TTD Temple in Assam : ఇక ఈశాన్య భారతంలోనూ శ్రీవారి వైభవం - అస్సాంలో ఆలయ నిర్మాణానికి త్వరలోనే భూమిపూజ..!
TTD Lord Venkateswara temple in Assam : ఈశాన్య రాష్ట్రం అస్సాంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ముందడుగు పడింది. అస్సాం ప్రభుత్వం కేటాయించిన 10.33 ఎకరాల భూమిని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు అధికారికంగా స్వాధీనం చేసుకున్నారు.
TTD Lord Venkateswara temple in Assam : దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల రాజధానుల్లో కలియుగ వైకుంఠనాథుడైన శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాలను నిర్మించాలనే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సంకల్పం వేగంగా సాకారం అవుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశా నిర్దేశం, సూచనల మేరకు ఈ బృహత్తర కార్యక్రమాన్ని టీటీడీ ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తోంది. ఇందులో భాగంగా ఈశాన్య భారత గేట్వేగా పిలిచే అస్సాం రాష్ట్రంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి కేటాయించిన 10.33 ఎకరాల భూమిని టీటీడీ అధికారులు మంగళవారం అధికారికంగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

కామ్రూప్ జిల్లాలో వేంకటేశ్వరుడి ఆలయం
అస్సాం రాష్ట్రంలోని కామ్రూప్ జిల్లాకు చెందిన సోనాపూర్ సర్కిల్ పరిధిలో ఈ చారిత్రాత్మక భూమి కేటాయింపు జరిగింది. ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా ఈ ప్రాంతంలో శ్రీనివాసుడికి సర్వాంగ సుందరమైన ఆలయాన్ని టీటీడీ నిర్మించనుంది.
గతంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుతో పాటు దేవస్థాన ఉన్నతాధికారులు అస్సాం ప్రభుత్వ ప్రతినిధులతో పలుమార్లు చర్చలు జరిపి ఆలయ నిర్మాణానికి అవసరమైన ప్రాథమిక ప్రక్రియలను వేగవంతం చేశారు. అలాగే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీటీడీ పాలకమండలి కూడా అస్సాం ప్రభుత్వానికి ప్రత్యేకంగా లేఖలు రాసి స్థల కేటాయింపు ప్రక్రియ త్వరితగతిన పూర్తయ్యేలా చొరవ చూపారు.
ఇరు రాష్ట్రాల సమన్వయంతో సాగిన ఈ ప్రక్రియ మంగళవారం తుది ఘట్టానికి చేరుకుంది. అస్సాం మెట్రోపాలిటన్ డిప్యూటీ కమిషనర్ చేతుల మీదుగా టీటీడీ ఎస్టేట్ అధికారి శ్రీమతి సువర్ణమ్మ, ఈఈ శ్రీ సురేంద్ర రెడ్డిలకు భూమి స్వాధీన ధ్రువీకరణ పత్రాన్ని అధికారికంగా అందజేశారు. ఈ పత్రాల స్వీకరణతో సదరు భూమిపై టీటీడీకి పూర్తి స్థాయి చట్టపరమైన హక్కులు లభించాయి.
త్వరలోనే భూమిపూజ..
గౌహతి నగరానికి సమీపంలో నిర్మించబోయే ఈ శ్రీవారి ఆలయానికి త్వరలోనే శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వహించనున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్లే ఈ కీలక ఘట్టం ఎలాంటి అడ్డంకులు లేకుండా సఫలమైందన్నారు.
అస్సాం రాష్ట్రంలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించడం అనేది ఈశాన్య భారతదేశంలో సనాతన ధర్మ ప్రచారానికి, ఆధ్యాత్మిక చైతన్య విస్తరణకు ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిపోతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ మహత్తర కార్యక్రమానికి సంపూర్ణ సహకారం అందించిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు, అక్కడి ప్రభుత్వ యంత్రాంగానికి టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర దేవస్థానం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

