Drishyam 3: దయచేసి దృశ్యం 3 స్పాయిలర్స్ పోస్ట్ చేయకండి.. ఆ థ్రిల్ అంతా పాడవుతుంది: అభిమానులకు మీనా రిక్వెస్ట్

Drishyam 3: 'దృశ్యం 3' (Drishyam 3) సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో కథలోని కీలక మలుపులు, క్లైమాక్స్ ట్విస్టులు లీక్ అవుతుండటంతో మూవీ హీరోయిన్ మీనా స్పందించారు. దయచేసి ఎవరూ స్పాయిలర్స్ పోస్ట్ చేయవద్దని, అది సినిమా చూసే మూడ్‌ను పాడు చేస్తుందని ఆమె అభిమానులను కోరారు.

Published on: May 21, 2026, 19:40:31 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Drishyam 3: మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా భారతీయ సినీ రంగంలోనే ఒక క్లాసిక్ థ్రిల్లర్ ఫ్రాంచైజీగా గుర్తింపు తెచ్చుకున్న మూవీ 'దృశ్యం'. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్‌లాల్, మీనా ప్రధాన పాత్రల్లో వచ్చిన 'దృశ్యం' (2013), 'దృశ్యం 2' (2021) చిత్రాలు సంచలన విజయాలు సాధించాయి.

Drishyam 3: దయచేసి దృశ్యం 3 స్పాయిలర్స్ పోస్ట్ చేయకండి.. ఆ థ్రిల్ అంతా పాడవుతుంది: అభిమానులకు మీనా రిక్వెస్ట్
Drishyam 3: దయచేసి దృశ్యం 3 స్పాయిలర్స్ పోస్ట్ చేయకండి.. ఆ థ్రిల్ అంతా పాడవుతుంది: అభిమానులకు మీనా రిక్వెస్ట్

ఇప్పుడు అదే సిరీస్‌లో భాగంగా వచ్చిన 'దృశ్యం 3' గురువారం (మే 21) థియేటర్లలోకి వచ్చింది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. అయితే కొందరు సినిమాలోని సస్పెన్స్ ఎలిమెంట్స్‌ను సోషల్ మీడియాలో పెట్టేస్తుండటంతో చిత్ర యూనిట్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

“చిన్న హింట్ ఇచ్చినా ఎక్స్‌పీరియన్స్ పాడవుతుంది”

సినిమా విడుదలైన కాసేపటికే నటి మీనా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ప్రేక్షకులకు, మోహన్ లాల్ అభిమానులకు ఒక సున్నితమైన విన్నపం చేశారు.

"ప్రియమైన సినీ ప్రేమికులకు, అభిమానులకు నాదొక చిన్న రిక్వెస్ట్. దయచేసి దృశ్యం 3కి సంబంధించిన స్పాయిలర్లను (ట్విస్టులను) ఎక్కడా పోస్ట్ చేయకండి. ఒక చిన్న హింట్ లేదా క్లూ ఇచ్చినా సరే.. సినిమా చూసే ప్రేక్షకుల ఎక్స్‌పీరియన్స్ మొత్తం పాడైపోతుంది. అందరూ అదే ఉత్కంఠతో, థ్రిల్‌తో థియేటర్లలో ఈ సినిమాను చూడనివ్వండి. కొన్ని అనుభవాలను థియేటర్లలో నేరుగా చూస్తేనే ఆ మజా వస్తుంది" అని మీనా రాసుకొచ్చారు.

ఈ రోజు ఉదయం మోహన్‌లాల్, 'దృశ్యం 3' చిత్ర బృందంతో కలిసి మీనా థియేటర్‌కు వెళ్లి అభిమానుల మధ్య కూర్చొని సినిమా వీక్షించారు.

అభిమానుల ప్రేమకు మోహన్‌లాల్ కృతజ్ఞతలు

తమ ప్రియతమ నటుడు 'జార్జ్‌కుట్టి'గా మళ్లీ స్క్రీన్‌పై అదరగొట్టడం, పైగా ఆయన పుట్టినరోజే సినిమా రిలీజ్ కావడంతో మోహన్‌లాల్ అభిమానులు థియేటర్ల వద్ద పండగ చేసుకుంటున్నారు. ఈ భారీ రెస్పాన్స్‌పై మోహన్‌లాల్ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రత్యేక పోస్టర్‌ను పంచుకుంటూ భావోద్వేగ నోట్ రాశారు.

" 'దృశ్యం 3' చిత్రాన్ని ఎంతో ప్రేమతో, ప్యాషన్‌తో, కృతజ్ఞతాభావంతో నిర్మించాం. దానికి మీ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే నా మనసు నిండిపోయింది" అని అన్నారు.

"మీరు ఇస్తున్న రివ్యూలు, మీ మాటలు, మీ ఎమోషన్స్ నాకు ఏ బాక్సాఫీస్ నంబర్ల కంటే కూడా చాలా చాలా ఎక్కువ. జార్జ్‌కుట్టి, అతని కుటుంబాన్ని మీ సొంత కుటుంబంలా ఆదరిస్తున్నందుకు, ప్రతి క్షణాన్ని ఫీల్ అవుతున్నందుకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు" అని మోహన్‌లాల్ పేర్కొన్నారు.

'దృశ్యం 3' కథేంటి?

ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోనీ పెరుంబావూర్ నిర్మించిన ఈ చిత్రానికి విమర్శకుల నుంచి మిక్స్‌డ్ రివ్యూలు వస్తున్నాయి. కథ పరంగా చూస్తే.. గత రెండు భాగాల్లో జరిగిన సంఘటనల నుండి జార్జ్‌కుట్టి కుటుంబం బయటపడి, జీవితంలో ముందుకు సాగాలని చూస్తుంది.

ఇంట్లో ఒక శుభకార్యం (పెద్ద కూతురు పెళ్లి) జరగబోయే సమయం అది. కానీ జార్జ్‌కుట్టి మైండ్ మాత్రం నిరంతరం భయంతో, అనుమానంతోనే ఉంటుంది. ఆయన భయపడినట్లే.. గతంలో తాము చేసిన తప్పులకు ప్రతికారం తీర్చుకోవడానికి పాత శత్రువులు మళ్లీ వీరి జీవితాల్లోకి వస్తారు. మరి ఈసారి జార్జ్‌కుట్టి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? అనేదే 'దృశ్యం 3' కథ.

ఈ సినిమా ముగింపు చూసిన ప్రేక్షకులు.. కథ ఇక్కడితో అవ్వలేదని, 'దృశ్యం 4' కి దర్శకుడు జీతూ జోసెఫ్ గట్టి పునాది వేశారని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. మోహన్‌లాల్ కూడా గతంలో మాట్లాడుతూ.. ఈ సినిమా ఆడే దాన్ని బట్టి పార్ట్ 4, పార్ట్ 5 కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని హింట్ ఇచ్చారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More