ఉత్తరాంధ్ర తీరప్రాంతం, పశ్చిమమధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీనితో పాటుగా కర్ణాటక మరియు తమిళనాడు మీదుగా ద్రోణి విస్తరించి ఉందని పేర్కొంది.
ఈ జిల్లాలకు వర్ష సూచన…

వీటి ప్రభావంతో ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
అలాగే పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.
రేపు(మార్చి 22) విజయనగరం,విశాఖ, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల,అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
వర్షాల నేపథ్యంలో…. రైతులు వ్యవసాయ పనుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉరుములతో కూడిన వర్షం కురిసే సమయంలో పొలంలో ఉండరాదని పేర్కొంది. ప్రజలు చెట్ల క్రింద నిలబడరాదని హెచ్చరించింది.
తెలంగాణకు వర్షసూచన :
మరోవైపు తెలంగాణలోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరాల ప్రకారం... ఇవాళ మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి,ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయి. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఇక తెలంగాణలో రేపట్నుంచి పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరిలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. వర్షాలు తగ్గటంతో మళ్లీ ఎండల తీవ్రత పెరగనుంది.