శ్రీవారి భక్తులకు అప్డేట్.. రెండు నెలలు పర్వదినాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
డిసెంబర్, జనవరి నెలల్లో అంటే రెండు నెలలపాటు పర్వదినాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
2025 డిసెంబర్ నెల నుండి 2026 జనవరి నెల వరకు శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న పలు పర్వదినాల నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను ఆయా రోజుల్లో టీటీడీ రద్దు చేసింది. ఈ మేరకు టీటీడీ ప్రకటన విడుదల చేసింది. డిసెంబర్ 23న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, వైకుంఠ ఏకాదశి ముందు రోజైన డిసెంబర్ 29వ తేదీ, డిసెంబర్ 30వ తేది నుండి జనవరి 8వ తేది వరకు వైకుంఠ ద్వార దర్శనాలు, జనవరి 25న రథ సప్తమి కారణంగా ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది దేవస్థానం.

పైన పేర్కొన్న రోజులకు ముందురోజు వీఐపీ దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖలు స్వీకరించమని టీటీడీ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీకి సహకరించాల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి చేసింది.
శ్రీవారిని దర్శించుకున్న సుబుధేంద్ర తీర్థ స్వామీజీ
మంత్రాలయ రాఘవేంద్ర మఠానికి చెందిన సుబుధేంద్ర తీర్థ స్వామీజీ బుధవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, శ్రీ వారి ఆలయ అర్చకులు ఆలయం ముందు ఆలయ గౌరవ మర్యాదలతో ఆయన పవిత్రతను స్వీకరించారు.
కోటి విరాళం
తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్కు చెందిన ఎం.సౌమ్య అనే భక్తురాలు టీటీడీ శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు మంగళవారం రూ.కోటి విరాళంగా అందించారు. ఈ మేరకు తిరుపతిలోని టీటీడీ అదనపు ఈవో బంగ్లాలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు. ఈ సందర్భంగా అదనపు ఈవో దాతను శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.
టీటీడీకి రెండు కార్లు
తిరుపతికి చెందిన లోటస్ ఎలక్ట్రిక్ ఆటో వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పేరుతో అర్జున్ కొల్లికొండ అనే భక్తుడు బుధవారం టీటీడీకి రూ.10 లక్షల విలువైన సిట్రాయెన్ (ఈసీ3) ఎలక్ట్రిక్ కారును విరాళంగా అందించింది. అదేవిధంగా చెన్నైకు చెందిన శరవనన్ కరుణాకరన్ అనే భక్తుడు రూ.9 లక్షలు విలువైన సిట్రాయెన్ (బసాల్ట్ ఎక్స్ ప్లస్ యంటీ) కారును విరాళంగా అందించారు. ఈ మేరకు దాతలు శ్రీవారి ఆలయం ముందు కార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ పేష్కార్ రామకృష్ణకు తాళాలు అందించారు.














