టీటీడీ : ఇక తిరుమలలోని సమాచారం ఈజీగా తెలుసుకోవచ్చు.. డిసెంబర్‌లోనే అందుబాటులోకి ఏఐ చాట్‌బాట్

తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్. టీటీడీ ఏఐ చాట్‌బాట్‌ను మరికొన్ని రోజుల్లో ప్రవేశపెట్టనుంది. దీని ద్వారా మీరు సమాచారాన్ని ఈజీగా, 13 భాషల్లో తెలుసుకోవచ్చు.

Published on: Dec 14, 2025 6:51 PM IST
By , Tirumala
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు తిరుమల పుణ్యక్షేత్రం, వివిధ ఆర్జిత సేవలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేయడానికి ఏఐ చాట్‌బాట్‌ను ప్రారంభించాలని యోచిస్తోంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్ సహకారంతో డిసెంబర్ లోనే అంటే రాబోయే 15 రోజుల్లో ఏఐ-ఆధారిత చాట్‌బాట్ భక్తులకు అందుబాటులోకి వస్తుంది.

తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుమల తిరుపతి దేవస్థానం

ఈ చాట్‌బాట్ భాష అడ్డంకులను లేకుండా చేస్తుంది. వారి సందేహాలకు సంబంధించి వెంటవెంటనే సమాధానం ఇస్తుంది. దీంతో టీటీడీ అధికారుల నుండి సమాధానం కోసం భక్తులు ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. తిరుమలకు సంబంధించి మీకు కావాల్సిన సమాచారం మీరు మీ చేతుల్లోనే పొందవచ్చు.

దర్శన టిక్కెట్లు, వసతి సౌకర్యాలు, రవాణా, తిరుగు ప్రయాణం గురించి తమ సందేహాలను తీర్చుకోవడానికి భక్తులు టీటీడీ కాల్ సెంటర్లు, ఈమెయిల్‌లు, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను సంప్రదిస్తారు. అయితే మానవ వనరుల కొరత కారణంగా సమాధానం ఆలస్యం అవుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఏఐ చాట్‌బాట్ ఈ సమస్యను అధిగమించి 24 గంటలూ సమాధానాలను అందిస్తూనే ఉంటుందని భావిస్తున్నారు.

ఈ ఏఐ చాట్‌బాట్ ఒకేసారి అనేక మంది భక్తుల సందేహాలను నివృత్తి చేయగలదు. ఇది 13 భారతీయ భాషలలోని ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలదు. ఇది దర్శన టికెట్ బుకింగ్‌కు సంబంధించి యాత్రికులకు మార్గనిర్దేశం చేస్తుంది. వారికి రియల్ టైమ్ సమాచారాన్ని అందిస్తుంది. ఇది సాధారణ టైపింగ్‌తో పాటు స్పీచ్ టు టెక్స్ట్, టెక్స్ట్ టు స్పీచ్ ఫీచర్లను కూడా అందిస్తుంది.

స్థానికులకు ఈ-డిప్ ద్వారా వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు

తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాల్లో జనవరి 6, 7, 8వ తేదిల్లో రోజుకు 5వేల టోకెన్ల చొప్పున తిరుమల, తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి ప్రాంతాల వారికి స్థానికుల కోటా కింద కేటాయించాలని టీటీడీ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. డిసెంబర్ 25వ తేది ఉదయం 10 నుండి 27 వ తేది సాయంత్రం 5 గంటల వరకు ఈ-డిప్ నమోదుకు టీటీడీ అవకాశం కల్పించనుంది.

తిరుమల, తిరుపతి, రేణిగుంట, చంద్రగిరికి చెందిన స్థానికులు పైన పేర్కొన్న తేదీల్లో 1+3 విధానంలో ఈ-డిప్ కోసం టీటీడీ వెబ్ సైట్, మొబైల్ యాప్, వాట్సాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. డిసెంబర్ 29న మధ్యాహ్నం 2 గంటలకు ఈ-డిప్ ద్వారా టోకెన్లు కేటాయిస్తారు. ఇందులో రోజుకు తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి స్థానికులకు 4500, తిరుమల స్థానికులకు 500 టోకెన్లు చొప్పున కేటాయించనున్నారు. ఈ విషయాన్ని గమనించి స్థానికులు టోకెన్ల కోసం ఈ-డిప్ ద్వారా నమోదు చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.