ఉగాదికి ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రి ఉత్సవాలు.. ప్రత్యేక పుష్పార్చన టికెట్ ధర ఎంతంటే?
ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు ఆలయ అధికారులు. ఇందుకోసం ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
ఉగాదిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మార్చి 19 నుండి మార్చి 28 వరకు వరుసగా పలు మత, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనుంది దేవస్థానం.

దేవస్థాన అధికారుల తెలిపిన వివరాల ప్రకారం, ఆలయ వేద కమిటీ సూచనల మేరకు ఈ 10 రోజుల ఉత్సవాలలో ప్రత్యేక పుష్పార్చనలు, పలు వేద క్రతువులు నిర్వహిస్తారు. మార్చి 19న ఉగాది, మార్చి 27న శ్రీరామ నవమి పర్వదినాలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాలను రూపొందించారు.
మార్చి 19న తెల్లవారుజామున 3 గంటలకు మూలవిరాట్టు అయిన శ్రీ కనక దుర్గా అమ్మవారికి, ఉపాలయాల్లోని ఇతర దేవతలకు 'స్నపన అభిషేకం' నిర్వహించడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అనంతరం అలంకరణ, అర్చన, నివేదన, హారతి కార్యక్రమాలు జరుగుతాయి. ఉదయం 8 గంటలకు అమ్మవారి దర్శనం ప్రారంభమవుతుంది. అదే రోజు ఉదయం 9:15 గంటలకు నూతనంగా నిర్మించిన పూజా మండపంలో కలశ స్థాపన, ప్రత్యేక పుష్పార్చనల ప్రారంభోత్సవం జరుగుతాయి.
ఉగాది ఉత్సవాలలో భాగంగా మధ్యాహ్నం 3 గంటలకు కళావేదిక వద్ద పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు యాగశాలలో మండప పూజ, అగ్ని ప్రతిష్ట, రుద్ర హోమం వంటి కార్యక్రమాలు జరుగుతాయి. సాయంత్రం 6 గంటలకు శ్రీ మల్లికార్జున మహామండపం నుండి సంప్రదాయ వెండి రథోత్సవం ప్రారంభమవుతుంది. ఈ రథం కనక దుర్గా నగర్, రథం సెంటర్, బ్రాహ్మణ వీధి, జమ్మిదొడ్డి, కోమల విలాస్, రామయ్య కూల్ డ్రింక్స్ షాపు, బోడెమ్మ హోటల్, వన్ టౌన్ పోలీస్ స్టేషన్, సమరంగం కూడలి, శ్రీను హోటల్ మార్గాల గుండా ప్రయాణించి, తిరిగి మహామండపానికి చేరుకుంటుంది.
మార్చి 26న చైత్ర శుద్ధ అష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ అభయ ఆంజనేయ స్వామి, మెట్ల మార్గం వద్ద వెలసిన ఆంజనేయ స్వామి విగ్రహానికి అభిషేకం, నాగవల్లి ఆకులతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని, మార్చి 27వ తేదీ ఉదయం 10 గంటలకు కళావేదికలో శ్రీ సీతారామ కళ్యాణం వైభవంగా జరుగుతుంది.
వసంత నవరాత్రి ఉత్సవాలు మార్చి 28వ తేదీన ముగియనున్నాయి. ఈ సందర్భంగా ఉదయం 9 గంటలకు 'పూర్ణాహుతి' కార్యక్రమం, ఆ వెంటనే ఉదయం 10 గంటలకు శ్రీరామ పట్టాభిషేకం నిర్వహిస్తారు.
మార్చి 19 నుండి మార్చి 27వ తేదీ వరకు, ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు మల్లె, కనకాంబరం, గులాబీ, చామంతి, మందారం, తామర, సంపంగి వంటి వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేక పుష్పార్చనలు నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు.
ఈ ప్రత్యేక పుష్పార్చన సేవకు సంబంధించిన టికెట్ ధరను దంపతులకు రూ.2,500గా నిర్ణయించారు. ఈ సేవలో పాల్గొనే దంపతులకు అంతరాలయ దర్శనంతో పాటు, శేష వస్త్రం, రవిక, అమ్మవారి శ్రీచక్ర పీఠం, ఒక పెద్ద లడ్డుతో కూడిన ప్రసాదం అందజేస్తారు. భక్తులు ఆలయ వెబ్సైట్ ద్వారా గానీ లేదా ఆలయంలోని అర్జిత సేవ కౌంటర్ల వద్ద గానీ ఈ టికెట్లను పొందవచ్చని అధికారులు తెలిపారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper












