Andhrapradesh : ప్రయాణికులకు శుభవార్త - రాయనపాడు రైల్వేస్టేషన్ సిద్ధం..! ప్రారంభానికి ముహుర్తం ఫిక్స్, విశేషాలు
Rayanapadu Railway Station Development : అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ.35 కోట్లకు పైగా వ్యయంతో ముస్తాబైన రాయనపాడు రైల్వే స్టేషన్ జూలై 17న ప్రారంభం కానుంది. విజయవాడ జంక్షన్కు శాటిలైట్ టెర్మినల్గా సేవలందించనున్న ఈ స్టేషన్ ఆధునిక హంగులతో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.
Rayanapadu Railway Station Development : విజయవాడ పరిసర ప్రాంతాల రైల్వే ప్రయాణికులకు శుభవార్త వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'అమృత్ భారత్ స్టేషన్ పథకం' కింద సర్వాంగ సుందరంగా ముస్తాబైన రాయనపాడు రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. రూ.35 కోట్లకు పైగా భారీ వ్యయంతో పునర్నిర్మించిన ఈ అత్యాధునిక రైల్వే స్టేషన్ను జూలై 17వ తేదీన ప్రారంభించనున్నారు.

రైల్వే మంత్రిత్వ శాఖ సమన్వయంతో, పక్కా ప్రణాళికతో ఈ స్టేషన్ను ఆధునీకరించారు. విజయవాడ ప్రధాన రైల్వే జంక్షన్పై ప్రయాణికుల రద్దీ ఒత్తిడిని తగ్గించడానికి రాయనపాడు ఒక అద్భుతమైన శాటిలైట్ టెర్మినల్గా మారనుంది. ఇక్కడి నుంచి ప్రతిరోజూ కొన్ని ఎక్స్ప్రెస్ సర్వీసులతో పాటు సుమారు 12 రైళ్లు నడుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
సరికొత్తగా రాయనపాడు…
అమృత్ భారత్ పథకంలో భాగంగా ప్రయాణికులకు అత్యున్నత స్థాయి సదుపాయాలు కల్పించేలా రాయనపాడు స్టేషన్ను తీర్చిదిద్దారు. అప్గ్రేడ్ చేసిన ప్లాట్ఫారమ్లు, అత్యాధునిక ప్యాసింజర్ వెయిటింగ్ హాళ్లు, డిజిటల్ టికెట్ కౌంటర్లు, స్వచ్ఛమైన తాగునీటి వసతులు, ప్లాట్ఫారమ్ షెల్టర్లు, కంటికి విందుగొలిపేలా ల్యాండ్స్కేప్ గార్డెన్లు ఈ స్టేషన్ ప్రత్యేకతలు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు సులభంగా రాకపోకలు సాగించేలా ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేశారు.
ప్రధానంగా చేపట్టిన ఆధునీకరణ పనులు ఇవే:
- ఎయిర్ కండిషన్డ్ (AC) ప్రిపెయిడ్ వెయిటింగ్ హాల్, దివ్యాంగులకు అనుకూలంగా ఉండేలా మోడ్యులర్ టాయిలెట్ కాంప్లెక్స్ నిర్మించారు.
- ఒకటో నంబర్ ప్లాట్ఫారమ్ను 670 మీటర్ల పొడవునా సర్వాంగ సుందరంగా పునర్నిర్మించారు. అలాగే 340 మీటర్ల మేర అధునాతన ప్లాట్ఫారమ్ షెల్టర్ను ఏర్పాటు చేశారు.
- అంధులైన ప్రయాణికులు సురక్షితంగా నడవడానికి వీలుగా ప్రత్యేక టాక్టైల్ పాత్వేలు (స్పర్శ మార్గాలు) నిర్మించారు.
- వృద్ధులు, దివ్యాంగుల సౌకర్యార్థం ఫుట్ ఓవర్బ్రిడ్జిపై రెండు సరికొత్త లిఫ్ట్ సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చారు.
కేవలం మౌలిక వసతులు మాత్రమే కాకుండా, ఈ ప్రాంత సంస్కృతిని ప్రతిబింబించేలా స్టేషన్ ప్రధాన భవనాన్ని ముస్తాబు చేశారు. ఆధునిక లైటింగ్, ర్యాంపులు, టాక్టైల్ టైల్స్తో పాటు ప్రసిద్ధ కొండపల్లి కొయ్యబొమ్మల సాంప్రదాయాన్ని చాటిచెప్పేలా అద్భుతమైన కళాఖండాలను ఇక్కడ ప్రదర్శించారు.
స్టేషన్ వెలుపల విశాలమైన ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లు, సురక్షితమైన కాంపౌండ్ వాల్, పాదచారుల కోసం అందమైన ల్యాండ్స్కేప్ నడకదారులు, విశాలమైన పార్కింగ్ సదుపాయం, రోడ్డు లేన్ మార్కింగ్స్ మరియు అధునాతన వీధి దీపాలను ఏర్పాటు చేశారు. ఈ ఆధునీకరణ పనుల వల్ల విజయవాడ ప్రాంతంలో రాయనపాడు స్టేషన్ అత్యంత కీలకమైన రైల్వే హబ్గా ఎదుగుతుందని, ప్రయాణికుల భద్రత, సౌకర్యాలు మరింత మెరుగవుతాయని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అభిప్రాయపడ్డారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

