YS Jagan On CBN : ప్రొఫెసర్ నాగేశ్వర్పై కేసులు దారుణం.. ఏపీని 'జంగిల్ రాజ్' చేశారు - సీఎం చంద్రబాబుపై జగన్ ఫైర్
YS Jagan On CM Chandrababu : ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పోలీస్ రాజ్యం నడుస్తోందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. రైతులు, ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులపై అక్రమ కేసులు, అరెస్టులను ఆయన తీవ్రంగా ఖండించారు.
YS Jagan On CM Chandrababu : కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలు, జర్నలిస్టులు, సామాజిక మాధ్యమాల ప్రతినిధులపై అణచివేత చర్యలు ఎక్కువయ్యాయని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక నియంతలా మారి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. ఇక్కడ పూర్తిగా 'పోలీసు రాజ్యం' నడుస్తోందని దుయ్యబట్టారు.

గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ పరిధిలోని మామిళ్లపల్లె గ్రామంలో తీవ్ర అన్యాయానికి గురైన కాపు సామాజికవర్గానికి చెందిన రైతులను పరామర్శించేందుకు వెళ్లిన వైసీపీ ముఖ్య నేతలపై పోలీసులు ప్రవర్తించిన తీరును వైఎస్ జగన్ తీవ్రంగా తప్పుపట్టారు. పార్టీ సీనియర్ నేతలు జోగి రమేష్, జూపూడి ప్రభాకర్, వరికూటి అశోక్బాబు, పీట నాగ మోహన్ కృష్ణ, అంబటి మురళితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలపై పోలీసులు పైశాచికంగా దాడి చేసి అరెస్టు చేయడం అత్యంత దారుణమన్నారు.
"శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి, బాధితులను పరామర్శించడానికి వెళితే చంద్రబాబుకు ఎందుకు అంత బీపీ వస్తోంది? ఎందుకీ ఫ్రస్టేషన్?" అని జగన్ ప్రశ్నించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను దాచాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మొక్కజొన్న కనీస మద్దతు ధర (MSP) రూ. 2,400 ఉండాల్సి ఉండగా, ఈ ఏడాది రైతులకు కనీసం రూ. 1,400 నుంచి రూ. 1,600 కూడా దక్కలేదని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తన అనుచరులతో రైతులపై దాడులు చేయించడాని జగన్ ఆరోపించారు. పైగా ఆ రైతులపైనే అన్యాయంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించారని మండిపడ్డారు. కనీస మద్దతు ధర ఇవ్వకపోయినా రైతులు ప్రశ్నించకూడదా…? వారికి సంఘీభావం తెలపడానికి వెళ్తే అక్రమంగా అరెస్టులు చేస్తారా…? అని ముఖ్యమంత్రిని నిలదీశారు.
ప్రొఫెసర్ నాగేశ్వర్పై కేసులు దారుణం - వైెఎస్ జగన్
ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతున్న మేధావులు, గౌరవప్రదమైన వ్యక్తులను సైతం ఈ ప్రభుత్వం వదలడం లేదని జగన్ విమర్శించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ జర్నలిస్టుగా, విశ్లేషకుడిగా, మాజీ ఎమ్మెల్సీగా నిత్యం ప్రజా సమస్యలపై గళం విప్పే ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ పై చంద్రబాబు ప్రభుత్వం దగ్గరుండి కేసులు పెట్టించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్ని రాజకీయ పార్టీల విధానాలపైనా, సామాజికాంశాలపైనా నిష్పాక్షికంగా విశ్లేషణలు చేస్తారని.. అటువంటి వ్యక్తి నిజం మాట్లాడితే కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే అరెస్టులు, విమర్శిస్తే వేధింపులకు గురిచేస్తూ రాష్ట్రాన్ని చంద్రబాబు 'జంగిల్ రాజ్' (అరాచక రాజ్యం) గా మార్చేశారని దుయ్యబట్టారు.
పోరాటం ఆగదు - వైఎస్ జగన్
చంద్రబాబు ప్రభుత్వం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలని… ప్రజలు ఈ అణచివేతను ఎల్లకాలం సహించరని జగన్ హెచ్చరించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ, పోలీసులను రాజకీయ ఆయుధాలుగా వాడుకుంటూ ఎంతకాలం పాలిస్తారని ప్రశ్నించారు. ప్రజాపక్షాన నిలబడి పోరాడటమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన బాధ్యతని స్పష్టం చేశారు. ప్రభుత్వ అక్రమాలు, కక్షసాధింపు చర్యలపై తమ పోరాటం ఆగే ప్రసక్తే లేదని… ఎల్లప్పుడూ ప్రజలకు అండగా వైసీపీ గళం విప్పుతూనే ఉంటుందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

