Brahmamudi March 28th Episode: బ్రహ్మముడి.. రాజు ఇంటికి రేఖ.. నిజం తెలుసుకొని షాక్.. ఫ్యామిలీకి దగ్గరవుతున్న స్వరాజ్
Brahmamudi March 28th Episode: బ్రహ్మముడి సీరియల్ మార్చి 28 ఎపిసోడ్ లో రాజు గురించి నిజానిజాలు తెలుసుకోవడానికి ఏకంగా అతని ఇంటికే వెళ్తుంది రేఖ. స్వరాజ్ కు మళ్లీ మళ్లీ పీడకలలు వస్తుండటంతో అతని ఫ్యామిలీకి దగ్గరవుతున్నాడేమో అని పెంచిన తల్లిదండ్రులు ఆందోళన చెందుతారు.
Brahmamudi March 28th Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో ఐశ్వర్యను రేఖ లాగిపెట్టి కొడుతుంది. అందరి ముందూ తన పరువు తీశావని క్లాస్ పీకుతుంది. అటు రాజును చూసి షాక్ తిన్న రేఖ.. అతడు ఎవరో తేల్చే పనిలో భాగంగా ఏకంగా అతని ఇంటికే వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

రాజు గురించి ఆరా తీసిన రేఖ
బ్రహ్మముడి సీరియల్ శనివారం (మార్చి 28) ఎపిసోడ్ నెక్లెస్ దొంగతనం చేసింది ఇందు కాదు ఐశ్వర్య అనే రేఖ తెలుసుకునే సీన్ తో మొదలవుతుంది. ఈ విషయం చెప్పిన స్వాతి.. మరో నెక్లెస్ తన తల్లి భ్రమరాంబ దొంగతనం చేసిందన్న విషయం మాత్రం దాచి పెడుతుంది. నీ గది ముందే అది దొరికిందని రేఖతో అంటుంది. దీంతో భ్రమరాంబ ఊపిరి పీల్చుకుంటుంది.
అప్పుడే అపర్ణ గది నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తుంది. ఆమె రాజును ఎక్కడ చూస్తుందో అని రేఖ కంగారు పడిపోతోంది. వెంటనే భూషణ్ ను పంపించి ఆమెను లోనికి తీసుకెళ్లేలా చేస్తుంది. తర్వాత రాజును పక్కకు తీసుకెళ్లి అతని గురించి ఆరా తీస్తుంది. ఏ బస్తీలో ఉంటారు, ఏం చేస్తారు అని అడగడంతో అతడు రేఖను తిట్టి వెళ్లిపోతాడు.
ఐశ్వర్యకి క్లాస్ పీకిన రేఖ
వాళ్లు వెళ్లగానే ఐశ్వర్యను లాగి పెట్టి కొడుతుంది రేఖ. నీ వల్ల అందరి ముందు తన పరువు పోయిందని, తన పెంపకాన్నే అందరూ అనుమానించేలా చేశావని క్లాస్ పీకుతుంది. నీకు అన్నీ మా అన్న పోలికలే వచ్చాయి.. వాడు కూడా అంతే.. ఎన్ని అవకాశాలు వచ్చినా ఉపయోగించుకోలేదు అని రేఖ అంటుంది. తన తండ్రిని తిట్టినందుకు ఐశ్వర్య కోపంగా రేఖ వైపు చూస్తుంది.
ఇటు స్వాతిని లోనికి తీసుకెళ్లి ఆ నెక్లెస్ రేఖకు ఎందుకు ఇచ్చావ్ అని తల్లి భ్రమరాంబ క్లాస్ పీకుతుంది. ఆమెదే కాబట్టి ఆమెకు ఇచ్చానని స్వాతి అంటుంది. అసలు ఆ నెక్లెస్ అక్కడే దొరికిందా అని భ్రమరాంబ అడుగుతుంది. అది నిజం కాదని అంటుంది. మరి అసలు నిజమేంటని స్వాతి, శేషు కావాలని భ్రమరాంబను ఆటపట్టిస్తారు.
వెంకీకి సినిమా టికెట్లు ఇచ్చిన నందు.. హ్యాండిచ్చిన రోజా
మరోవైపు వెంకీకి సినిమా టికెట్లు తెచ్చి ఇస్తుంది నందు. నువ్వు నాకు సాయం చేశావ్.. నేను నీకు చేశాను ఇక్కడితో చెల్లు అని అతనితో అంటుంది. తన గర్ల్ఫ్రెండ్ రోజాను చూసి వెళ్లు అని ఆమెను ఆపుతాడు. అసలు ఆమెకు నీ మీద ప్రేమ ఉందా, మీది అసలు ప్రేమేనా అని నందు అంటుంది.
దీంతో రోజాను పిలిచి పవన్ కల్యాణ్ సినిమా ఫస్ట్ షో టికెట్లు అడితావు కదా.. తెచ్చాను అని వెంకీ బిల్డప్ ఇస్తాడు. అయితే ఆ టికెట్లు తీసుకొని తాను తన కజిన్ తో కలిసి సినిమాకు వెళ్తానని అనడంతో వెంకీ, నందు షాక్ తింటారు. అది నిన్ను వాడుకుంటోంది అంటూ వెంకీకి చెబుతుంది నందు. అయినా అతడు మాత్రం వినడు.
స్వాతి దగ్గర అసలు ప్లాన్ బయటపెట్టిన ఇందు
ఇటు ఇంట్లో ఇందు దగ్గరికి వచ్చిన స్వాతి ఆకలవుతోంది అన్నం పెట్టమని అడుగుతుంది. ఆమె పెట్టిన తర్వాత కలిపి ఇందుకే తినిపిస్తుంది. నీకు ఆకలి అని నాకు పెడతావేంటని అడిగితే.. ఈ ఇంట్లో నీ పని గురించి తప్ప ఆకలి గురించి ఎవరూ పట్టించుకోరని స్వాతి అంటుంది. దీంతో ఇందు కంటతడి పెడుతుంది.
ఆ తర్వాత టాపిక్ నెక్లెస్ మీదికి మళ్లుతుంది. అసలు కొట్టేసిన వాళ్లు ఇంటికి తెచ్చి ఇవ్వడం ఏంటని స్వాతి అడిగితే తానే వాళ్లు ఇంటికి వచ్చేలా చేశానని ఇందు చెబుతుంది. నెక్లెస్ అమ్మడానికి ప్రయత్నించినప్పుడు రెడ్ హ్యాండెడ్ గా వాళ్లను పట్టుకున్న ఇందు.. రాజు, లక్కీలను భయపెట్టి ఐశ్వర్య ఇంటి అడ్రెస్ ఇచ్చి మరీ ఇంటికి వచ్చేలా చేస్తుంది. అది విన్న స్వాతి నీతో జాగ్రత్తగా ఉండాలంటూ ఇందుతో సరదాగా అంటుంది.
రాజు ఇంటికి రేఖ
అటు రాజుకు పదే పదే ఆ బస్సు బాంబు పేలుడు గురించి పీడకలలు వస్తూనే ఉంటాయి. దీంతో అతని ఇంట్లో వాళ్లు రాజు కోసం వెతుకుతున్నారేమో అని, వాళ్లకు అతడు క్రమంగా దగ్గరవుతున్నాడేమో అని అతని పెంచిన తల్లిదండ్రులు అనుకుంటారు. అదే సమయంలో రాజు గురించి నిజం తెలుసుకోవడానికి అతని ఇంటి దగ్గరికి వస్తుంది రేఖ.
తన మనిషిని లోనికి పంపించి జనాభా లెక్కలు అంటూ వాళ్ల వివరాలు సేకరిస్తుంది. తన పేరు చలపతి అని రాజు తండ్రి చెబుతుంది. అతడు మీ అబ్బాయా అని అడిగితే.. కాదు దొరికితే తీసుకొచ్చామని అతడు అనడంతో రాజుతోపాటు రేఖ కూడా షాక్ తింటారు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


