విదేశీ భక్తులు, పర్యాటకులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. భారత ఈ వీసా కలిగిన విదేశీయులు నేరుగా దేశంలోకి ప్రవేశించేందుకు అనుమతి ఉన్న అధికారిక విమానాశ్రయాల జాబితాలో తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి చోటు దక్కింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఒక అధికారిక నోటిఫికేషన్ను విడుదల చేసింది. తిరుపతితో పాటు భోపాల్ విమానాశ్రయాన్ని కూడా ఈ జాబితాలో చేర్చారు.

దీంతో దేశంలో ఈ-వీసా ద్వారా ప్రవేశించగల పోర్టుల సంఖ్య 88కి చేరింది. వీటిలో 37 విమానాశ్రయాలు, 38 ఓడరేవులు (సీపోర్టులు), 13 లాండ్ (సరిహద్దు) పోర్టులు ఉన్నాయి.
కేంద్రం నిర్ణయంపై తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి స్పందిస్తూ.. తిరుపతి విమానాశ్రయాన్ని విదేశీ ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చే దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగు అని పేర్కొన్నారు. అయితే ఇక్కడి నుంచి క్రమబద్ధమైన అంతర్జాతీయ విమానాలు నడవాలంటే విమానయాన సంస్థలు ముందుకు రావాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వంటి ప్రముఖ విమానయాన సంస్థలతో సర్వీసులు ప్రారంభించే అంశంపై చర్చలు జరుగుతున్నాయని ఎంపీ తెలిపారు. అయితే ప్రారంభంలో వచ్చే నష్టాలను అధిగమించడానికి, సర్వీసులను కొనసాగించడానికి విమానయాన సంస్థలు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ సాయాన్ని కోరుతున్నాయని వివరించారు.
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం నిత్యం అనేకమంది విదేశీ భక్తులు వస్తుంటారు. ఇప్పటివరకు వీరు చెన్నై, బెంగళూరు లేదా హైదరాబాద్ వంటి అంతర్జాతీయ విమానాశ్రయాల్లో దిగి, అక్కడ నుండి రోడ్డు మార్గం ద్వారా లేదా దేశీయ విమానాల ద్వారా తిరుపతికి చేరుకునేవారు.
నూతన నోటిఫికేషన్ ప్రకారం.. చెల్లుబాటు అయ్యే ఈ-వీసా ఉన్న విదేశీ ప్రయాణికులు ఇకపై తిరుపతి విమానాశ్రయాన్ని నేరుగా ఎంట్రీ పాయింట్గా ఉపయోగించుకోవచ్చు. అయితే ఇది అంతర్జాతీయ విమానాల అందుబాటుపై ఆధారపడి ఉంటుంది.
{{/usCountry}}నూతన నోటిఫికేషన్ ప్రకారం.. చెల్లుబాటు అయ్యే ఈ-వీసా ఉన్న విదేశీ ప్రయాణికులు ఇకపై తిరుపతి విమానాశ్రయాన్ని నేరుగా ఎంట్రీ పాయింట్గా ఉపయోగించుకోవచ్చు. అయితే ఇది అంతర్జాతీయ విమానాల అందుబాటుపై ఆధారపడి ఉంటుంది.
{{/usCountry}}దేశంలోకి పర్యాటకులను ఆకర్షించేందుకు, వీసా ప్రక్రియను సులభతరం చేసేందుకు భారత్ 2014లో 43 దేశాల పౌరులకు ఈ-వీసా విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఇది 172 దేశాలకు, 17 రకాల కేటగిరీలలో విస్తరించింది. విదేశీయులు దరఖాస్తు చేసుకునే ఈ-వీసాలలో దాదాపు 95 శాతం దరఖాస్తులు 72 గంటల్లోనే పూర్తవుతుండగా, భారతదేశం జారీ చేసే వీసాలలో 78 శాతం వరకు ఎలక్ట్రానిక్ వీసాలే కావడం గమనార్హం.
ఈ-వీసా అనుమతి లభించినప్పటికీ, తిరుపతి విమానాశ్రయం నుంచి క్రమబద్ధమైన అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కావడం ఇంకా బాకీగానే ఉంది. 2008లోనే కేంద్ర క్యాబినెట్ తిరుపతికి అంతర్జాతీయ హోదాను మంజూరు చేయగా 2017లో గెజిట్ నోటిఫికేషన్ విడుదలలు అయ్యాయి. నోటిఫికేషన్ వచ్చి దాదాపు తొమ్మిది ఏళ్లు గడుస్తున్నా, ఇప్పటివరకు ఒక్క షెడ్యూల్డ్ అంతర్జాతీయ విమానం కూడా ఇక్కడి నుంచి ప్రారంభం కాలేదు.
ద్వైపాక్షిక వైమానిక సేవా ఒప్పందాలు, మార్కెట్ డిమాండ్, సంబంధిత కంపెనీల సొంత విధానాల ప్రాతిపదికన మాత్రమే విమాన సంస్థలు అంతర్జాతీయ మార్గాలను ఎంచుకుంటాయని 2025 ఫిబ్రవరిలో పౌర విమానయాన శాఖ మంత్రి రాజ్యసభలో స్పష్టం చేశారు.
తిరుపతి విమానాశ్రయంలో డిసెంబర్ 2024లో సింగపూర్ నుండి ఒక అంతర్జాతీయ చార్టర్డ్ విమానం ల్యాండ్ అయినప్పటికీ, అది పూర్తిస్థాయి వాణిజ్య సర్వీసుగా మారలేదు. అయితే పెద్ద విమానాల రాకపోకలకు వీలుగా రన్వే పొడవును 2,286 మీటర్ల నుండి 3,810 మీటర్లకు పొడిగించడంతో పాటు మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరిచారు.
2024-25 సంవత్సరంలో ఈ విమానాశ్రయం దాదాపు 10 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించింది. రాయలసీమ ప్రాంతం నుండి ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లేవారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో.. దుబాయ్, అబుదాబి వంటి నగరాలకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించాలని స్థానికులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు.