TTD పేరుతో నకిలీ వెబ్‌సైట్ - శ్రీవారి భక్తులకు హెచ్చరిక..! ఈ లింక్ ను నమ్మకండి

తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్న "ttddevasthanam.online" అనే నకిలీ వెబ్‌సైట్‌ను టీటీడీ విజిలెన్స్ విభాగం గుర్తించింది. దీనిపై తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Published on: Jul 30, 2026, 12:06:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తిరుమల శ్రీవారి భక్తులను బురిడీ కొట్టించేందుకు కొందరు సైబర్ ముఠాలు మళ్లీ హల్చల్ చేస్తున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారిక వెబ్‌సైట్‌ను పోలి ఉండేలా రూపొందించిన ఒక నకిలీ వెబ్‌సైట్‌ను టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం అధికారులు బుధవారం గుర్తించారు. "ttddevasthanam.online" అనే పేరుతో చలామణి అవుతున్న ఈ నకిలీ వెబ్‌సైట్‌పై భక్తులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

టీటీడీ పేరుతో నకిలీ వెబ్‌సైట్ - శ్రీవారి భక్తులకు హెచ్చరిక
టీటీడీ పేరుతో నకిలీ వెబ్‌సైట్ - శ్రీవారి భక్తులకు హెచ్చరిక

టీటీడీ అధికారిక వెబ్‌సైట్ రూపకల్పనను, లోగోను యాజిటీజ్‌గా కాపీ చేస్తూ కేవలం డొమైన్ పేరులో చిన్న చిన్న మార్పులతో ఈ నకిలీ సైట్‌ను తెరిచారు. ఇందులో రాబోయే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించి శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, వివిధ రకాల ఆన్లైన్ సేవా టికెట్లు అందుబాటులో ఉన్నాయంటూ తప్పుడు సమాచారాన్ని ప్రదర్శిస్తున్నారు. అమాయక భక్తుల నుంచి దర్శన టికెట్ల పేరుతో పెద్ద మొత్తంలో నగదు వసూలు చేసి మోసం చేయడమే కాకుండా… పవిత్రమైన టీటీడీ ప్రతిష్ఠకు భంగం కలిగించడమే ఈ నకిలీ వెబ్‌సైట్ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని అధికారులు స్పష్టం చేశారు.

క్రిమినల్ కేసులు.. కఠిన చర్యలు!

ఈ తీవ్రమైన అంశంపై టీటీడీ యంత్రాంగం తక్షణమే స్పందించింది. సదరు నకిలీ వెబ్‌సైట్‌ను ఇంటర్నెట్ నుంచి వెంటనే తొలగించాలని (టేక్ డౌన్) సంబంధిత డొమైన్ ప్రొవైడర్ ప్లాట్‌ఫారమ్ నిర్వాహకులకు టీటీడీ ఇప్పటికే అధికారికంగా ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా, ఈ మోసపూరిత సైట్‌ను నడుపుతున్న అజ్ఞాత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని తిరుమల టూ టౌన్ పోలీసు స్టేషన్‌లో టీటీడీ అధికారులు ఫిర్యాదు చేశారు. భవిష్యత్తులో కూడా తిరుమల పవిత్రతను… భక్తుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడే వారిపై చట్టపరంగా అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ అధికారులు హెచ్చరించారు.

భక్తులకు టీటీడీ కీలక విజ్ఞప్తి

తిరుమల శ్రీవారి దర్శనం, నిత్య సేవలు, వసతి గదులు (అకామడేషన్) మరియు ఇతర ఆన్‌లైన్ డిజిటల్ సేవల కోసం భక్తులు కేవలం అధికారిక మార్గాలను మాత్రమే వినియోగించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అయ్యే అనధికారిక లింకులు, నకిలీ వెబ్‌సైట్లను నమ్మి డబ్బులు చెల్లించి మోసపోవద్దని కోరింది. భక్తులు బుకింగ్స్ కోసం అధికారిక టీటీడీ వెబ్‌సైట్ లేదా టీటీడీ అధికారిక మొబైల్ యాప్ ద్వారా మాత్రమే సేవలు పొందాలని సూచించింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More