తిరుమల : స్థానిక భక్తులకు ఈ-డిప్ విధానంలో వైకుంఠ ద్వార దర్శనాలు - ఈనెల 25 నుంచి నమోదుకు ఛాన్స్
వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ మరో అప్డేట్ ఇచ్చింది. తిరుపతి, తిరుమల స్థానికులకు ఈ-డిప్ ద్వారా టోకెన్లు అందించనుంది. జనవరి 6, 7, 8వ తేదీల్లో వీటిని పంపిణీ చేస్తామని పేర్కొంది.
తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలను కల్పించనుంది. జనవరి 6, 7, 8వ తేదీల్లో రోజుకు 5వేల టోకెన్ల చొప్పున తిరుమల, తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి ప్రాంతాల వారికి స్థానికుల కోటా కింద కేటాయించనుంది. ఈ మేరకు టీటీడీ ప్రకటన విడుదల చేసింది.
తిరుమల
ఈనెల 25 నుంచి నమోదు…
ఈ నేపథ్యంలో డిసెంబర్ 25వ తేదీ ఉదయం 10 నుండి 27 వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ- డిప్ నమోదుకు టీటీడీ అవకాశం కల్పించనుంది. తిరుమల, తిరుపతి, రేణిగుంట, చంద్రగిరికి చెందిన స్థానికులు పైన పేర్కొన్న తేదీల్లో 1+3 విధానంలో ఈ-డిప్ కోసం టీటీడీ వెబ్ సైట్, మొబైల్ యాప్, వాట్సాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చు.
డిసెంబర్ 29న మధ్యాహ్నం 2 గంటలకు ఈ-డిప్ ద్వారా టోకెన్లు కేటాయించడం జరుగుతుంది. ఇందులో రోజుకు తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి స్థానికులకు 4500, తిరుమల స్థానికులకు 500 టోకెన్లు చొప్పున కేటాయించనున్నారు. ఈ విషయాన్ని గమనించి స్థానికులు టోకెన్ల కోసం ఈ-డిప్ ద్వారా నమోదు చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు:
టీటీడీ 2025 డిసెంబర్ నెల నుండి 2026 జనవరి నెల వరకు శ్రీవారి ఆలయంలో నిర్వహించు పలు పర్వదినాల నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను ఆయా రోజుల్లో రద్దు చేసింది.
డిసెంబర్ 23న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, వైకుంఠ ఏకాదశి ముందు రోజైన డిసెంబర్ 29వ తేదీ, డిసెంబర్ 30వ తేది నుండి జనవరి 8వ తేది వరకు వైకుంఠ ద్వార దర్శనాలు, జనవరి 25న రథ సప్తమి కారణంగా ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దవుతాయి.
పైన పేర్కొన్న రోజులకు ముందురోజు వీఐపీ దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీకి సహకరించాల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి చేసింది.