బ్రహ్మముడి ఫిబ్రవరి 3 ఎపిసోడ్: ధర్మేంద్ర భార్యను కిడ్నాప్ చేసిన రాజ్.. ఆరు శవాలు లేచి ఉండేవంటూ.. తులసికి తెలిసిన నిజం!
బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (ఫిబ్రవరి 3) ఎపిసోడ్ ట్విస్టుల మీద ట్విస్టులో సాగిపోయింది. రాజ్, ధర్మేంద్ర ఒకరి ఇంటికి మరొకరు వెళ్లి వార్నింగ్ ఇచ్చుకుంటారు. ఇంట్లో వాళ్లకు మంత్రి యాక్సిడెంట్ చేయాలని చూస్తే.. మంత్రి భార్యను రాజ్ కిడ్నాప్ చేస్తాడు.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 946వ ఎపిసోడ్ రక్తికట్టించింది. రాజ్, మంత్రి ధర్మేంద్ర మధ్య ఫైట్ పర్సనల్గా మారి ఇంట్లో వాళ్లను ప్రమాదంలో పడేసింది. ఇటు మంత్రి భార్య తులసికి నిజం చెప్పించడానికి ఆమెను కిడ్నాప్ చేస్తాడు రాజ్. దీంతో ఈ సీరియల్ లో కీలకమైన ట్విస్ట్ వచ్చింది.

మంత్రికి రాజ్ గట్టి వార్నింగ్
బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (ఫిబ్రవరి 3) ఎపిసోడ్ మంత్రి ఇంటికి వెళ్లి అతనికే రాజ్, కావ్య వార్నింగ్ ఇచ్చే సీన్ తో మొదలైంది. తన పాపను కాసేపు ఎత్తుకొని ఎమోషనల్ అవుతుంది కావ్య. ఆ తర్వాత తులసి వెళ్లిపోతుంది. అప్పుడే ధర్మేంద్రకు రాజ్ వార్నింగ్ ఇస్తాడు. నా భార్య నీకు 15 రోజుల టైమ్ ఇచ్చింది.. ఆ లోపు నువ్వు తప్పు ఒప్పుకొని బిడ్డను తిరిగి ఇవ్వాల్సిందే.. లేదంటే ఏం జరుగుతుందో నీకూ తెలుసు అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు.
పాప బారసాలకు ఇంట్లో వాళ్ల ప్లాన్.. వద్దని వారించిన రాజ్
ఇటు దుగ్గిరాల ఇంట్లో పాప బారసాల కోసం ప్లాన్ చేస్తుంటారు. అప్పుడే రాజ్, కావ్య ఇంటికి తిరిగి వస్తారు. వాళ్లకు ఆ విషయం చెప్పడంతో పాప ఇప్పుడున్న పరిస్థితిలో అవసరం లేదని రాజ్ అంటాడు. పాపకు సర్జరీ చేసిన తర్వాత సెట్ అవుతుంది.. అప్పటికి అప్పుకి కూడా నెలలు నిండి బిడ్డను కంటుంది.. ఇద్దరికీ ఒకేసారి బారసాల చేద్దామని కావ్య అంటుంది. దీంతో అందరూ సరే అంటారు.
ధర్మేంద్రను రెచ్చగొట్టిన రుద్రాణి
మరోవైపు ధర్మేంద్రను రుద్రాణి రెచ్చగొడుతుంది. వాళ్లకు నా ముందు నిలబడే ధైర్యం లేదు.. అందుకే నా భార్య జోలికి వచ్చారు అని ధర్మేంద్ర ఆవేశంతో రగిలిపోతాడు. అతనికి కూడా ఫ్యామిలీ ఉంది.. నువ్వు కూడా అదే రూట్లో వెళ్లు అని మంత్రిని రుద్రాణి మరింత రెచ్చగొడుతుంది. దీంతో రాజ్, కావ్య తన దగ్గరికి రావాలంటేనే భయపడేలా చేస్తానని ధర్మేంద్ర అంటాడు.
రాజ్కు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చిన మంత్రి
ఇంట్లో కాఫీ తాగుతూ కూర్చున్న రాజ్కు మంత్రి ధర్మేంద్ర ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తాడు. ఇంట్లో వాళ్లు ఎక్కడున్నావో చూసుకోవా అని అంటాడు. ముందు మీ నాన్నమ్మ, తాతయ్య ఎక్కడున్నారో చూడు.. వాళ్లకు ఏదైనా జరిగితే ఎలా అని అడుగుతాడు. దీంతో వెంటనే రాజ్.. ఇందిర, సీతారామయ్యలకు ఫోన్ చేస్తాడు. వాళ్లతో మాట్లాడుతుండగానే ఏదో ప్రమాదం జరిగినట్లుగా రాజ్ కు అనిపిస్తుంది.
ఆ తర్వాత ధర్మేంద్ర మరోసారి ఫోన్ చేసి ఈసారి నీ తల్లిదండ్రులు ఎక్కడు, నీ తమ్ముడు ఎక్కడ అంటూ మళ్లీ భయపెడతాడు. సుభాష్ కు ఫోన్ చేసిన మాట్లాడుతుండగానే వాళ్లకూ ఏదో ప్రమాదం జరిగినట్లుగా అనిపిస్తుంది. కల్యాణ్, అప్పులకు మాత్రం ఫోన్ చేయలేకపోతాడు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక కావ్య, ప్రకాశం టెన్షన్ పడుతుంటారు.
సేఫ్గా తిరిగి వచ్చిన ఇంట్లో వాళ్లు
అయితే చివరికి ఇంట్లో వాళ్లందరూ సేఫ్ గా తిరిగి వస్తారు. మొదట ఇందిరా దేవి, సీతారామయ్య.. తర్వాత సుభాష్, అపర్ణ.. చివరికి కల్యాణ్, అప్పు వస్తారు. ముగ్గురూ తమకు తృటిలో ప్రమాదం తప్పిందని చెబుతారు. దీంతో ఇది ప్రమాదం కాదు.. ఇంకేదో జరుగుతోందని ధాన్యలక్ష్మి అనుమానం వ్యక్తం చేస్తుంది. అప్పుడే మంత్రి ఎంట్రీ ఇస్తాడు.
నీ అనుమానం కరెక్టే అంటూ ధర్మేంద్ర వస్తాడు. తనను తాను పరిచయం చేసుకుంటాడు. ఈ ఇంట్లో ఇవాళ ఆరు శవాలు లేచేవే అని వార్నింగ్ ఇస్తాడు. మీ రాజ్, కావ్యకు అసలు ఏం జరిగిందో తెలుసు అని, తన జోలికి రావద్దని అంటాడు. దీంతో రాజ్ ఆవేశంతో రగిలిపోతాడు.
దెబ్బకు దెబ్బ తీయాలనుకొని మంత్రి భార్య తులసిని కిడ్నాప్ చేస్తాడు. ధర్మేంద్రకు ఫోన్ చేసి నీ భార్య కనిపించడం లేదా.. నువ్వు దాచిపెట్టిన డాక్టర్ చక్రవర్తి దగ్గరికే ఆమెను తీసుకెళ్తున్నాను.. అసలు నిజం అతనితోనే చెప్పిస్తానని వార్నింగ్ ఇస్తాడు. దీంతో ధర్మేంద్రలో ఆందోళన మొదలవుతుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


