తిరుమల : లగేజీ కౌంటర్ తరహాలో పాద రక్షల కౌంటర్లు - భక్తుల కోసం QR కోడ్ ఆధారిత సేవలు
తిరుమలలోలగేజీ కౌంటర్ తరహాలో పాద రక్షల కౌంటర్లు అందుబాటులోకి వచ్చాయి. పాద రక్షలు నిర్వహణకు QR కోడ్ ఆధారిత సేవలు పొందవచ్చు. ఫలితంగా భక్తులకు పాద రక్షల ఇబ్బందులు ఉండవని టీటీడీ అధికారులు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.
తిరుమలలో లగేజీ కౌంటర్ల తరహాలో QR ఆధారిత పాద రక్షల నిర్వహణ కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం వద్ద మంగళవారం నూతనంగా ఏర్పాటు చేసిన QR కోడ్ ఆధారిత పాద రక్షలు కౌంటర్ ను ప్రారంభించారు.

8 కౌంటర్లు ఏర్పాటు - టీటీడీ అదనపు ఈవో
ఈ సందర్భంగా అదనపు ఈవో మీడియాతో మాట్లాడుతూ…. తిరుమల కొండపై భక్తులు ఎదుర్కొంటున్న పాద రక్షల నిర్వహణ సమస్యకు శాశ్వత పరిష్కారంగా టీటీడీ QR కోడ్ ఆధారిత ఆధునిక పాద రక్షల నిర్వహణ వ్యవస్థను విజయవంతంగా అమలు చేస్తోందని వెల్లడించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్–2 వద్ద పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఈ విధానం అద్భుత ఫలితాలు ఇవ్వడంతో… తిరుమలలోని పలు ప్రాంతాల్లో ఎనిమిది కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
క్యూఆర్ కోడ్ స్లిప్స్….
ఈ విధానంలో భక్తులు తమ పాద రక్షలను కౌంటర్ వద్ద అప్పగించగానే వారికి QR కోడ్తో కూడిన స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్లో పాద రక్షల సంఖ్య, సైజు, ర్యాక్ నంబర్, బాక్స్ నంబర్, నిల్వ చేసిన స్థానం వంటి పూర్తి వివరాలు ఉంటాయి. భక్తులు తిరిగి వచ్చి ఆ స్లిప్ను స్కాన్ చేయగానే పాద రక్షలు ఉన్న ఖచ్చితమైన స్థానం డిస్ప్లే అవుతుంది. తద్వారా అతి తక్కువ సమయంలోనే భక్తులకు పాద రక్షలు తిరిగి అందజేయడం జరుగుతోందని అదనపు ఈవో తెలిపారు.
ఈ వ్యవస్థ అమలుతో ఇప్పుడు దాదాపు 99 శాతం భక్తులు తమ పాద రక్షలను తిరిగి పొందుతున్నారు. గతంలో గుట్టలుగా పడిపోవడం వల్ల సుమారు 70–80 శాతం మంది భక్తులు పాద రక్షలు వదిలేసి వెళ్లే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ సమస్య పూర్తిగా తొలగిపోయిందని అదనపు ఈవో వివరించారు. ఈ వినూత్న ప్రాజెక్టును కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ తమ CSR కార్యక్రమంలో భాగంగా పూర్తి స్థాయిలో అమలు చేస్తోందని పేర్కొన్నారు. భక్తుల సౌకర్యం, తిరుమల స్వచ్ఛత దృష్ట్యా ఇది దేశంలోనే ఆలయ పరిపాలనలో ఒక అత్యుత్తమ వ్యవస్థగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా భక్తులు తమ పాద రక్షలను ఎక్కడ పడితే అక్కడ వదలకుండా, నిర్దేశిత కౌంటర్లలోనే డిపాజిట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా తిరుమల పరిశుభ్రత మరింత మెరుగుపడుతుందని తెలియజేశారు.

E-Paper












