వారందరికీ ఉచితంగా తిరుమల శ్రీవారి లడ్డూ, వడ ప్రసాదం - టైమింగ్స్, తేదీలివే
టీటీడీ విశ్రాంత ఉద్యోగులకు కీలక అప్డేట్ వచ్చేసింది. బ్రహ్మోత్సవాలు ముగిసిన నేపథ్యంలో వారికి ఉచితంగా శ్రీవారి లడ్డూ, వడ ప్రసాదం పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు తేదీలను ప్రకటించారు.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల అనంతరం టీటీడీ విశ్రాంత ఉద్యోగులకు, కుటుంబ పింఛన్దార్లకు శ్రీవారి లడ్డూ, వడ ప్రసాదాన్ని అందజేస్తున్నారు. ఈ కార్యక్రమం ఈనెల 15వ తేదీ నుంచే ప్రారంభం కాగా… ఈ 24 వరకు అవకాశం ఉంటుంది.

టైమింగ్స్ వివరాలు….
తిరుపతిలోని టీటీడీ క్యాంటీన్ వద్ద గల కొత్త జాబిలి భవనంలో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 05.00 గం.ల వరకు వీటిని తీసుకోవచ్చు. అయితే తీసుకునే వాళ్లు టీటీడీ స్మార్ట్ ఐడీ కార్డులతో ప్రసాదాలను స్వీకరించాలని టీటీడీ సూచించింది. పింఛన్దార్లు / వారి కుటుంబ పింఛన్ దారులు / సీపీఎస్ వారికి ఒక పెద్ద లడ్డూ, ఒక వడ అందజేస్తారు.
పిపిఓ నంబర్ల వారీగా ప్రసాదాల పంపిణీ జరుగుతుంది. అక్టోబర్ 15 మరియు 16 తేదీలలో 164 నుండి 5,500 వరకు, అక్టోబర్ 17వ తేదీన 5,501 నుండి 7,000 వరకు పంపిణీ చేస్తారు. ఇక అక్టోబర్ 18న 7,001 నుండి 8,500, అక్టోబర్ 22న 8,501 నుండి 10,000 వరకు, అక్టోబర్ 23వ తేదీన 10,000 నుండి 12,500 వరకు, అక్టోబర్ 24వ తేదీన 12,500 నుండి మిగిలిన పిపిఓ నెంబర్ల వారికి ప్రసాదాలు అందిస్తారు. విశ్రాంత ఉద్యోగులు, కుటుంబ పింఛన్దారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీవారి ప్రసాదాలను స్వీకరించాలని టీటీడీ కోరింది.
మరోవైపు తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా అక్టోబరు 20 తేదీన దీపావళి ఆస్థానాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించనుంది. దీపావళి నాడు ఉదయం 7 నుండి ఉదయం 9 గంటల వరకు బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం జరుగుతుంది.
ఆస్థానంలో భాగంగా శ్రీమలయప్పస్వామి దేవేరులతో కలిసి ఘంటా మండపంలో ఏర్పాటుచేసిన సర్వభూపాల వాహనంలో గరుడాళ్వార్కు అభిముఖంగా వేంచేపు చేస్తారు. సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారిని కూడా స్వామివారి ఎడమ పక్కన మరొక పీఠంపై దక్షిణ ఆభిముఖంగా వేంచేపు చేస్తారు. ఆ తరువాత స్వామివారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదనలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. దీంతో దీపావళి ఆస్థానం పూర్తవుతుంది.
దీపావళి ఆస్థానం కారణంగా అక్టోబరు 20న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది. తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

