బ్రహ్మముడి మే 20 ఎపిసోడ్: లక్కీ పేరు చెప్పి రేఖను బ్లాక్‌మెయిల్ చేసిన ఆంటోనీ.. నిజం దాచిన శృతి.. రాజుకి రాజభోగాలు

బ్రహ్మముడి మే 20 ఎపిసోడ్: బ్రహ్మముడి సీరియల్ మే 20 ఎపిసోడ్ లో కొడుకు లక్కీ పేరు చెప్పి రేఖను బ్లాక్‌మెయిల్ చేస్తాడు ఆంటోనీ. అటు రాజు, ఇందు ఆఫీసులో ఉద్యోగుల సమస్యలు తీరుస్తామని హామీ ఇస్తారు. ఇటు ఇంట్లోనూ రాజు రాజభోగాలు అనుభవిస్తాడు.

Published on: May 20, 2026, 08:21:18 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్రహ్మముడి మే 20 ఎపిసోడ్: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో రేఖకు ఆంటోనీ రూపంలో మరో ముప్పు పొంచి ఉంటుంది. తల్లి జాడ కోసం పరి తపిస్తున్న లక్కీని, రేఖను కలవకుండా ఆంటోనీ మధ్యలో ఆడుకుంటాడు. మరోవైపు రాజును మచ్చిక చేసుకోవడానికి రేఖ అతనికి ఇంట్లో రాజభోగాలు ఏర్పాటు చేస్తుంది.

బ్రహ్మముడి మే 20 ఎపిసోడ్: లక్కీ పేరు చెప్పి రేఖను బ్లాక్‌మెయిల్ చేసిన ఆంటోనీ.. నిజం దాచిన శృతి.. రాజుకి రాజభోగాలు
బ్రహ్మముడి మే 20 ఎపిసోడ్: లక్కీ పేరు చెప్పి రేఖను బ్లాక్‌మెయిల్ చేసిన ఆంటోనీ.. నిజం దాచిన శృతి.. రాజుకి రాజభోగాలు

భ్రమరాంబ కారు తీసుకొని వెళ్లిన రాజు, ఇందు

బ్రహ్మముడి సీరియల్ బుధవారం (మే 20) ఎపిసోడ్ భ్రమరాంబను రాజు మాటలతో బోల్తా కొట్టించి ఆమె కారు తాళాలు సంపాదించే సీన్ తో మొదలవుతుంది. ఆ తర్వాత ఇందుని తీసుకొని అదే కారులో ఆఫీసుకు బయలుదేరుతాడు. తన కారు పోవడంతో భ్రమరాంబ ఉసూరుమంటుంది. వాడు దొంగలనే మించిన దొంగలా ఉన్నాడు.. రేఖను కూడా ఇలాగే బోల్తా కొట్టిస్తాడని శేషు అంటాడు.

మురిసిపోయిన అపర్ణ, సుభాష్

అటు రాజు, ఇందు ఆఫీసుకు వెళ్లడం చూసి అపర్ణ, సుభాష్ మురిసిపోతారు. వాళ్లను చూస్తుంటే రాజ్, కావ్య గుర్తొస్తున్నారని, రాజు దగ్గరికి వచ్చినప్పుడల్లా రాజ్ ఉన్నట్లు అనిపిస్తోందని అపర్ణ అంటుంది. సుభాష్ కూడా అదే అంటాడు. మన దగ్గర నుంచి ఒకటి తీసుకునే దేవుడు.. దానిని మరో రూపంలో ఇస్తాడంటే ఇదేనేమో అని వాళ్లు అనుకుంటారు. ఇప్పటికైనా ఇందుకి మంచి సపోర్ట్ దొరికిందని సంబరపడతారు.

ఉద్యోగుల తిరుగుబాటు.. బెదిరింపులకు దిగిన రేఖ

మరోవైపు ఆఫీసులో జీతాల కోసం ఉద్యోగులు తిరుగుబాటు చేస్తారు. చేయాల్సిన పని పక్కన పెట్టి పెన్ డౌన్ చేస్తారు. ఇదే విషయం రేఖకు చెబుతుంది శృతి. దీంతో ఉద్యోగులందరినీ ఒక్కచోటికి చేర్చి రేఖ బెదిరింపులకు దిగుతుంది. ఇన్నేళ్లు సరిగ్గానే ఇచ్చాం కదా.. ఒక్క నెల ఆలస్యమైతే పని చేయరా.. అయినా మీకు నేను తప్ప వేరే దిక్కు లేదు.. మిమ్మల్ని బ్లాక్ లిస్టులో పెడితే ఎవరూ ఉద్యోగం కూడా ఇవ్వరు అని బెదిరిస్తుంది.

ఉద్యోగులకు అండగా రాజు.. రేఖకు షాక్

అప్పుడే మీకు నేను ఉన్నానంటూ ఇందుతో కలిసి ఎంట్రీ ఇస్తాడు రాజు. వాళ్లను చూసి రేఖ షాక్ తింటుంది. వీడిని ఎందుకు తీసుకొచ్చావని ఇందుని అడిగితే.. అలా చేయకపోతే అందరికీ నిజం చెప్పేస్తానని బెదిరించాడని అంటుంది. శృతి కూడా రాజుని చూసి షాక్ తింటుంది. ఆ తర్వాత రాజు వచ్చి ఉద్యోగులకు ధైర్యం చెబుతాడు. మీ జీతాలను తాను క్లియర్ చేస్తానని అంటాడు. రేఖ అడ్డుపడుతున్నా వినడు. దీంతో ఇతని దగ్గరే మీ జీతాలు తీసుకోండని చెప్పి రేఖ వెళ్లిపోతుంది.

ఉద్యోగులకు హామీ ఇచ్చిన ఇందు

ఆ తర్వాత ఉద్యోగుల సమస్యలేంటో ఇందు తెలుసుకుంటుంది. జీతాలే కాదు చాలా సమస్యలే ఉన్నాయని అర్థమవుతుంది. మా అమ్మానాన్న ఉన్నప్పుడు మిమ్మల్ని ఎలా చూసుకున్నారో అలా చూసుకుంటామని, కాస్త టైమ్ ఇవ్వాలని వాళ్లను ఇందు కోరుతుంది. ఇందు, రాజు ఇచ్చిన హామీతో ఉద్యోగులు దిగి వస్తారు. పని మొదలుపెడతారు.

రాజు గురించి నిజం దాచిన శృతి

ఆ తర్వాత రాజు గురించి ఇందుని శృతి అడుగుతుంది. అతడు తన భర్త అని చెప్పడంతో కంగు తింటుంది. ఇందు వెళ్లిపోయిన తర్వాత కంపెనీ టర్నోవర్ ఎంత అని శృతిని రాజు అడుగుతాడు. ఒకప్పుడు రూ.200 కోట్లు ఉండేదని, ఇప్పుడు బాగా తగ్గిపోయిందని చెప్పడంతో రాజు షాక్ తింటాడు. అతడు వెళ్లిపోయిన తర్వాత రాజు దుగ్గిరాల వారసుడు అన్న నిజం తెలిస్తే రేఖతో ప్రమాదం అని, అందుకే నిజం చెప్పను అని శృతి మనసులో అనుకుంటుంది.

రేఖ దగ్గరికి వచ్చిన ఆంటోనీ.. కొడుకు పేరు చెప్పి బ్లాక్‌మెయిల్

అప్పుడే రేఖను వెతుక్కుంటూ ఆఫీసుకు వస్తాడు ఆంటోనీ. శృతికి రేఖ పాత ఫొటో చూపించి ఆమెను పిలవాలని అంటాడు. దీంతో రేఖకు ఆమె ఫోన్ చేస్తుంది. ఆంటోనీని చూడగానే రేఖ షాక్ తింటుంది. శృతిలోనూ అనుమానం కలుగుతుంది. తర్వాత అతన్ని పక్కకు తీసుకెళ్లి మాట్లాడుతుంది రేఖ. కొడుకు పేరు చెప్పి బ్లాక్‌మెయిల్ చేస్తాడు. మా అమ్మ ఎక్కడ అని అతడు అడుగుతున్నాడని, ఇంకా నిజం చెప్పలేదని, అది దాచాలంటే నెలకు రూ.లక్ష ఇవ్వాలని ఆంటోనీ డిమాండ్ చేస్తాడు. వేరే దారి లేక రేఖ సరే అంటుంది.

ఆంటోనీకి లక్కీ ఫోన్

ఆమె వెళ్లిపోయిన తర్వాత ఆంటోనీకి లక్కీ ఫోన్ చేస్తాడు. తన కోసం రూమ్ అరేంజ్ చేశానని అంటాడు. మా అమ్మ గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతాడు. ఇప్పటి వరకూ చాలా తక్కువే తెలిసిందని, మొత్తం తెలుసుకుంటానని ఆంటోనీ నిజం దాస్తాడు.

మరోవైపు ఇంట్లో తనకు, ఇందుకి మంచి కింగ్ సైజ్ బెడ్, ఏసీ ఉన్న రూమ్ కావాలని రాజు డిమాండ్ చేస్తాడు. అతని సంతకం కోసం మచ్చిక చేసుకోవాలనుకునే రేఖ సరే అంటూ ఐశ్వర్య రూమ్ ఇస్తుంది. దీంతో రాజు అక్కడ రాజభోగాలు అనుభవిస్తాడు. తన పేమెంట్, ఉద్యోగుల పేమెంట్ సంగతి ఆలోచించమని ఇందుతో రాజు అనడంతో ఆమె ఆలోచనలో పడుతుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More