ఆ వీడియోల్లో ఉన్నది నేను కాదు.. వైరల్ క్లిప్పింగ్స్పై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్లారిటీ
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలపై తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బి.ఆర్.నాయుడు స్పందించారు. బీఆర్ నాయుడు ఆ దృశ్యాలను కల్పితంగా కొట్టిపారేశారు. తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేసిన ఒక బహిరంగ ప్రకటనలో, ఆ వీడియోలు ఏఐ టెక్నాలజీ ఉపయోగించి రూపొందించినట్టుగా వెల్లడించారు. తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేందుకు, తిరుమల తిరుపతి దేవస్థానాల ప్రతిష్టను దెబ్బతీసేందుకు తయారు చేసి వైరల్ చేస్తున్నారని మండిపడ్డారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు.. డీప్ పేక్ అని, కొంతమంది తనను అప్రతిష్టపాలు చేయడానికి లక్ష్యంగా చేసుకున్న ప్రచారాన్ని చేస్తున్నారని బీఆర్ నాయుడు ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు వైరల్ చేయడం వెనక ఉన్నారని ప్రత్యేకంగా ఆరోపించారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు.. మహిళలతో ఉన్నట్టుగా వీడియో క్లిప్లు ఆన్లైన్లో కనిపించడంతో వివాదం చెలరేగింది. ఈ వీడియోలు వేగంగా వైరల్ అయ్యాయి. రాజకీయ విమర్శలు మెుదలయ్యాయి. అంతేకాదు జనాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
ఈ డీప్ఫేక్ కంటెంట్ వెనుక ఉన్న ఉద్దేశ్యం తనను వ్యక్తిగతంగా కించపరచడమే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత, విశ్వసనీయతను దెబ్బతీయడమేనని బీఆర్ నాయుడు అన్నారు. ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నంగా ఆయన అభివర్ణించారు.
సైబర్ క్రైమ్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు టీటీడీ ఛైర్మన్ ధృవీకరించారు. ఈ వీడియోలపై సమగ్ర దర్యాప్తు జరపాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తన ఇమేజ్, టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు చూస్తున్నవారిని చట్టబద్ధంగా ఎదుర్కొంటానని చెప్పారు. ఈ విషయంపై మౌనంగా ఉండనని స్పష్టం చేశారు.
'నకిలీ డీప్ ఫేక్ వీడియోలతో కొందరు సోషల్ మీడియాలో నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. వ్యక్తిగతంగా నన్ను అప్రతిష్ట పాలు చేసేందుకు, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్రలు చేస్తున్నారు. AI సాంకేతికతను వాడుకుని నా రూపం అనుకరించే విధంగా వీడియోలు తయారు చేసి ప్రచారం చేస్తున్నారు. ఈ కంటెంట్ మొత్తం అసత్యమైనది, వక్రీకరించినది.. ఇది టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు పన్నిన పథకం. దీని వెనుక రాజకీయ దురుద్దేశం ఉంది. వైసీపీకి చెందిన కొందరు ఈ తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. దీనిపై నేను చట్ట ప్రకారం ముందుకెళ్తాను.. నాపై సోషల్ మీడియాలో సాగుతున్న దుష్ప్రచారం వెనుక ఉన్న కుట్ర ను తేల్చాలని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాను. నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ టీటీడీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న వ్యక్తులను, దుష్ట శక్తులను వదిలేది లేదు.' అని బీఆర్ నాయుడు అన్నారు.

E-Paper












