Chinmayi: సినిమాల్లోలాగే బయట కూడా వాళ్లు మంచోళ్లు అనుకున్నా.. వాళ్లను నిలదీసే హక్కు నాకుంది: కమల్, రజనీలపై చిన్మయి

Chinmayi: రజనీకాంత్, కమల్ హాసన్ లపై తాను చేసిన ట్వీట్స్ ను సమర్థించుకుంది సింగర్ చిన్మయి శ్రీపాద. వాళ్లకు తాను కూడా అభిమానినే అని, అయితే వాళ్లు తప్పు చేస్తే నిలదీసే హక్కు తనకుందని చెప్పింది. వైరముత్తును వాళ్లు పొగడటంపై చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

Published on: Mar 16, 2026, 09:14:11 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రముఖ సినీ గీత రచయిత వైరముత్తుకు దేశ అత్యున్నత సాహిత్య పురస్కారం 'జ్ఞానపీఠ్' (Jnanpith Award) దక్కడం ఇప్పుడు తమిళనాడులో పెద్ద చర్చకు దారితీసింది. అకిలన్ (1975), జయకాంతన్ (2002) తర్వాత ఈ గౌరవం పొందిన మూడవ తమిళ రచయితగా వైరముత్తు నిలిచాడు. అయితే ఆయనను అభినందిస్తూ సూపర్ స్టార్ రజనీకాంత్, ఉలగనాయగన్ కమల్ హాసన్ చేసిన సోషల్ మీడియా పోస్టులపై సింగర్ చిన్మయి శ్రీపాద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై సదరు హీరోల అభిమానుల నుండి ఆమెకు తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ ఎదురవ్వగా, చిన్మయి వారికి అంతే దీటుగా సమాధానమిచ్చింది.

Chinmayi: సినిమాల్లోలాగే బయట కూడా వాళ్లు మంచోళ్లు అనుకున్నా.. వాళ్లను నిలదీసే హక్కు నాకుంది: కమల్, రజనీలపై చిన్మయి
Chinmayi: సినిమాల్లోలాగే బయట కూడా వాళ్లు మంచోళ్లు అనుకున్నా.. వాళ్లను నిలదీసే హక్కు నాకుంది: కమల్, రజనీలపై చిన్మయి

'నా హీరోలు ఇంతేనా?' - చిన్మయి ఆవేదన

మీటూ (MeToo) ఉద్యమ సమయంలో వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళల్లో చిన్మయి ఒకరు. వైరముత్తును కమల్, రజనీలు అభినందించడంపై స్పందిస్తూ చిన్మయి ఎక్స్ వేదికగా ఒక సుదీర్ఘమైన నోట్‌ను షేర్ చేసింది.

"నేను కూడా రజనీ సర్, కమల్ సర్ అభిమానినే. కానీ సరైన నిర్ణయాలు తీసుకుంటారని నేను పిచ్చిగా నమ్మిన వ్యక్తులు ఇలా వ్యవహరించడం చూసి నిరాశ చెందే హక్కు నాకు ఉంది. సినిమాల్లో నీతి గురించి పవర్ ఫుల్ డైలాగులు చెప్పే వారు, నిజ జీవితంలో ఒక లైంగిక వేధింపుల ఆరోపితుడిని సమర్థిస్తుంటే ఎలా ఊరుకోవాలి?" అని ఆమె ప్రశ్నించింది.

వీరిలో ఒకరు ఎంపీగా, మరొకరు రాజకీయ నాయకుడిగా ఉండి మహిళా రక్షణ గురించి ఉపన్యాసాలు ఇస్తూ, మరోవైపు వేధింపులకు గురైన 17 మంది మహిళల ఆవేదనను పట్టించుకోకపోవడం దారుణమని ఆమె మండిపడింది.

పరిశ్రమలో భద్రత ఎక్కడ?

తమిళ చిత్ర పరిశ్రమలో మహిళల రక్షణ కోసం విశాఖ గైడ్ లైన్స్ (Vishakha Guidelines) ప్రకారం అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ICC) ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేసింది.

"2019 నుండి ఏఆర్ రెహమాన్ సర్ కు చెందిన కేఎమ్ కన్జర్వేటరీలో మాత్రమే పని చేసే ఐసీసీ ఉంది. డబ్బింగ్ యూనియన్ లో వేధింపులపై గళమెత్తిన మహిళను పని చేయకుండా బ్యాన్ చేశారు. ఆమె 5 ఏళ్ల తర్వాత న్యాయం పొందింది. ఇవన్నీ ఈ లెజెండ్స్ కి అర్థం కావా?" అని నిలదీసింది.

చిన్మయి చేసిన ప్రధాన విమర్శలు

రజనీకాంత్‌ పై చిన్మయి మండిపడింది. వైరముత్తును 'ప్రియ మిత్రుడు' అని సంబోధిస్తూ రజనీ చేసిన ట్వీట్ పై "అయ్యయ్యో.. అర్థమే కావట్లేదు" అని ఎద్దేవా చేసింది.

కమల్ హాసన్‌ గురించి కూడా ఆమె స్పందించింది. వైరముత్తును 'కవి చక్రవర్తి' అని పొగిడిన కమల్ పై స్పందిస్తూ.. "రాజకీయాల్లోకి వచ్చి మహిళా రక్షణ గురించి మాట్లాడే మీరు, మీ పార్టీలోని మహిళే బహిరంగంగా వైరముత్తు పేరును చెప్పినా పట్టించుకోరా? చివరికి పురుషులు తమ బ్రోస్, అంకుల్స్ వెంటే నిలబడతారని దీనివల్ల అర్థమవుతోంది" అని ఘాటుగా విమర్శించింది.

ట్రోలర్లకు హెచ్చరిక

తనను ట్రోల్ చేస్తున్న వారికి సమాధానమిస్తూ.. "మీరందరూ కలిసి నేరస్థులను కాపాడుతున్నారు కాబట్టే తమిళనాడులో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. కాలమే మీకు గొప్ప గుణపాఠం చెబుతుంది. ఆ పాఠాలు చాలా కఠినంగా ఉంటాయి" అని హెచ్చరించింది. ఈ మొత్తం వివాదంపై కమల్ హాసన్ లేదా రజనీకాంత్ ఇప్పటివరకు స్పందించలేదు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More