ఏపీ ప్రజలకు చల్లని కబురు.. జూన్ 6 వరకు రాష్టంలో వర్షాలు

AP Weather Update : ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం భిన్నంగా మారింది. జూన్ 6 వరకు ఏపీలో వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.

Published on: Jun 3, 2026, 10:06:44 IST
By , Amaravati
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజుల్లో వాతావరణంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జూన్ 6వ తేదీ వరకు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం (IMD) హెచ్చరించింది.

ఏపీలో వర్షాలు
ఏపీలో వర్షాలు

తూర్పు మధ్యప్రదేశ్, దానికి ఆనుకుని ఉన్న ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో ఏర్పడిన ఆవర్తనం నుండి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా ఈశాన్య తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి కొనసాగుతోంది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు వెల్లడించారు.

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్ల రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో వర్షాలు పడే అవకాశం ఉంది.

వీటితో పాటు రాష్ట్రంలోని మధ్య, ఉత్తర ప్రాంతాల్లోని ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ నివేదిక ప్రకారం.. మంగళవారం ఉదయం 8.30 నుండి సాయంత్రం 6 గంటల మధ్య పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతంపేటలో రాష్ట్రంలోనే అత్యధికంగా 27.5 మి.మీ వర్షపాతం నమోదైంది. ప్రకాశం, అనకాపల్లి, అన్నమయ్య, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిశాయి.

రాష్ట్రంలో కొన్నిచోట్ల వర్షాలు కురుస్తున్నప్పటికీ, మెజారిటీ ప్రాంతాల్లో ఎండ తీవ్రత తగ్గలేదు. ప్రజలు తీవ్రమైన ఉక్కపోత, ఎండదెబ్బతో అల్లాడిపోతున్నారు. మంగళవారం నెల్లూరు జిల్లా గూడూరులో అత్యధికంగా 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ప్రకారం.. మంగళవారం 43 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతాల వివరాలు:

  • పిడుగురాళ్ల (పల్నాడు జిల్లా) – 44.9 డిగ్రీలు
  • కొండపి (ప్రకాశం జిల్లా) – 44.6 డిగ్రీలు
  • ఇంకొల్లు (బాపట్ల జిల్లా) – 43.5 డిగ్రీలు
  • బోనుపల్లె (తిరుపతి జిల్లా) – 43.4 డిగ్రీలు
  • కంబం (మార్కాపురం జిల్లా) – 43.3 డిగ్రీలు
  • తొర్రగుడిపాడు (ఎన్టీఆర్ జిల్లా) – 43.3 డిగ్రీలు

ఎండ తీవ్రతతో ఇబ్బంది పడుతున్న ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ ఒక తీపి కబురు అందించింది. వారం రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. అయితే వర్షాలు పడే సమయంలో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున రైతులు, గొర్రెల కాపరులు, ప్రజలు చెట్ల కింద ఉండరాదని, సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More