Dacoit Premier Shows: డెకాయిట్ ప్రీమియర్ షోలకు నో.. ధురంధర్ ఫేమ్ రాకేష్ బేడీ నుంచి టికెట్లు దొంగిలించిన అడివి శేష్

Dacoit Premier Shows: డెకాయిట్ మూవీ మేకర్స్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమా ప్రీమియర్ షోలు లేవని, తొలి షో ఏప్రిల్ 10న ఉదయం 8 గంటలకే ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు తన మూవీ టికెట్లనే అడివి శేష్ దొంగిలించిన వీడియో వైరల్ అవుతోంది.

Published on: Apr 8, 2026, 21:32:28 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Dacoit Premier Shows: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ నుంచి సినిమా వస్తోందంటే ప్రేక్షకుల్లో ఒక రకమైన ఆసక్తి ఉంటుంది. వైవిధ్యమైన కథాంశాలతో వరుస విజయాలు అందుకుంటున్న శేష్.. ఈసారి ‘డెకాయిట్’ (Dacoit) అనే రొమాంటిక్ యాక్షన్ డ్రామాతో మన ముందుకు వస్తున్నాడు.

Dacoit Premier Shows: డెకాయిట్ ప్రీమియర్ షోలకు నో.. ధురంధర్ ఫేమ్ రాకేష్ బేడీ నుంచి టికెట్లు దొంగిలించిన అడివి శేష్
Dacoit Premier Shows: డెకాయిట్ ప్రీమియర్ షోలకు నో.. ధురంధర్ ఫేమ్ రాకేష్ బేడీ నుంచి టికెట్లు దొంగిలించిన అడివి శేష్

మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా ఈ శుక్రవారం (ఏప్రిల్ 10) థియేటర్లలో సందడి చేయనుంది. అయితే భారీ హైప్ ఉన్న ఈ మూవీకి ప్రీమియర్ షోలు వేయకూడదని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్ణయం తీసుకోవడం విశేషం. రిలీజ్ రోజు ఉదయం 8 గంటల నుంచే షోలు ప్రారంభం కానున్నాయి.

ప్రయోగానికి స్వస్తి.. నేరుగా ఉదయం ఆటలే

సాధారణంగా ఈ మధ్య కాలంలో క్రేజ్ ఉన్న సినిమాలన్నీ విడుదల రోజు కంటే ముందే ‘పెయిడ్ ప్రీమియర్లు’ (Paid Premieres) వేసి పాజిటివ్ టాక్ తెచ్చుకోవాలని చూస్తుంటాయి. అయితే 'డెకాయిట్' టీమ్ మాత్రం ఇందుకు భిన్నమైన నిర్ణయం తీసుకుంది.

దేశవ్యాప్తంగా ఎక్కడా పెయిడ్ ప్రీమియర్లు ప్రదర్శించడం లేదని, నేరుగా శుక్రవారం ఉదయం 8 గంటల నుంచే షోలు ప్రారంభమవుతాయని అడివి శేష్ స్వయంగా వెల్లడించాడు. మేకర్స్ తీసుకున్న ఈ నిర్ణయం సినీ ప్రియులను కాస్త ఆశ్చర్యపరిచినప్పటికీ, సినిమా కంటెంట్‌పై ఉన్న నమ్మకంతోనే నేరుగా బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.

టికెట్లు దొంగిలించిన అడివి శేష్

మరోవైపు డెకాయిట్ మూవీ ప్రమోషన్లను కూడా మేకర్స్ కొత్తగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్ ఓ వీడియోను రిలీజ్ చేసింది. అందులో డెకాయిట్ మూవీ టికెట్ల కోసం బాక్సాఫీస్ దగ్గర మిగిలిన ప్రేక్షకులతో అడివి శేష్ నిల్చొంటాడు.

లోపల ధురంధర్ మూవీ ఫేమ్ రాకేష్ బేడీ టికెట్లు అమ్ముతుంటాడు. ఇంతలో అనురాగ్ కశ్యప్, సునీల్ లాంటి వాళ్లు ఫోన్లు చేసి టికెట్లు అడుగుతారు. కానీ అది కుదరదని అతడు తేల్చి చెబుతాడు. తర్వాత టికెట్ కౌంటర్ దగ్గర ఉన్న అడివి శేష్ డెకాయిట్ మూవీ టికెట్లు కావాలని అడుగుతాడు. ఆ టికెట్లు చేతిలో పడగానే డబ్బులు ఇవ్వకుండా అక్కడి నుంచి పారిపోతాడు. ఈ ఫన్నీ వీడియో వైరల్ అవుతోంది.

షానీల్ డియో దర్శకత్వంలో సరికొత్త కథ

ఈ డెకాయిట్ మూవీతో షానీల్ డియో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అడివి శేష్ గత చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన అనుభవం ఉన్న షానీల్.. ఈ రొమాంటిక్ యాక్షన్ కథను చాలా స్టైలిష్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

ఇక మృణాల్ ఠాకూర్, శేష్ మధ్య కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. 'సీతారామం', 'హాయ్ నాన్న' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న మృణాల్, ఈ సినిమాలో మరో పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతోంది.

నిర్మాణ విలువలలో రాజీ లేకుండా..

అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో పాటలు అందించగా, జ్ఞాని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. శేష్ మార్కు యాక్షన్ ప్లస్ ఎమోషన్స్ కలగలిసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. డెకాయిట్ సినిమాలో అడివి శేష్ సరసన ఎవరు నటిస్తున్నారు?

ఈ సినిమాలో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

2. డెకాయిట్ సినిమా ప్రీమియర్ షోలు ఎప్పుడు ఉండబోతున్నాయి?

చిత్ర యూనిట్ నిర్ణయం ప్రకారం ఇండియాలో పెయిడ్ ప్రీమియర్లు ఉండవు. నేరుగా శుక్రవారం ఉదయం 8 గంటలకు షోలు ప్రారంభమవుతాయి.

3. ఈ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరు?

ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో పాటలు సమకూర్చగా, జ్ఞాని నేపథ్య సంగీతం (BGM) అందించారు.

4. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నది ఎవరు?

సినిమాటోగ్రాఫర్ షానీల్ డియో ఈ చిత్రంతో మెగాఫోన్ పట్టి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More