ఓటీటీలోని ఈ తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ చూశారా? తెలుగులోనూ స్ట్రీమింగ్.. అస్సలు మిస్ కావద్దు
ఓటీటీలోకి తాజాగా వచ్చిన తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కుట్రమ్ పురింధవన్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. గ్రిప్పింగ్ నెరేషన్ తో సాగిపోయే ఈ సిరీస్ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇదో మస్ట్ వాచ్ అని చెప్పొచ్చు.
ఓటీటీలో మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ తమిళ వెబ్ సిరీస్ పేరు కుట్రమ్ పురింధవన్ (Kuttram Purindhavan). ఈ సిరీస్ సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. పశుపతి, లిజీ ఆంటోనీ, విదార్థ్ లాంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీల్లోనూ చూడొచ్చు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రివ్యూలు వస్తున్నాయి. మరి ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఎందుకు చూడాలో తెలుసుకోండి.

కట్టిపడేసే క్రైమ్ డ్రామా
ఇదొక కనిపించకుండా పోయిన 12 ఏళ్ల అమ్మాయి చుట్టూ తిరిగే కథ. ఒక దారుణమైన నేరం చుట్టూ ఈ వెబ్ సిరీస్ తిరుగుతుంది. ఎపిసోడిక్ ఫార్మాట్లో సాగే ఈ కథనం తర్వాతి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠను రేపుతుంది. దీంతో వరుసబెట్టి అన్ని ఎపిసోడ్లను ఒకేసారి బింజ్ వాచ్ చేసేలా చేస్తుంది. ఇందులో మొత్తం 7 ఎపిసోడ్లు ఉన్నాయి. తొలి ఎపిసోడ్ నుంచే కథ చాలా ఆసక్తి రేపుతుంది.
పశుపతి 'విశ్వరూపం'
తన కెరీర్లో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించిన పశుపతి.. ఈ సిరీస్లో మరోసారి తన నటనతో మెస్మరైజ్ చేశాడు. ఇందులో అతడు భాస్కరన్ అనే ప్రభుత్వ ఫార్మసిస్ట్గా కనిపిస్తాడు. తప్పిపోయిన అమ్మాయి కేసులో ఒక కీలక విషయం తెలుసుకున్న భాస్కరన్.. ఆ నిజాన్ని బయటపెట్టలేక, దాచలేక సతమతమవుతాడు. ఒకవైపు అనారోగ్యంతో ఉన్న తన మనవడిపై ప్రేమ, మరోవైపు అపరాధ భావం మధ్య నలిగిపోయే పాత్రలో పశుపతి జీవించాడు.
'దృశ్యం' తరహా క్లైమాక్స్
ఈ వెబ్ సిరీస్లో 'దృశ్యం' (Drishyam) సినిమాను గుర్తుచేసే క్షణాలు ఉన్నాయి. ఆ డెడ్ బాడీ ఏమైంది? అనే మిస్టరీ సిరీస్లోని పాత్రలకు అంతుచిక్కకపోయినా, ప్రేక్షకులకు మాత్రం ఏం జరిగిందో ఒక క్లారిటీ ఇస్తారు. ముఖ్యంగా క్లైమాక్స్లో ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ ద్వారా ఆ మిస్టరీ వీడటం, కథకు ఒక న్యాయం జరిగిన భావనను కలిగిస్తుంది. ఇది మంచి థ్రిల్ పంచుతుంది.
రొటీన్ కథ కాదు..
సాధారణంగా క్రైమ్ థ్రిల్లర్లు ఒక నేరం చుట్టూ, దాన్ని ఛేదించే పోలీస్ చుట్టూ తిరుగుతాయి. కానీ 'కుట్రమ్ పురింధవన్' ఆ రొటీన్ ఫార్మాట్ ను బ్రేక్ చేసింది. ఇందులో ఫోకస్ అంతా నేరం చేసిన వాడిపై కాదు.. ఆ నేరం గురించి తెలిసి, ఆ నిజాన్ని మోస్తున్న సామాన్యుడిపై ఉంటుంది. సగం నిజం మాత్రమే తెలిసినప్పుడు మనిషి పడే సంఘర్షణను మేకర్స్ ఇందులో అద్భుతంగా చూపించారు.
సున్నితమైన సబ్జెక్ట్ అయినా..
సమాజంలో మహిళలపై జరుగుతున్న నేరాలను ఇందులో మనసులు కదిలించేలా చూపించారు. అసలు నేరాన్ని జరిగిన తీరును చూపించకుండా అది ఎంత దారుణంగా ఉంటుందో కళ్లకు కట్టేలా చెప్పిన తీరు బాగుంది. సున్నితమైన అంశాన్ని ఎక్కడా పరిధి దాటకుండా డీల్ చేసిన విధానం నచ్చుతుంది.

E-Paper












