బ్రహ్మముడి ఫిబ్రవరి 10 ఎపిసోడ్: పాపను మార్చింది రుద్రాణియే అని తెలుసుకున్న అప్పు.. రాజ్ కాళ్ల మీద పడిన మంత్రి
బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (ఫిబ్రవరి 10) ఎపిసోడ్ లో తమ సొంత పాపను తీసుకొని రాజ్, కావ్య ఇంటికి వస్తారు. అటు పాపను మార్చడంలో రుద్రాణి హస్తం ఉందని అప్పు తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 952వ ఎపిసోడ్ లో తన తప్పు తెలుసుకున్న మంత్రి ధర్మేంద్ర రాజ్, కావ్యకు వాళ్ల సొంత కూతురిని అప్పగించి వాళ్ల కాళ్ల మీద పడతాడు. అయితే దీని వెనుక తాను ఉన్నానని ఎట్టిపరిస్థితుల్లోనూ రాజ్, కావ్యలకు తెలియకూడదని రుద్రాణి అనుకున్నా.. అనుకోకుండా అప్పుకి దొరికిపోతుంది.

రాజ్, కావ్యలకు మంత్రి క్షమాపణ
బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (ఫిబ్రవరి 10) ఎపిసోడ్ రౌడీల నుంచి పాపను రాజ్ కాపాడే సీన్ తో మొదలవుతుంది. రాజ్ ను ఒకడు కత్తితో పొడవబోగా.. కావ్య అడ్డుకుంటుంది. అప్పుడే మంత్రి ధర్మేంద్ర అక్కడికి వస్తాడు. అతన్ని రాజ్ కాలర్ పట్టుకొని నిలదీస్తాడు.
సొంత కూతురినే చంపుకోవాలని చూస్తావా.. అసలు మనిషివేనా అని ప్రశ్నిస్తాడు. దీంతో మంత్రి పశ్చాత్తాపడతాడు. తన తప్పు తెలుసుకున్నానని, మీ కూతురిని తన స్వార్థం కోసం తీసుకుంటే.. మీరు మాత్రం తన సొంత కూతురి కోసం మీ ప్రాణాలను పణంగా పెట్టారని అంటాడు. క్షమించమని రాజ్, కావ్యలను వేడుకుంటాడు.
ధర్మేంద్రను నిలదీసిన భార్య తులసి
అప్పుడే తులసి అక్కడకి వస్తుంది. తన చేతుల్లో ఉన్న బిడ్డ ఎవరు అని భర్తను నిలదీస్తుంది. తన ఆనందం కోసం మరో తల్లికి కడుపుకోతను మిగులుస్తావా అంటూ నిందిస్తుంది. ఇదంతా నీకోసమే చేశానని ధర్మేంద్ర చెబుతున్నా వినదు. దాని కంటే తనకు విషమిచ్చి చంపినా బాగుండేదని అంటుంది. కావ్యకు క్షమాపణ చెబుతుంది తులసి.
కావ్య, రాజ్లకు పాపను అప్పగించిన తులసి
ఆ వెంటనే మీ కన్న కూతురిని తీసుకోండని తన చేతుల్లోని పాపను కావ్యకు అప్పగిస్తుంది. ఆ పాపను తీసుకొని కావ్య చాలా ఎమోషనల్ అవుతుంది. అప్పుడే డాక్టర్ కూడా ధర్మేంద్ర కూతురిని తీసుకొని వస్తుంది. నిజం తెలిసిపోయిందా అని అడుగుతుంది.
ఇక మీ పాపకు కూడా ఎలాంటి ప్రమాదం లేదని, రాజ్ ఆమెకు సర్జరీ చేయించాడని చెబుతుంది. దీంతో ధర్మేంద్ర మరింత ఎమోషనల్ అయి రాజ్ కాళ్ల మీద పడతాడు. మన డబ్బు, పరపతి బతుకులను కలపడానికి తప్ప విడదీయడానికి కాదు అని రాజ్ అంటాడు. ఆ తర్వాత తమ పాపను తీసుకొని ధర్మేంద్ర, తులసి వెళ్లిపోగా.. రాజ్, కావ్య తమ కూతురిని చూసుకొని తెగ మురిసిపోతూ ముద్దుల వర్షం కురిపిస్తారు.
పాపకు హారతి ఇచ్చి స్వాగతించిన అపర్ణ
ఇటు పాప కోసం ఇంట్లో అపర్ణ, ఇందిరా దేవి ఎదురు చూస్తుంటారు. పాపను రాజ్, కావ్య తీసుకొని రాగానే హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానిస్తుంది అపర్ణ. తర్వాత కావ్యను క్షమించమని అడుగుతుంది. నీ తల్లి మనసును అర్థం చేసుకోలేకపోయామని చెబుతుంది. అటు ఇంట్లో వాళ్లు కూడా కావ్యను క్షమించమని అడుగుతారు.
కావ్య పట్టుదల వల్లే తన పాపను తిరిగి తెచ్చుకుందని మెచ్చుకుంటారు. ఇక బారసాల గ్రాండ్ గా చేద్దామని నిర్ణయించుకుంటారు. కొన్ని రోజుల్లో తనకు కూడా పాప పుడుతుందని, అప్పుడు ఇద్దరికీ కలిపి చేద్దామని అప్పు అంటే అందరూ సరే అంటారు.
రుద్రాణి మరో ప్లాన్
తన ప్లాన్ ఫెయిలైనందుకు రుద్రాణి తీవ్ర అసహనానికి గురవతుంది. ఎంతో పక్కాగా ప్లాన్ చేసినా ఫెయిలైపోయిందని రాహుల్, రేఖలతో చెప్పి బాధపడుతుంది. అప్పుడు రాహుల్ ఆమెను ఓదార్చి.. అసలు దీని వెనుక నువ్వు ఉన్నావని మాత్రం రాజ్, కావ్యలకు తెలియకుండా చూసుకోమని చెబుతాడు.
ఒకవేళ ఇప్పటికే తెలిసిపోయిందంటవా అని రుద్రాణి అడిగితే.. అలా అయితే నిన్ను ఇప్పటికే చంపేసి ఉండేవారని రాహుల్ అంటాడు. ఆ మంత్రి ద్వారానే తాను మళ్లీ ఇంట్లోకి వస్తానని, శత్రువు పక్కన ఉంటేనే వాళ్ల పతనాన్ని చూడగలనని రుద్రాణి కొత్త ప్లాన్ వేస్తుంది.
రుద్రాణిని చూసిన అప్పు
ఇటు దుగ్గిరాల చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేద్దామని ఇంట్లో వాళ్లకు చెబుతుంది కావ్య. అది విని వాళ్లు కూడా సంతోషిస్తారు. మరోవైపు మంత్రి ఇంటికి వెళ్లి అప్పు అతన్ని విచారిస్తుంది. పాపను చంపాలని అనుకొని మళ్లీ ఎందుకు వెనక్కి తగ్గారని నిలదీస్తుంది. ఆ సమయంలో రుద్రాణి అక్కడే ఉంటుంది. మంత్రి ఇంటి నుంచి తిరిగి వెళ్తూ రుద్రాణి బయటకు రావడం అప్పు గమనిస్తుంది. దీంతో పాపను మార్చడం వెనుక ఆమె హస్తం ఉన్నట్లు అప్పుకి తెలిసిపోతుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


