Tirumala : దర్శనాలు, వసతి పేరిట మోసపోకండి - భక్తులకు టీటీడీ కీలక హెచ్చరిక, ఇదిగో టోల్ ఫ్రీ నెంబర్!
శ్రీవారి దర్శనం, వసతి కల్పిస్తామంటూ మోసం చేసే దళారుల పట్ల జాగ్రత్తగా ఉండాలని టీటీడీ కోరింది. మోసగాళ్లపై ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నెంబర్ 155257ను ప్రకటించింది. వృద్ధుల దర్శనాలపై తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని స్పష్టం చేసింది.
కలియుగ వైకుంఠనాథుడైన శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చే అమాయక భక్తులను టార్గెట్ చేస్తూ కొందరు దళారులు మోసాలకు తెగబడుతున్నారు. తిరుమలలో శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు ఇప్పిస్తామని, గదుల వసతి కల్పరిస్తామని నమ్మించి భక్తుల నుంచి పెద్ద ఎత్తున సొమ్ము గుంజుతున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి మోసపూరిత సంఘటనలు ఎక్కువవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు మరోసారి కీలక హెచ్చరిక జారీ చేసింది. స్వామివారిపై ఉన్న అపారమైన భక్తి, దర్శనం కోసం ఉండే ఆరాటాన్ని దళారులు తమ స్వార్థానికి ఆసరాగా చేసుకుంటున్నారని…. భక్తులు ఎట్టిపరిస్థితుల్లోనూ మధ్యవర్తుల మాయమాటలు నమ్మవద్దని స్పష్టం చేసింది.

టీటీడీ టోల్ ఫ్రీ నెంబర్….
భక్తులను నిలువునా ముంచుతున్న అక్రమార్కులపై టీటీడీ యంత్రాంగం ప్రత్యేక నిఘా పెట్టింది. విజిలెన్స్ విభాగం ద్వారా దళారులపై నిరంతరం నిఘా ఉంచుతూ కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ…. కొందరు అక్రమార్కులు ఇంకా మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో భక్తుల రక్షణ కోసం టీటీడీ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది.
తిరుమల కొండపై గానీ, కింద తిరుపతిలో గానీ ఎవరైనా దర్శనం పేరిట లేదా వసతి గదుల పేరిట మిమ్మల్ని సంప్రదించి డబ్బులు అడిగితే తక్షణమే స్పందించాలని కోరింది. భక్తులు ఎలాంటి భయాలు లేకుండా వెంటనే టీటీడీ అధికారిక టోల్ ఫ్రీ నెంబర్ 155257 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించింది. అలాంటి వారిపై చట్టపరంగా అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఆ వార్తలు అవాస్తవం - టీటీడీ
మరోవైపు వయోవృద్ధులు, దివ్యాంగుల (PHC) శ్రీవారి దర్శనానికి సంబంధించి గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా కొన్ని తప్పుడు వార్తలు, గందరగోళపరిచే వదంతులు విపరీతంగా ప్రచారమవుతున్నాయి. ఈ ప్రచారాలపై టీటీడీ తీవ్రంగా స్పందించింది. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఆ వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమని తేల్చిచెప్పింది. వృద్ధులు, దివ్యాంగుల దర్శనం కోసం అనుసరిస్తున్న అసలైన నిబంధనలను టీటీడీ ఈ సందర్భంగా భక్తులకు వివరించింది.
- ఆన్లైన్ కోటా : ప్రతిరోజూ 1,000 మంది వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం టీటీడీ మూడు నెలల ముందుగానే ఆన్లైన్ కోటాను అధికారికంగా విడుదల చేస్తుంది.
- టికెట్ ధర - లడ్డు : ఈ ప్రత్యేక దర్శన టికెట్ ధర కేవలం రూ.50 మాత్రమే ఉంటుంది. ఈ టికెట్ పొందిన ప్రతి భక్తునికి ఒక లడ్డును టీటీడీ ఉచితంగా అందజేస్తుంది.
- దర్శన సమయం - మార్గం : తిరుమలలోని 'తిరుమల నంబి ఆలయానికి' ఆనుకుని ఉన్న ప్రత్యేక లైన్ (సీనియర్ సిటిజన్/PHC లైన్) ద్వారా ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటలకు వీరిని స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.
సోషల్ మీడియాలో వచ్చే ఎలాంటి అసత్య ప్రచారాలను నమ్మి భక్తులు తప్పుదోవ పట్టవద్దని టీటీడీ కోరింది. శ్రీవారి దర్శన టికెట్లు, లడ్డు ప్రసాదం, వసతి గదుల బుకింగ్స్ లేదా తిరుమలకు సంబంధించిన ఎలాంటి ఖచ్చితమైన సమాచారం కోసమైనా భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్లను మాత్రమే పరిశీలించాలని స్పష్టం చేసింది. సమాచారం కోసం www.tirumala.org లేదా https://ttdevastanams.ap.in అనే అధికారిక వెబ్సైట్లను మాత్రమే సంప్రదించాలని కోరింది. దళారుల బారిన పడి డబ్బులు పోగొట్టుకోవద్దని విజ్ఞప్తి చేసింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

