ఓటీటీలోకి హిస్టారికల్ డ్రామా వెబ్ సిరీస్ రెండో సీజన్.. ఈసారి దేశ విభజన, రక్తపాతంతో నిండిపోనున్న సిరీస్.. ట్రైలర్ రిలీజ్
ఓటీటీలోకి హిస్టారికల్ డ్రామా వెబ్ సిరీస్ ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్ సీజన్ 2 వచ్చేస్తోంది. మంగళవారం (డిసెంబర్ 9) ఈ కొత్త సీజన్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. వచ్చే నెలలో ఈ సీజన్ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు.
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హిస్టారికల్ డ్రామా సిరీస్ 'ఫ్రీడం ఎట్ మిడ్నైట్' (Freedom At Midnight) రెండో సీజన్ రాబోతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటు మొదటి ట్రైలర్ను కూడా మేకర్స్ తాజాగా విడుదల చేశారు. మొదటి సీజన్ కంటే మరింత ఉద్వేగభరితమైన, ఉద్రిక్తమైన సన్నివేశాలతో ఈ సీజన్ ఉండబోతోందని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. "మీరు తప్పక తెలుసుకోవాల్సిన చరిత్ర" అంటూ మేకర్స్ ఈ సీజన్ను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఈ సీజన్ దేశ విభజన, దాని తాలూకు రక్తపాతం చుట్టూ తిరగనుంది.

స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ?
ఫ్రీడం ఎట్ మిడ్నైట్.. గతేడాది చివర్లో సోనీ లివ్ ఓటీటీలోకి వచ్చిన వెబ్ సిరీస్ ఇది. దేశ స్వాతంత్య్రోద్యమం చుట్టూ తిరుగుతూ ఇప్పటి వరకూ తెలియని చరిత్రను ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఇక ఇప్పుడు రెండో సీజన్ తో రానుంది.
దీనికి సంబంధించిన ట్రైలర్తో పాటు విడుదల తేదీని కూడా మేకర్స్ ప్రకటించారు. ఈ సిరీస్ జనవరి 9, 2026 నుండి స్ట్రీమింగ్ కానుంది. మొదటి సీజన్ లాగే ఇది కూడా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ సోనీ లివ్ (SonyLIV)లో అందుబాటులో ఉంటుంది. హిందీ, తెలుగు సహా మొత్తం 8 భాషల్లో స్ట్రీమింగ్ కానుండటం విశేషం.
ట్రైలర్ ఏం చెబుతోంది?
అఖండ భారతావనిని రెండు దేశాలుగా విడదీయడం చుట్టూ ఈ సీజన్ కథ నడుస్తుంది. 1947లో జరిగిన భారత్-పాకిస్తాన్ విభజనకు నాంది పలికిన పరిణామాలను, ఆ సమయంలో జరిగిన రాజకీయ చదరంగాన్ని ఇందులో చూపించనున్నారు.
దేశ విభజన మ్యాప్ గీస్తున్నప్పుడు తలెత్తిన పరిస్థితులు, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, మహమ్మద్ ఆలీ జిన్నా వంటి అగ్రనేతల దృక్కోణాలను ఈ సీజన్లో లోతుగా ఆవిష్కరించబోతున్నారు. ఒక గీత గీయడం వల్ల దేశం ఎలా ముక్కలైంది? దాని పర్యవసానాలు ఎలా ఉన్నాయనేది ఉత్కంఠభరితంగా ఉండబోతోంది.
'ఫ్రీడం ఎట్ మిడ్నైట్' నేపథ్యం
బ్రిటీష్ పాలన నుండి భారతదేశానికి స్వాతంత్య్రం రావడం, అదే సమయంలో దేశ విభజన వల్ల జరిగిన రక్తపాతం చుట్టూ ఈ సిరీస్ తిరుగుతుంది. లారీ కాలిన్స్, డొమినిక్ లాపియరీ రాసిన ప్రసిద్ధ నాన్-ఫిక్షన్ బుక్ 'ఫ్రీడం ఎట్ మిడ్నైట్' (1975) ఆధారంగా ఈ సిరీస్ను రూపొందించారు. ఈ పుస్తకం మార్కెట్లోకి రాగానే బెస్ట్ సెల్లర్గా నిలిచింది.
ఈ ఫ్రీడం ఎట్ మిడ్నైట్ వెబ్ సిరీస్లో సిద్ధాంత్ గుప్తా (నెహ్రూ), చిరాగ్ వోరా (గాంధీ), ఆరిఫ్ జకారియా (జిన్నా), రాజేంద్ర చావ్లా (సర్దార్ పటేల్) వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నిఖిల్ అద్వానీ ఈ సిరీస్కు షో రన్నర్గా వ్యవహరిస్తున్నాడు.

E-Paper












