రూ.1000కే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ రూ.10 లక్షల లోపు ఉంటే రూ.100 చొప్పున నామమాత్రపు స్టాంపు డ్యూటీ చెల్లించాలి.
ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ రూ.10 లక్షలు మించితే రూ.1,000 చెల్లించాల్సి ఉంటుంది.
రైతులు తమకు వారసత్వంగా సంక్రమించిన వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్ చేయించుకుంటే… ఆటోమేటిక్గా ఆ భూముల యాజమాన్యం వారి పేరు మీదకు వస్తుంది. దీనివల్ల వారికి పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయబడతాయి.
నామమాత్రపు స్టాంపు డ్యూటీతో చేసుకునే ఈ తరహా రిజిస్ట్రేషన్లు కేవలం వ్యవసాయ భూములకు మాత్రమే వర్తిస్తాయి. ఇతర ఆస్తులకు వర్తించవు.
ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం కలుగుతుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.