AP Govt Nandi Awards : టాలీవుడ్కు శుభవార్త - త్వరలోనే 'నంది అవార్డులు'
నంది అవార్డులపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ కీలక ప్రకటన చేశారు. 2 లేదా 3 నెలల వ్యవధిలోనే నంది అవార్డులను అందజేస్తామన్నారు.
నంది అవార్డులపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూడా చర్చించారు. అయితే ఇదే విషయంపై తాజాగా ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ కీలక ప్రకటన చేశారు. 2 లేదా 3 నెలల కాలంలోనే నంది అవార్డులను ప్రదానం చేస్తామన్నారు.

త్వరలోనే నంది అవార్డులు - మంత్రి కందుల దుర్గేశ్
సినిమా, టీవీ, నాటకరంగ కళాకారులకు ఇచ్చే నంది అవార్డులపై సీఎం చంద్రబాబుతో ఇప్పటికే పలుసార్లు సమావేశం నిర్వహించామని మంత్రి దుర్గేశ్ చెప్పారు. నంది అవార్డుల ప్రదానానికి సీఎం చంద్రబాబు ఆమోదముద్ర వేశారని… త్వరలోనే అవార్డులు ఇస్తామని తెలిపారు. శనివారం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన… రాష్ట్ర విభజన తర్వాత 2014, 2015, 2016 సంవత్సరాలకు గాను 2017లో నంది అవార్డులను అప్పటి ప్రభుత్వం (టీడీపీ) ఇచ్చిందని గుర్తు చేశారు. ఆ తర్వాత అవార్డుల కార్యక్రమం ఆగిపోయిందన్నారు.
అప్పటి నిబంధనల ప్రకారమే ఇప్పుడు కూడా అవార్డులు ఇవ్వాలా…? లేక ఏమైనా మార్పులు ఏమైనా చేయాలా…? అనే దానిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. ఇదే విషయంపై కార్యాచరణను సిద్ధం చేస్తున్నామని… డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హీరో నందమూరి బాలకృష్ణ నుంచి ఈ అవార్డులపై సలహాలు తీసుకుంటామని వివరించారు. రెండు లేదా మూడు నెలల్లోనే అవార్డుల వేడుక ఉంటుందని వెల్లడించారు.
నంది అవార్డుల ప్రదానం మాత్రమే కాకుండా… నంది నాటకోత్సవాలను కూడా నిర్వహిస్తామని మంత్రి దుర్గేశ్ చెప్పారు. అవార్డుల ప్రదానం చేసే వేదిక వివరాలను కూడా త్వరలోనే వెల్లడిస్తామన్నారు.
సినీ పరిశ్రమకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డులు ఇచ్చేవారు. ఇది పూర్తిగా ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమం. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఈ అవార్డులపై సందిగ్ధత నెలకొన్న సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ అవార్డు పేరు మార్చి… ప్రజా గాయకుడు గద్దర్ పేరిట అవార్డులను ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ కూడా…. నంది అవార్డులపై కసరత్తు చేస్తూ వస్తోంది. పేరు మార్చకుండా పాత పేరుతోనే అవార్డులు ఇవ్వాలని కూడా నిర్ణయించింది.

E-Paper












