బ్రహ్మముడి ఫిబ్రవరి 11 ఎపిసోడ్: మంత్రి కాళ్లపై పడిన రుద్రాణి.. పోలీసు మెదడుకు పని చెప్పిన అప్పు.. కావ్య గొప్ప ఆలోచన
బ్రహ్మముడి సీరియల్ బుధవారం (ఫిబ్రవరి 11) ఎపిసోడ్ లో తన గురించి అసలు నిజం చెప్పి మంత్రి కాళ్లపై పడినంత పని చేస్తుంది రుద్రాణి. అయితే ధర్మేంద్ర మాత్రం కఠినంగానే ఉంటాడు. ఇటు ఇంట్లో పనిమనిషికి వచ్చిన కష్టం చూసి కావ్య గొప్ప ఆలోచన చేస్తుంది.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 953వ ఎపిసోడ్ లో తాను చేసిన తప్పు నుంచి తప్పించుకోవడానికి రుద్రాణి మంత్రి ధర్మేంద్ర కాళ్లపై పడుతుంది. అప్పు తన పోలీసు మెదడుకు పని చెప్పి కూపీ లాగే పనిలో ఉంటుంది. మరోవైపు దుగ్గిరాల చారిటబుల్ ట్రస్ట్ అంటూ కావ్య ఓ గొప్ప ఆలోచనకు ఊపిరి పోస్తుంది.

ఎమోషనల్ అయిన రాజ్.. ఊరటనిచ్చిన కావ్య
బ్రహ్మముడి సీరియల్ బుధవారం (ఫిబ్రవరి 11) ఎపిసోడ్ తన బిడ్డను ఎత్తుకొని రాజ్ ఎమోషనల్ అయ్యే సీన్ తో మొదలవుతుంది. తల్లి మనసు తన బిడ్డను గుర్తించినా తాను మాత్రం ఎందుకు గుర్తించలేకపోయానని రాజ్ బాధపడతాడు. బిడ్డ స్పర్శ, ఊపిరి తగిలినా ఆ బిడ్డ తన బిడ్డ కాదని తల్లి గుర్తించిందని, తాను మాత్రం నమ్మలేదని అంటాడు.
కావ్య వచ్చి అతన్ని ఓదారుస్తుంది. తల్లి మనసుకు ఆ గొప్పతనాన్ని ఇచ్చిన దేవుడు.. తండ్రికి బిడ్డపై ఎంతో ముందు చూపు ఇచ్చాడని అంటుంది. ఏ ఆడబిడ్డకైనా తల్లి కంటే తండ్రిపైనే ఎక్కువ ప్రేమ ఉంటుందని అతన్ని ఓదారుస్తుంది.
అప్పులో మొదలైన అనుమానం
ఇటు అప్పులో అనుమానం మొదలవుతుంది. మంత్రి ధర్మేంద్ర తన బిడ్డను చంపడానికి మనషులను పంపించి అప్పుడే ఎందుకు మనసు మార్చుకున్నాడని ఆలోచిస్తుంది. ఇదే విషయాన్ని కల్యాణ్ తో చెబుతుంది. ధర్మేంద్ర వెనుక ఎవరో ఉన్నారని, ఆ శత్రువు చీకట్లో నుంచే మనల్ని చూస్తున్నాడని అనుమానం వ్యక్తం చేస్తుంది.
అది ఎవరో తెలుసుకోలేకపోతే మనకు ఎప్పటికైనా ప్రమాదం తప్పదని అంటుంది. అది ఎవరో తేల్చాలని, దీనికి సాయం చేయాలని అడుగుతుంది. ఇప్పటికే నెలలు నిండటంతో వద్దని కల్యాణ్ వారించినా అతన్ని కన్విన్స్ చేస్తుంది. తన పోలీసు మెదడుకు పని చెప్పి విచారణ మొదలుపెట్టాలని నిర్ణయించుకుంటుంది.
పని మనిషికి కావ్య, రాజ్ సాయం
మరోవైపు కావ్య, రాజ్ తమ పాపకు బట్టలు వేస్తూ ఉంటారు. ఇంతలో పనిమనిషి శాంత ఏడుస్తూ గదిలోకి వస్తుంది. కావ్య ఏదో చెబుతున్నా పట్టించుకోదు. దీంతో ఏమైందని ఆమెను అడుగుతుంది. తన పాపకు నెల రోజులుగా బాగా లేదని, హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే రూ.4 లక్షలు అవుతుందని అంటున్నారని చెబుతుంది.
ఏదో ఒక రకంగా తన పాపను రక్షించాలని, మీకు జీవితాంతం ఊడిగం చేస్తానని వేడుకుంటుంది. దీంతో కావ్య ఏదో ఒకటి చేయాలని రాజ్ ను అడుగుతుంది. తాను చూసుకుంటానని, ఒక్క రూపాయి కూడా నువ్వు కట్టాల్సిన అవసరం లేదని రాజ్ ధైర్యం చెప్పి పంపిస్తాడు.
కావ్య ‘దుగ్గిరాల చారిటబుల్ ట్రస్ట్’ ఆలోచన
ఆమె వెళ్లిపోయిన తర్వాత కావ్య ఆలోచనలో పడుతుంది. శాంత మన దగ్గర పని చేస్తుంది కాబట్టి, మన దగ్గర డబ్బు ఉంది కాబట్టి సాయం చేయగలిగాం.. కానీ ప్రపంచంలో ఇలా సాయానికి నోచుకోని వాళ్లు చాలా మందే ఉన్నారని, వాళ్ల కోసం ఏదైనా చేయాలని కావ్య అంటుంది.
ఏం చేద్దామని రాజ్ అడిగితే.. ఓ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేద్దామని చెబుతుంది. ఇంట్లో వాళ్లకు చెప్పి వాళ్ల అభిప్రాయం కూడా తీసుకుందామని రాజ్ అంటాడు. దీంతో దుగ్గిరాల చారిటబుల్ ట్రస్ట్ ఆలోచన పురుడు పోసుకుంటుంది.
ధర్మేంద్రకు నిజం చెప్పి ప్రాధేయపడ్డ రుద్రాణి
ఇటు మంత్రి ధర్మేంద్ర దగ్గరికి మళ్లీ వస్తుంది రుద్రాణి. ఆమెను చూడగానే అతడు ఆవేశంతో ఊగిపోతాడు. అసలు నువ్వు ఎవరు? ఆ కుటుంబంతో నీకు ఉన్న సంబంధం ఏంటి? వాళ్లపై నీకు ఎందుకంత పగ అన్నది తెలుసుకోకుండా నీతో చేతులు కలపడం తాను చేసిన తప్పు అని, తన చెప్పుతో తాను కొట్టుకోవాలని ధర్మేంద్ర అంటాడు.
దీంతో రుద్రాణి అతనికి అసలు నిజం చెబుతుంది. తనకు ఎక్కడ ఆస్తి ఇవ్వాల్సి వస్తుందో అని ఇంట్లో నుంచి వెళ్లగొట్టారని, కానీ ఇప్పుడు తాను చేసిన పనికి తన పిల్లలు కూడా తనను దూరం పెడుతున్నారని, దయచేసి వాళ్లకు తన గురించి నిజం చెప్పొద్దని ప్రాధేయపడుతుంది. అయినా మంత్రి మాత్రం కనికరించకపోవడంతో అతని కాళ్ల మీద పడినంత పని చేస్తుంది.
దీంతో తన దగ్గరికి వచ్చిన అప్పుకి రుద్రాణి గురించి నిజం చెప్పకుండా ధర్మేంద్ర దాస్తాడు. అయితే అప్పు తిరిగి వెళ్తుండగా.. అతని ఇంటి నుంచి రుద్రాణి బయటకు రావడం అప్పు చూస్తుంది. దీంతో రుద్రాణియే ఆ శత్రువు అనే నిజం ఆమెకు తెలిసిపోతుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

E-Paper












