నాగార్జునకూ ముందే పేమెంట్ చేశాం.. నీవల్లే సినిమా ఆగిపోయింది.. రూ.20 కోట్లు ఇవ్వు: ధనుష్ను డిమాండ్ చేస్తున్న ప్రొడ్యూసర్
తమిళ స్టార్ హీరో ధనుష్ న్యాయపరమైన చిక్కుల్లో పడ్డాడు. దాదాపు పదేళ్ల కిందట ఒప్పుకున్న ఒక ప్రాజెక్ట్ను పూర్తి చేయలేదనే కారణంతో ప్రముఖ నిర్మాణ సంస్థ 'తేనాండల్ ఫిల్మ్స్' అతనికి లీగల్ నోటీసులు పంపింది. రూ. 20 కోట్లు పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.
కోలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితుడైన స్టార్ హీరో ధనుష్ తాజాగా ఒక భారీ వివాదంలో చిక్కుకున్నాడు. సినిమా షూటింగ్ ఆలస్యం కారణంగా తలెత్తిన ఆర్థిక నష్టాలకు బాధ్యత వహిస్తూ పరిహారం చెల్లించాలంటూ తేనాండల్ ఫిల్మ్స్ అనే నిర్మాణ సంస్థ అతనికి లీగల్ నోటీసులు జారీ చేసినట్లు 'వన్ ఇండియా తమిళ్' రిపోర్టు వెల్లడించింది.

అసలు గొడవ ఎక్కడ మొదలైంది?
నిర్మాణ సంస్థ తరఫున న్యాయవాది ఎ. చిదంబరం జారీ చేసిన నోటీసుల ప్రకారం.. 2016లో ధనుష్ 'నాన్ రుద్రన్' (Naan Rudran) అనే సినిమా కోసం తేనాండల్ ఫిల్మ్స్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ సినిమాకు ధనుష్ హీరోగా నటించడమే కాకుండా, దర్శకత్వం కూడా వహించాల్సి ఉంది.
అయితే ప్రాజెక్ట్ మొదలై చాలా ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ పూర్తి కాలేదు. స్క్రిప్ట్ విషయంలో మార్పులు చేర్పులకు నిర్మాణ సంస్థ అంగీకరించినప్పటికీ, ధనుష్ పూర్తి స్థాయి స్క్రీన్ ప్లే అందించడంలో విఫలమయ్యాడని వాళ్లు ఆరోపిస్తున్నారు.
రూ. 20 కోట్ల నష్టం.. నాగార్జున కూడా ఇందులో భాగమే
ఈ సినిమా కోసం తాము దాదాపు రూ. 20 కోట్ల వరకు ఖర్చు చేశామని నిర్మాణ సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టులో ధనుష్తో పాటు టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని, ఎస్.జె. సూర్య వంటి బడా స్టార్స్ కూడా నటించాల్సి ఉంది. వారికి అడ్వాన్సుల రూపంలో భారీ మొత్తంలో చెల్లించామని, కానీ ధనుష్ సినిమాను పూర్తి చేయకపోవడంతో ఆ డబ్బు వృధా అయిందని వారు పేర్కొన్నారు.
వేరే సినిమాలకు కాల్ షీట్లు..
ఈ పెండింగ్ ప్రాజెక్ట్ను పూర్తి చేయకుండా ధనుష్ ఇతర సినిమాలకు కాల్ షీట్లు ఇచ్చారని, దీనివల్ల తమ సినిమా అర్ధాంతరంగా ఆగిపోయిందని లాయర్ నోటీసులో పేర్కొన్నారు.
జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి తక్షణమే రూ. 20 కోట్ల పరిహారం చెల్లించాలని, లేని పక్షంలో తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నిర్మాణ సంస్థ హెచ్చరించింది. అయితే ఈ వివాదంపై ధనుష్ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ధనుష్ కెరీర్, సినిమాలు..
ఇక ధనుష్ సినిమాల విషయానికి వస్తే గతేడాది అతడు ‘కుబేర’, 'ఇడ్లీ కడై', 'తేరే ఇష్క్ మే' వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. కృతి సనన్ హీరోయిన్గా నటించిన రొమాంటిక్ డ్రామా 'తేరే ఇష్క్ మే' మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద రూ. 161.96 కోట్లు వసూలు చేసింది.
ప్రస్తుతం ధనుష్ చేతిలో విగ్నేష్ రాజా దర్శకత్వంలో 'కర' అనే సినిమా ఉంది. డాక్టర్ ఇషారి కె గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్ లో విడుదల కానుంది. అలాగే 'అమరన్' దర్శకుడు రాజ్కుమార్ పెరియసామితో 'డీ55' అనే ప్రాజెక్ట్ కూడా లైన్లో ఉంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


