దేశీయ సరకు రవాణా రంగాన్ని బలోపేతం చేస్తూ…. మల్టీమోడల్ లాజిస్టిక్స్ (బహుళ రవాణా అనుసంధానత) వ్యవస్థ విస్తరణలో దక్షిణ మధ్య రైల్వే ఒక కీలక మైలురాయిని అధిగమించింది. పునర్వ్యవస్థీకరించిన దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి వచ్చే ఆంధ్రప్రదేశ్లోని వెల్దుర్తి గూడ్స్ షెడ్ నుంచి తొలిసారిగా ముడి ఇనుము (పిగ్ ఐరన్) లోడ్ చేసిన సరికొత్త కంటైనర్ రైలును రైల్వే అధికారులు విజయవంతంగా ప్రారంభించారు.
ఇదే తొలిసారి…

వెల్దుర్తి గూడ్స్ షెడ్ నుంచి బయలుదేరిన ఈ మొదటి కంటైనర్ రేక్ ద్వారా ఏకంగా 2,670 టన్నుల ముడి ఇనుమును పంజాబ్ రాష్ట్రంలోని ఫిల్లూర్ ఇన్ల్యాండ్ కంటైనర్ డిపోకు (ICD) రవాణా చేశారు. ఈ ఒకే ఒక్క సరకు రవాణా ద్వారా దక్షిణ మధ్య రైల్వేకు దాదాపు రూ.59 లక్షల అంచనా ఆదాయం సమకూరడం విశేషం.
దేశీయ కంటైనర్ రవాణాను భారీగా ప్రోత్సహించే లక్ష్యంతో వెల్దుర్తి గూడ్స్ షెడ్ను 'ప్రత్యేక కంటైనర్ రైల్ టెర్మినల్' గా ఈ నెల 10వ తేదీన రైల్వే బోర్డు నోటిఫై చేసింది. హైదరాబాద్ డివిజన్లోనే ప్రత్యేక కంటైనర్ రైల్ టెర్మినల్గా గుర్తింపు పొందిన ఈ వెల్దుర్తి గూడ్స్ షెడ్.. భవిష్యత్తులో దక్షిణ మధ్య రైల్వే ఆర్థిక పురోగతికి విశేషంగా దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు.
కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాన్కార్) ఈ టెర్మినల్ ప్రాధాన్యతను గుర్తించి, ఇక్కడి నుంచి ప్రతి నెలా మూడు కంటైనర్ రేక్లను లోడింగ్ చేసేందుకు అధికారికంగా అంగీకరించింది.
ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (GM) సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. తొలి కంటైనర్ లోడింగ్ను అత్యంత సమర్థవంతంగా, విజయవంతంగా సాధించినందుకు హైదరాబాద్ డివిజన్ రైల్వే అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ టెర్మినల్ అందుబాటులోకి రావడం వల్ల ఈ ప్రాంతంలోని పారిశ్రామికవేత్తలు, వ్యాపారులకు మరింత వేగవంతమైన, కస్టమర్-కేంద్రీకృత లాజిస్టిక్స్ సేవలు అందుతాయని ఆయన స్పష్టం చేశారు.