టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర - బాధ్యతలు స్వీకరణ
టీటీడీ ఈవోగా సీఎంవో ముఖ్యకార్యదర్శి ముద్దాడ రవిచంద్ర శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఉదయం సతీసమేతంగా భూవరాహ స్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత బాధ్యతలు స్వీకరించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం ఉదయం సతీసమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో ఇన్ఛార్జ్ ఈవోగా బాధ్యతలు స్వీకరించారు.

భక్తుల నమ్మకాన్ని నిలబెడతా - రవిచంద్ర
టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రవిచంద్ర మీడియాతో మాట్లాడారు.భక్తులకు సేవచేసే అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. శ్రీవారి భక్తుడిగా ఎంతో మందికి సేవచేసే భాగ్యం దక్కిందన్నారు.ప్రభుత్వం, భక్తుల నమ్మకాన్ని నిలబెడతానని స్పష్టం చేశారు. సలహాలు, సూచనలు తీసుకుని సమన్వయంతో ముందుకు సాగుతానని చెప్పారు.
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వివాదంలో భాగంగా ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ముద్దాడ రవిచంద్రకు టీటీడీ ఇన్ఛార్జ్ ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీఎంవో ముఖ్య కార్యదర్శిగా ఉంటూనే…. టీటీడీ ఇన్ఛార్జ్ ఈవో రవిచంద్ర బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
కల్తీ నెయ్యి సరఫరా కావడానికి గత ప్రభుత్వం హయాంలో నెయ్యి సేకరణ విధానం కారణమని గుర్తించారని ప్రచారం ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో నెయ్యిలో కల్తీ జరిగిందని అనుమానాలు వచ్చినప్పుడు సింఘాల్ టీటీడీ వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యతల్లో ఉన్నారు. నెయ్యి కల్తీ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం.. సింఘాల్ ఈ సమస్యను సకాలంలో గుర్తించడంలో విఫలమయ్యారని భావించినట్టుగా తెలుస్తోంది. ఈ విషయం బహిరంగమైన తర్వాత కూడా ఈ కుంభకోణంలో పాలుపంచుకున్న వారిపై అవసరమైన చర్యల గురించి కూడా పలువురు ప్రశ్నిస్తున్నారు.
గత కొంతకాలంగా తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంపై తీవ్రంగా చర్చ నడుస్తోంది. ఈ వ్యవహారంలో నెయ్యి సరఫరా చేసే వాళ్లు మాత్రమే కాకుండా అధికారుల పాత్ర ఉందనే చర్చ జోరుగా జరుగుతోంది. ఇటీవలే సీబీఐ నేతృత్వంలోని సిట్ నివేదిక ఇచ్చిన తర్వాత…. అనేక అంశాలు కొత్తగా వెలుగులోకి వచ్చాయి.
అనూహ్యంగా టీటీడీ ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ నిర్ణయం తిరుమల పరిపాలన, రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. 1993 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన సింఘాల్…. గతంలో 2017 మే6 నుంచి 2020 అక్టోబర్ 4 వరకు టీటీడీ ఈవోగా చేసిన విషయం తెలిసిందే. కేంద్ర సర్వీస్లో ఉన్న సింఘాల్కు టీటీడీ ఈవోగా రెండోసారి అవకాశం దక్కింది. 2025 సెప్టెంబర్లో ఈవోగా మరోసారి బాధ్యతలు చేపట్టారు. కొద్దినెలల్లోనే ఆయన్ను బదిలీ చేయటం చర్చనీయాంశంగా మారింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

