శ్రీవారి భక్తులకు అలర్ట్ - పర్వదినాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు, తేదీల వారీగా వివరాలు

శ్రీవారి భక్తులకు టీటీడీ మరో ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. డిసెంబర్ నుంచి జనవరి నెల వరకు పర్వదినాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఓ ప్రకటనలో కోరింది.

Published on: Dec 05, 2025 9:20 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. డిసెంబర్ నెల నుంచి 2026 జనవరి నెల వరకు శ్రీవారి ఆలయంలో నిర్వహించు పలు పర్వదినాల నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను ఆయా రోజుల్లో రద్దు చేయడం జరిగిందని ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

తిరుమల శ్రీవారి ఆలయం
తిరుమల శ్రీవారి ఆలయం

పర్వదినాల వివరాలు…

డిసెంబర్ 23న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, వైకుంఠ ఏకాదశి ముందు రోజైన డిసెంబర్ 29వ తేదీ ఉంది. డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 8వ తేది వరకు వైకుంఠ ద్వార దర్శనాలు, జనవరి 25న రథ సప్తమి నిర్వహిస్తారు. వీటి కారణంగా ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయడం జరిగిందని టీటీడీ ప్రకటించింది.

పైన పేర్కొన్న రోజులకు ముందురోజు వీఐపీ దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టీటీడీ తెలియజేసింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీకి సహకరించాల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి చేసింది.

కన్నుల పండువగా కార్తీక దీపోత్సవం:

తిరుమల శ్రీవారి అలయంలో గురువారం సాయంత్రం కార్తీక పౌర్ణమి దీపోత్సవం టీటీడీ ఘనంగా నిర్వహించింది. కార్తీక పున్నమినాడు సాయంత్రం శ్రీవారికి సాయంకాల కైంకర్యాదులు నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది.

ఇందులో భాగంగా సాయంత్రం 5 నుండి రాత్రి 8.30 గంటల వరకు అత్యంత ఘనంగా జరిగిన ఈ కార్తీక పర్వ దీపోత్సవంలో మొదట శ్రీ యోగనరసింహస్వామి ఆలయం ప్రక్కనవున్న పరిమళంఅర దగ్గర కొత్త మూకుళ్లతో దీపాలను వెలిగించారు. తదుపరి వీటిని ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ, ఆనంద నిలయంలో శ్రీవారికి హారతి ఇచ్చారు.

ఆ తర్వాత గర్భాలయంలో అఖండం, కులశేఖర పడి, రాములవారి మేడ, ద్వార పాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత, బంగారు బావి, కల్యాణ మండపం, సభ అర, తాళ్లపాక అర, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహస్వామి, విష్వక్సేనులు, చందనం అర, పరిమళం అర, వెండి వాకిలి, ధ్వజ స్తంభం, బలిపీఠం, క్షేత్ర పాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూల బావి, రంగ నాయక మండపం, మహా ద్వారం, బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వద్ద సుమారుగా వెయ్యి నేతి జ్యోతులను మంగళ వాయిద్యల న‌డుమ‌ వేద మంత్రోచ్ఛారణలతో ఏర్పాటు చేశారు.