బీజేపీ జాతీయ కార్యవర్గం: స్మృతి ఇరానీ, రామ్ మాధవ్‌లకు చోటు

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తన నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేస్తూ రూపకల్పన చేసిన ఈ కమిటీలో 12 మంది మహిళలకు స్థానం కల్పించారు. స్మృతి ఇరానీ, రామ్ మాధవ్ మళ్లీ కీలక బాధ్యతల్లోకి రాగా, పలువురు సీనియర్లకు నిరాశ ఎదురైంది.

Published on: Aug 17, 2026, 15:47:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 12వ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఏడు నెలల తర్వాత, నితిన్ నబీన్ తన నూతన కార్యవర్గ బృందాన్ని ప్రకటించారు. పార్టీ ఆవిర్భావ సూత్రాలకు, సామాజిక సమీకరణాలకు (సోషల్ ఇంజినీరింగ్) పెద్దపీట వేస్తూ రూపొందించిన ఈ నూతన కమిటీలో విస్తృత స్థాయి కులాలు, తెగలకు ప్రాతినిధ్యం కల్పించారు. మొత్తం కార్యవర్గంలో 12 మంది మహిళలకు చోటు లభించింది.

బీజేపీ జాతీయ కార్యవర్గం: స్మృతి ఇరానీ, రామ్ మాధవ్‌లకు చోటు
బీజేపీ జాతీయ కార్యవర్గం: స్మృతి ఇరానీ, రామ్ మాధవ్‌లకు చోటు

స్మృతి ఇరానీ, రామ్ మాధవ్ రీ-ఎంట్రీ

బీజేపీ నూతన కమిటీలో పలువురు సీనియర్ నాయకులు మళ్లీ ప్రధాన కార్యవర్గంలోకి వచ్చారు. మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, గతంలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రామ్ మాధవ్‌లు మళ్లీ కీలక బాధ్యతలు చేపట్టారు. రామ్ మాధవ్‌ను పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించగా, ప్రకటించిన ఎనిమిది మంది జాతీయ ప్రధాన కార్యదర్శులలో ఏకైక మహిళగా స్మృతి ఇరానీ చోటు దక్కించుకున్నారు.

త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్ దేబ్‌ను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. కేంద్ర మంత్రి పియూష్ గోయల్‌కు జాతీయ కోశాధికారి (ట్రెజరర్) బాధ్యతలు అప్పగించారు. ఆయన గతంలో 2010 నుంచి 2014 వరకు కూడా ఇదే బాధ్యతను నిర్వహించారు. అనిల్ బలూనీని మీడియా ఇన్‌చార్జీగా కొనసాగించారు.

ప్రధాన కార్యదర్శుల జాబితా.. ఎన్నికల వ్యూహాలు

పార్టీ మొత్తం ఎనిమిది మంది జాతీయ ప్రధాన కార్యదర్శులను ప్రకటించగా, పాత కార్యవర్గం నుంచి వినోద్ తావ్డే, సునీల్ బన్సాల్‌లను మాత్రమే తిరిగి కొనసాగించారు. కొత్తగా జాతీయ ప్రధాన కార్యదర్శుల జాబితాలో ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ మాజీ ఎంపీ హరీష్ ద్వివేది (ఇటీవల అస్సాం రాష్ట్ర ఇన్‌చార్జిగా వ్యవహరించారు), రాజస్థాన్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ పూనియా, మధ్యప్రదేశ్‌కు చెందిన ఓబీసీ నాయకుడు గజేంద్ర పటేల్, సంజయ్ భాటియాలు చోటు దక్కించుకున్నారు.

రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వినోద్ తావ్డే, సునీల్ బన్సాల్‌లకు కీలక బాధ్యతల్లో కొనసాగింపు లభించింది. వచ్చే ఏడాది ఆరంభంలో అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఇతర రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. గతంలో పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో సునీల్ బన్సాల్ కీలక పాత్ర పోషించగా, కేరళ ఎన్నికలలో వినోద్ తావ్డే బాధ్యతలు నిర్వర్తించారు. బీహార్‌లో నితీష్ కుమార్ రాజీనామా చేసి, సామ్రాట్ చౌదరి బాధ్యతలు స్వీకరించే క్రమంలో తావ్డే రాష్ట్ర ఇన్‌చార్జిగా వ్యవహరించి రాజకీయ పరిణామాలను పర్యవేక్షించారు.

జాతీయ కార్యదర్శులు వీరే..

జాతీయ కార్యదర్శుల జాబితాలో 16 మందికి అవకాశం కల్పించారు. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్ షహర్ (ఎస్‌సీ) నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచిన భోలా సింగ్, మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్న ఓబీసీ నాయకురాలు కవితా పటీదార్‌లతో పాటు మరొక 14 మందిని జాతీయ కార్యదర్శులుగా నియమించారు.

ఈ సారి పాత కమిటీలోని పలువురు ప్రముఖులకు నిరాశ ఎదురైంది. 2015 నుంచి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న అరుణ్ సింగ్, 2023లో ప్రధాన కార్యదర్శి అయిన రాధా మోహన్ దాస్ అగర్వాల్‌లకు స్థానం దక్కలేదు. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పోటీ చేసేందుకు వీలుగా, తన సుదీర్ఘకాల స్థానమైన గోరఖ్‌పూర్ అసెంబ్లీ సీటును అగర్వాల్ ఖాళీ చేశారు. అప్పట్లో యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. కాగా, అగర్వాల్, అరుణ్ సింగ్‌లు ఇద్దరూ ప్రస్తుతం రాజ్యసభ ఎంపీలుగా ఉన్నారు. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన తరుణ్ చుగ్‌ను పంజాబ్ రాష్ట్ర ఇన్‌చార్జిగా నియమించారు.

దుష్యంత్ గౌతమ్‌పై వేటు

దళిత నాయకుడైన దుష్యంత్ గౌతమ్‌ను కూడా నూతన కమిటీ నుంచి తొలగించారు. ఈయన 2020 సెప్టెంబర్ నుంచి ప్రధాన కార్యదర్శిగా, ఉత్తరాఖండ్ రాష్ట్ర ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఆయన ఓటమి పాలయ్యారు. 2022లో ఉత్తరాఖండ్‌లో జరిగిన అంకిత భండారీ హత్య కేసుతో ఆయన పేరును ముడిపెడుతూ వివాదం సృష్టించారు. దీనిపై గౌతమ్ దాఖలు చేసిన మాననష్ట దావాను విచారించిన ఢిల్లీ హైకోర్టు, సదరు హత్య కేసుతో ఆయనను ముడిపెడుతూ పోస్ట్ చేసిన సోషల్ మీడియా కంటెంట్‌ను తొలగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

యువ నాయకత్వానికి పెద్దపీట

బీహార్ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్న నితిన్ నబీన్ జనవరి 20న బీజేపీ 12వ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. 1980 ఏప్రిల్‌లో బీజేపీ ఆవిర్భవించగా, సరిగ్గా ఒక నెల తర్వాత 1980 మేలో నితిన్ నబీన్ జన్మించారు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More