నాగార్జునకూ ముందే పేమెంట్ చేశాం.. నీవల్లే సినిమా ఆగిపోయింది.. రూ.20 కోట్లు ఇవ్వు: ధనుష్‌ను డిమాండ్ చేస్తున్న ప్రొడ్యూసర్

తమిళ స్టార్ హీరో ధనుష్ న్యాయపరమైన చిక్కుల్లో పడ్డాడు. దాదాపు పదేళ్ల కిందట ఒప్పుకున్న ఒక ప్రాజెక్ట్‌ను పూర్తి చేయలేదనే కారణంతో ప్రముఖ నిర్మాణ సంస్థ 'తేనాండల్ ఫిల్మ్స్' అతనికి లీగల్ నోటీసులు పంపింది. రూ. 20 కోట్లు పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.

Published on: Feb 14, 2026 10:49 AM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కోలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితుడైన స్టార్ హీరో ధనుష్ తాజాగా ఒక భారీ వివాదంలో చిక్కుకున్నాడు. సినిమా షూటింగ్ ఆలస్యం కారణంగా తలెత్తిన ఆర్థిక నష్టాలకు బాధ్యత వహిస్తూ పరిహారం చెల్లించాలంటూ తేనాండల్ ఫిల్మ్స్ అనే నిర్మాణ సంస్థ అతనికి లీగల్ నోటీసులు జారీ చేసినట్లు 'వన్ ఇండియా తమిళ్' రిపోర్టు వెల్లడించింది.

నాగార్జునకూ ముందే పేమెంట్ చేశాం.. నీవల్లే సినిమా ఆగిపోయింది.. రూ.20 కోట్లు ఇవ్వు: ధనుష్‌ను డిమాండ్ చేస్తున్న ప్రొడ్యూసర్ (PTI)
నాగార్జునకూ ముందే పేమెంట్ చేశాం.. నీవల్లే సినిమా ఆగిపోయింది.. రూ.20 కోట్లు ఇవ్వు: ధనుష్‌ను డిమాండ్ చేస్తున్న ప్రొడ్యూసర్ (PTI)

అసలు గొడవ ఎక్కడ మొదలైంది?

నిర్మాణ సంస్థ తరఫున న్యాయవాది ఎ. చిదంబరం జారీ చేసిన నోటీసుల ప్రకారం.. 2016లో ధనుష్ 'నాన్ రుద్రన్' (Naan Rudran) అనే సినిమా కోసం తేనాండల్ ఫిల్మ్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ సినిమాకు ధనుష్ హీరోగా నటించడమే కాకుండా, దర్శకత్వం కూడా వహించాల్సి ఉంది.

అయితే ప్రాజెక్ట్ మొదలై చాలా ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ పూర్తి కాలేదు. స్క్రిప్ట్ విషయంలో మార్పులు చేర్పులకు నిర్మాణ సంస్థ అంగీకరించినప్పటికీ, ధనుష్ పూర్తి స్థాయి స్క్రీన్ ప్లే అందించడంలో విఫలమయ్యాడని వాళ్లు ఆరోపిస్తున్నారు.

రూ. 20 కోట్ల నష్టం.. నాగార్జున కూడా ఇందులో భాగమే

ఈ సినిమా కోసం తాము దాదాపు రూ. 20 కోట్ల వరకు ఖర్చు చేశామని నిర్మాణ సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టులో ధనుష్‌తో పాటు టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని, ఎస్.జె. సూర్య వంటి బడా స్టార్స్ కూడా నటించాల్సి ఉంది. వారికి అడ్వాన్సుల రూపంలో భారీ మొత్తంలో చెల్లించామని, కానీ ధనుష్ సినిమాను పూర్తి చేయకపోవడంతో ఆ డబ్బు వృధా అయిందని వారు పేర్కొన్నారు.

వేరే సినిమాలకు కాల్ షీట్లు..

ఈ పెండింగ్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయకుండా ధనుష్ ఇతర సినిమాలకు కాల్ షీట్లు ఇచ్చారని, దీనివల్ల తమ సినిమా అర్ధాంతరంగా ఆగిపోయిందని లాయర్ నోటీసులో పేర్కొన్నారు.

జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి తక్షణమే రూ. 20 కోట్ల పరిహారం చెల్లించాలని, లేని పక్షంలో తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నిర్మాణ సంస్థ హెచ్చరించింది. అయితే ఈ వివాదంపై ధనుష్ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ధనుష్ కెరీర్, సినిమాలు..

ఇక ధనుష్ సినిమాల విషయానికి వస్తే గతేడాది అతడు ‘కుబేర’, 'ఇడ్లీ కడై', 'తేరే ఇష్క్ మే' వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. కృతి సనన్ హీరోయిన్‌గా నటించిన రొమాంటిక్ డ్రామా 'తేరే ఇష్క్ మే' మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద రూ. 161.96 కోట్లు వసూలు చేసింది.

ప్రస్తుతం ధనుష్ చేతిలో విగ్నేష్ రాజా దర్శకత్వంలో 'కర' అనే సినిమా ఉంది. డాక్టర్ ఇషారి కె గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్ లో విడుదల కానుంది. అలాగే 'అమరన్' దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామితో 'డీ55' అనే ప్రాజెక్ట్ కూడా లైన్‌లో ఉంది.