బ్రహ్మముడి జనవరి 7 ఎపిసోడ్: రాజ్ను అరెస్ట్ చేసిన పోలీసులు.. గట్టి దెబ్బే కొట్టిన రుద్రాణి, రాహుల్.. కావ్యకు ప్రమాదం
బ్రహ్మముడి బుధవారం (జనవరి 7) ఎపిసోడ్ లో రుద్రాణిని మెడపట్టి బయటకు గెంటేస్తుంది ఇందిరాదేవి. ఆ అవమానాన్ని మరచిపోని ఆమె.. కొడుకు, కూతురితో కొత్త కుట్రకు తెరలేపుతుంది. రాహుల్, రేఖ కలిసి దుగ్గిరాల కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేయడానికి కంకణం కట్టుకుంటారు.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 924వ ఎపిసోడ్ ఎంతో ఉత్కంఠగా సాగింది. రుద్రాణి కుట్రను భరించలేని ఇంట్లో వాళ్లు ఆమెను నానా మాటలు అంటారు. చివరికి ఇందిరా దేవి ఆమెను మెడపట్టి బయటకు గెంటేస్తుంది. కానీ ఆ సమయానికి నాటకమాడి ఆ ఇంట్లోనే ఉండిపోతారు రాహుల్, రేఖ. వాళ్ల కుట్రకు రాజ్ బలవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

రుద్రాణిని నిలదీసిన ఇంట్లో వాళ్లు
బ్రహ్మముడి సీరియల్ బుధవారం (జనవరి 7) ఎపిసోడ్ రుద్రాణి కుట్రను కనకం బయటపెట్టే సీన్ తో మొదలవుతుంది. ఆమె తీసుకొచ్చిన వీరయ్యను సుభాష్ నాలుగు పీకడంతో అతడు నిజం చెబుతాడు. రుద్రాణియే ఇదంతా చేసిందని అంటాడు. దీంతో నువ్వు మనిషివేనా అంటూ ఆమెపై మండిపడతాడు సుభాష్. అటు అపర్ణ, ఇందిర, కావ్య, రాజ్ కూడా రుద్రాణిని నానా మాటలు అంటారు. ఈ ఇంటి మనిషివి కాకపోయినా.. నా బావ అడిగినందుకు నిన్ను ఇంటి ఆడపడచులా చేసుకున్నామని, ఇంతటి దారుణానికి తెగిస్తావా అంటూ ఇందిరా దేవి ఆమెను తిడుతుంది.
తల్లిని అసహ్యించుకున్న రాహుల్, రేఖ
చివరికి రాహుల్, రేఖ కూడా కన్నతల్లిని అసహ్యించుకుంటారు. తనను పూర్తిగా చెడు ఆలోచనలతో పాడు చేసినా రాజ్, కావ్య తనను మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తే నువ్వు ఇలా చేస్తావా అంటూ తల్లిని నిలదీస్తాడు రాహుల్. అటు రేఖ కూడా నిన్ను అమ్మ అని పిలవాలంటే అసహ్యమేస్తోందని అంటుంది. దీంతో రుద్రాణి ఒంటరిదవుతుంది.
రుద్రాణిని మెడపట్టి గెంటేసిన ఇందిర
ఇంట్లో వాళ్లందరూ ఆమెను నిందిస్తుంటారు. రాజ్, కావ్య కూడా రుద్రాణిని ఎందుకిలా చేశావంటూ నిలదీస్తుండగా.. ఇందిరాదేవి ఆమెను ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని అంటుంది. ఆమె వినకపోవడంతో మెడపట్టి బయటకు గెంటేయడానికి ప్రయత్నిస్తుంది. ఆ సమయంలో రాహుల్ అంటూ కొడుకు వైపు రుద్రాణి చూసినా.. తానేమీ చేయలేనని అతడు అంటాడు. దీంతో ఇందిర ఆమెను బయటకు గెంటేస్తుంది. మళ్లీ ఇటు వైపు వచ్చావంటే తగలబెట్టేస్తానని వార్నింగ్ ఇస్తుంది.
ఇదంతా జరగడం చూసి కావ్య కళ్లు తిరిగి పడిపోతుంది. దీంతో ఇంట్లో వాళ్లు ఆందోళన చెందుతారు. డాక్టర్ వచ్చి ఆమెను చూస్తుంది. అంతా బాగానే ఉందని, కావ్య వాడుతున్న ఆయుర్వేద కషాయం ఆ పసరు మందు పని చేయకుండా చేసిందని చెప్పడం అందరూ ఊపిరి పీల్చుకుంటారు. కావ్యకు మరేమీ ప్రమాదం లేదని ఆమె చెబుతుంది.
రాహుల్ని నిందించిన ధాన్యం.. గొడవకు దిగిన స్వప్న
రుద్రాణి చేసిన పనికి రాహుల్ ను కూడా నిందిస్తుంది ధాన్యలక్ష్మి. నీకు తెలియకుండానే ఇదంతా జరుగుతుందా అని నిలదీస్తుంది. దీంతో స్వప్న గొడవకు దిగుతుంది. రాహుల్ మారిపోయినా ఎందుకు అతన్ని నమ్మడం లేదు.. ఈ ఇంట్లో ఏం జరిగినా అతన్ని ఎందుకు నిలదీస్తున్నారు అని ధాన్యంతో గొడవపడుతుంది. తల్లి కనకం వద్దని వారిస్తున్నా వినదు. దీంతో ఇందిరా దేవి ఆమెకు సర్దిచెబుతుంది. అతని గతం అలాంటిది కావడంతో అతన్ని నమ్మడం లేదని అంటుంది. దీంతో రాహుల్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
ఆ కుటుంబాన్ని వదిలిపెట్టమని రాహుల్, రేఖ ప్రతిజ్ఞ
ఇటు తల్లి దగ్గరికి వెళ్తారు రాహుల్, రేఖ. ఆ సమయంలో తాము అలా మాట్లాడినందుకు క్షమించమని అడుగుతారు. మీరు చేసింది కరెక్టే అని, మీరు అక్కడే ఉండి ఆ ఇంటిని పూర్తిగా నాశనం చేయాలని చెబుతుంది రుద్రాణి. ఇక నుంచి తాను అదే పనిలో ఉంటానని, ఉదయంలోగా రాజ్ ను అరెస్ట్ చేయిస్తానని రాహుల్ చెబుతాడు. ఆ కావ్య జీవితాన్ని నాశనం చేస్తానని రేఖ ప్రతిజ్ఞ చేస్తుంది.
మరుసటి రోజే రాజ్ ను అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తారు. దొంగ బంగారం నీకే అమ్మానని ఈ వ్యక్తి చెప్పాడని సాండీని తీసుకొస్తారు. ఇంట్లో సోదాలు చేయగా ఓ సూట్ కేసులో బంగారం బయటపడుతుంది. దీంతో పోలీసులు రాజ్ ను అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. అది చూసి కావ్య విలవిల్లాడిపోతుంది. తన కడుపులో బిడ్డను పట్టుకొని నొప్పితో సతమతమవుతూ కుప్పకూలుతుంది.














