టీటీడీ : తిరుమలలోని కళ్యాణ వేదిక వద్ద ఈ లిస్టులోని పూజా కార్యక్రమాలు, ఫీజులు ఇలా
తిరుమల శ్రీవారికి భక్తులకు గుడ్న్యూస్ చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం. కళ్యాణ వేదిక వద్ద పలు పూజా కార్యక్రమాలను భక్తులకు అందిస్తున్నారు. దీని సంబంధించిన రుసుములు ఇలా ఉన్నాయి.
తిరుమలలోని శ్రీవారి కళ్యాణ వేదిక వద్ద ఉన్న పురోహిత సంఘం ఆధ్వర్యంలో భక్తులు, గృహస్తులకు అవసరమైన వివిధ సంప్రదాయ పూజ కార్యక్రమాలను నిర్దేశిత రుసుముతో నిర్వహిస్తున్నారు. ఈ మేరకు టీటీడీ ప్రకటన విడుదల చేసింది. పురోహిత సంఘం ద్వారా వివాహం, ఉపనయనం, సత్యనారాయణ వ్రతం, నామకరణం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, వాహన పూజ తదితర ముఖ్యమైన ధార్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు భక్తుల సౌకర్యార్థం ఈ కార్యక్రమాలను అందుబాటులోకి తెచ్చారు. తక్కువ ఖర్చుతో చేసుకునేవిధంగా టీటీడీ అవకాశం కల్పిస్తుంది. కళ్యాణ వేదిక వద్ద పురోహిత సంఘం ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమాలు, ఫీజులు ఇలా ఉన్నాయి:
- వివాహం – ఉచితం
- ఉపనయనం – రూ.300
- సత్యనారాయణ వ్రతం – రూ.300
- కేశఖండన – రూ.200
- నామకరణం – రూ.200
- అన్నప్రాసన – రూ.200
- అక్షరాభ్యాసం – రూ.200
- వాహన పూజ – రూ.200
- చెవిపోగులు కుట్టడం – రూ.50
- చెవిపోగులు కుట్టడం (కాటేజ్లో) – రూ.100
- మేళం (ఒక సెట్టు) – రూ.100
- మేళం (రెండు సెట్లు) – రూ.300
- దస్త్ర పూజ – రూ.200
- ఇతర ధార్మిక కార్యక్రమాలు – రూ.200
భక్తులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం తిరుమల కళ్యాణ వేదిక వద్దనున్న పురోహిత సంఘాన్ని సంప్రదించవచ్చు. ఈ మేరకు టీటీడీ అధికారింగా ప్రకటన విడుదల చేసింది.
వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఆదివారం ఉదయం 8.15 నుండి 8.35 గంటల మధ్య కుంభ లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ నడుమ ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది.
అంతకుముందు ఉదయం 6.30 నుండి 8.15 గంటల వరకు స్వామివారి తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవం ద్వారా తన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ఒకమారు ముందుగా పర్యవేక్షిస్తారు. అనంతరం అర్చకులు విష్వక్సేన ఆరాధన, వాస్తుహోమం, గరుడ లింగహోమం, గరుడ ప్రతిష్ఠ, రక్షా బంధనం చేపట్టారు. మీన లగ్నంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. ఇందులో వైఖానస శాస్త్రోక్తంగా గరుత్మంతుణ్ణి కొత్త వస్త్రంపై లిఖించి, పూజలు చేసి, ధ్వజస్తంభంపై ప్రతిష్టించారు.
బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు : ఈవో రవిచంద్ర
టీటీడీ ఈవో ఎం. రవిచంద్ర మీడియాతో మాట్లాడుతూ.. ధ్వజారోహణంతో వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఆలయంలో ఫిబ్రవరి 8 నుండి 16వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తుల కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టామన్నారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 12న గరుడసేవ, ఫిబ్రవరి 13న స్వర్ణరథోత్సవం, ఫిబ్రవరి 15న రథోత్సవం, ఫిబ్రవరి 16న చక్రస్నానం జరుగనున్నట్టు వివరించారు. గరుడ సేవ రోజు భక్తుల రద్దీ నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు.

E-Paper












