TTD Updates : మార్చి 3న 10.30 గంటలు శ్రీవారి ఆలయం మూసివేత.. ఈ సేవలు రద్దు!

TTD News : మార్చి 3న చంద్ర గ్రహణం కారణంగా 10.30 గంటల పాటు శ్రీవారి ఆలయం మూసివేయనున్నట్టుగా టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి అన్నారు. అదేరోజున కుమార ధార తీర్థ ముక్కోటి ఉందన్నారు.

Published on: Feb 16, 2026 10:44 PM IST
By , Tirumala
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఫిబ్రవరి 26 నుండి మార్చి 02వ తేదీ వరకు తిరుమలలో నిర్వహించనున్న శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలపై టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి పద్మావతి అతిథి భవనంలోని సుధర్మ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

టీటీడీ
టీటీడీ

ఈ సందర్భంగా తెప్పోత్సవాలకు భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. '23వ తేది తెప్పల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ట్రైల్ రన్ ఉంటుంది. పుష్కరిణీలో పుష్కలంగా నీరు ఉండేలా చర్యలు తీసుకోవాలి. పుష్కరిణీ, తెప్పలకు ఆకర్షణీయంగా విద్యుత్ అలంకరణ చేయాలి. వరహా స్వామి ఆలయం, నాలుగు మాడ వీధుల్లో పందిళ్లు ఏర్పాటు చేయాలి. భక్తులకు సూచనలు అందించేందుకు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి. ఫిబ్రవరి 20 నుండి మార్చి 5వ తేది వరకు పుష్కరిణీ స్నానానికి భక్తులను అనుమతించరు.' అని టీటీడీ అదనపు ఈవో పేర్కొన్నారు.

ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లో అవసరమైన సెక్యూరిటీ సిబ్బంది ఏర్పాటు చేయాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి పేర్కొన్నారు. పుష్కరిణీలో అందుబాటులో గజ ఈతగాళ్లు ఉండాలని ఆదేశించారు. తెప్పోత్సవాలు ప్రాశస్త్యం భక్తులకు తెలిసేలా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా ఏర్పాట్లు చేయాలన్నారు. తెప్పోత్సవాల కారణంగా ఫిబ్రవరి 26, 27 తేదీల్లో సహస్రదీపాలంకార సేవ, ఫిబ్రవరి 28న, మార్చి 01, 02వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేస్తున్నట్టుగా చెప్పారు.

అనంతరం అదనపు ఈవో మార్చి 3న జరగనున్న కుమారధార తీర్థ ముక్కోటిపై సమీక్షించారు. మార్చి 3న ఉదయం 5 నుండి 10 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతిస్తారని వెల్లడించారు. చంద్ర గ్రహణం కారణంగా ఉదయం 9 గంటల పైన భక్తులకు అన్న ప్రసాదాల పంపిణీ ఉండదని చెప్పారు. తదనుగుణంగా భక్తులు తమ ప్రణాళికలను రూపొందించుకుని తిరుమలకు రావాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేసింది.

చంద్ర గ్రహణం రోజున చేపట్టాల్సిన ముందస్తు ఏర్పాట్లపై అధికారులతో అదనపు ఈవో సమీక్షించారు. సమావేశంలోని ముఖ్యాంశాలు:

  • మార్చి 3న ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7.30 గంటల వరకు చంద్ర గ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూత. (మధ్యాహ్నం 3.20 నుండి సాయంత్రం 6.47 వరకు చంద్ర గ్రహణం.)
  • వైకుంఠం క్యూ కాంప్లెక్స్, రామ్ భగీచా, సీఆర్వోల వద్ద భక్తులకు దాదాపు 40 వేల పులిహోర ప్యాకెట్ల పంపిణీకి ఏర్పాట్లు.
  • ఆర్జితసేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.
  • చంద్రగ్రహణం కారణంగా మార్చి 3వ‌ తేదీ మంగళవారం అష్టదళ పాద పద్మారాధన సేవను, కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దు.
  • వీటితో పాటు ఆరోజున వీఐపీ బ్రేక్ దర్శనాలు, శ్రీవాణి దర్శనాలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, చంటి పిల్లల తల్లిదండ్రులు, వృద్ధులు, దివ్యాంగులు, దాతలు, ఎన్ఆర్ఐ దర్శనాలు రద్దు.