నటి అనసూయపై కేసు నమోదు.. జై శ్రీరామ్ వ్యాఖ్యలపై బీజేపీ నేతల ఫిర్యాదు!

Anchor Anasuya : ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్‌పై బోరబండ పోలీస్ స్టేషన్‌లో స్థానిక బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. హిందూ మతంపై అనసూయ అనుచిత వ్యాఖ్యలు చేశారని కాషాయ పార్టీ నాయకులు ఆరోపించారు.

Published on: Aug 17, 2026, 16:10:14 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రముఖ టాలీవుడ్ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. హిందూ మతం, సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో భారతీయ జనతా పార్టీ నాయకులు ఆమెపై హైదరాబాద్‌లోని బోరబండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

అనసూయ (instagram-Anasuya Bharadwaj)
అనసూయ (instagram-Anasuya Bharadwaj)

బీజేపీ నాయకులు తమ ఫిర్యాదులో అనసూయ చేసిన వ్యాఖ్యలు కోట్లాదిమంది హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని పేర్కొన్నారు. జై శ్రీరామ్ నినాదం ముసుగులో కొందరు అసాంఘిక దాడులకు పాల్పడుతున్నారంటూ అనసూయ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కాషాయ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఏది పడితే అది మాట్లాడకూడదని, మాట్లాడేటప్పుడు చూసుకోవాలని హెచ్చరించారు. మతపరమైన భావాలను గాయపరిచినందున ఆమెపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు.

పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసి అనసూయ తన సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, ఎవరికీ భయపడేది లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ఆమె పలు కీలక విషయాలను వెల్లడించారు.

కొందరు కావాలనే తన మాటలను సగం సగం ఎడిట్ చేసి వక్రీకరిస్తున్నారని, లేని అర్థాలను తీస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అనసూయ ఆరోపించారు. తాను ఏ మతాన్ని, ఏ కులాన్ని లేదా ఏ సమూహాన్ని ఉద్దేశించి ఆ మాటలు అనలేదని స్పష్టం చేశారు. కేవలం సోషల్ మీడియాలో తనపై వ్యక్తిగత దాడులు, వేధింపులకు పాల్పడుతున్న కొందరు వ్యక్తుల వైఖరిని మాత్రమే ప్రశ్నించానని తెలిపారు.

తాను కూడా సనాతన ధర్మాన్ని పాటించే హిందువునని, ఆంజనేయ స్వామి భక్తురాలినని అనసూయ చెప్పారు. ఆ అనామకుల ప్రవర్తనపై తాను ప్రశ్నిస్తే, ఈ వివాదంతో అసలైన దొంగలంతా బయటకు వస్తున్నారంటూ కౌంటర్ ఇచ్చారు. తన వివరణ ముగింపులో జై శ్రీరామ్, జై హనుమాన్ అని పేర్కొంటూ పోస్ట్ ముగించారు.

బీజేపీ నాయకుల ఫిర్యాదును స్వీకరించిన బోరబండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వీడియో క్లిప్‌లు, లీగల్ అంశాలను పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యవహారం టాలీవుడ్ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More